Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఎందరో మహానుభావులు – అందరికీ వందనాలు - భమిడిపాటిఫణిబాబు

endaro mahanubhavulu andarikee vandanaalu

జయంతులు

సెప్టెంబర్ 7

శ్రీ జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రి :  వీరు సెప్టెంబర్ 7, 1914 న బందరు లో జన్మించారు. జరుక్ శాస్త్రిగా ప్రసిధ్ధి చెందారు. తెలుగు సాహిత్యంలో పేరడీలకు ఆద్యుడిగా పేరు పొందారు. పేరడీలకే కాకుండా, సాహిత్యంలోని అన్ని ప్రక్రియలలోనూ ప్రవేశముంది. తెనాలి రామకృష్ణ తరువాత, వికటకవిగా పేరు పొందారు.

శ్రిమతి పాలువాయి భానుమతి  : వీరు, సెప్టెంబర్ 7 ,1926 న ఒంగోలు లో జన్మించారు. ప్రముఖ చలనచిత్ర నటి, నిర్మాత, దర్శకురాలు,  గాయని, సంగిత దర్శకురాలు… ఇవే కాకుండా ప్రసిధ్ధ రచయిత్రి కూడా.. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు.  వీరు సృష్టించిన “ అత్తగారు “ పాత్ర ఎంతొ పేరుపొందింది.

సెప్టెంబర్ 8

శ్రీ త్రిపురనేని గోపీచంద్ :  వీరు సెప్టెంబర్ 8, 1910 న అంగలూరు లో జన్మించారు. సంపూర్ణ మానవతావాది, తెలుగు రచయిత, హేతువాది, సాహితీవేత్త, తెలుగు సినిమా దర్శకుడు.   వీరి  రచనలలో విలువల మధ్య పోరాటం ముఖ్యముగా చెప్పుకోతగినది. ఆయన వ్రాసిన అసమర్థుని జీవయాత్ర తెలుగులో మొదటి మనో వైజ్ఞానిక నవల. 1963లో పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది

సెప్టెంబర్ 9

శ్రీ కాళోజీ నారాయణ రావు : వీరు సెప్టెంబర్ 9, 1914 న రట్టిహళ్ళి లో జన్మించారు. ఆయన తెలంగాణ ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతాడు. ఆయన రాజకీయ సాంఘిక చైతన్యాల సమాహారం.కవిత్వం వ్రాసిన ప్రజాకవి. హక్కులడిగిన ప్రజల మనిషి. ఉద్యమం నడిపిన ప్రజావాది. మొత్తంగా తెలంగాణ జీవిత చలనశీలి కాళోజి.పుట్టుక, చావులు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, వైతాళికుడు.

సెప్టెంబర్ 10

శ్రీ వడ్డాది పాపయ్య : వీరు సెప్టెంబర్ 10, 1921 న శ్రీకాకుళం లో జన్మించారు.  ప్రాచీన సాహిత్యాన్ని అకళింపు చేసుకొని తన కుంచెకు సాహితీ సౌరభాన్ని పులిమి చిత్రాలను చిత్రించిన ప్రత్యేక చిత్రకారుడు వడ్డాది పాపయ్యగారి .గీతకు అర్థం ఉంటుంది. రూపానికి ఆహ్లాదం ఉంటుంది. కొన్ని స్ట్రోక్స్ కలసి రూపం అవుతుంది. దానిలో గీతలు రూపంలోని ఆనందానుభూతిగా వెల్లివిరుస్తుంది.

వర్ధంతులు

సెప్టెంబర్ 8

శ్రీ పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు : “ ఉషశ్రీ “ గా ప్రసిధ్ధులు.  ప్రసిధ్ధ ప్రవచనకారులు.  ప్రఖ్యాతి గాంచిన రేడియో వ్యాఖ్యాత మరియు సాహిత్య రచయిత. ఉషశ్రీ గారు తన రామాయణ భారత ప్రవచనాల ద్వారా తెలుగునాట అందరికీ సుపరిచితులు. ఆప్పట్లో ఆయన గొంతుని, మాట సరళిని గుర్తు పట్టలేని తెలుగు శ్రోత లేరంటె అది అతిశయోక్తి కాబోదు. వీరు సెప్టెంబర్  7, 1990 న స్వర్గస్థులయారు.

సెప్టెంబర్ 8.

శ్రీ గరికపాటి రాజారావు :  తెలుగు సినిమా దర్శకుడు, నాటకరంగ ప్రముఖుడు,ఆంధ్ర ప్రజానాట్యమండలివ్యవస్థాపకుడు.వృత్తి రీత్యా వైద్యుడైన రాజారావు ఉచితంగా వైద్యసేవలు అందించడానికి విజయవాడలోని పోరంకిలో ప్రజా వైద్యశాల నెలకొల్పి ఫీజులు తీసుకోకుండా మందులు కూడా తనే కొనుగోలు చేసి ఉచితంగా రోగులకు సేవ చేసేవారు.. కొంతకాలం రాజమండ్రిలోనూ ప్రజావైద్యశాల నిర్వహించారు. వీరు సెప్టెంబర్ 8, 1963 న స్వర్గస్థులయారు.

శ్రీ మద్దూరి వేణుగోపాల్ : “ మాస్టర్ వేణు “ గా సుపరిచితులి. ప్రఖ్యాత తెలుగు సినిమా సంగీత దర్శకుడు. విజయా వారు అమెరికా నుండి "హేమాండ్ ఆర్గాన్" అనే కొత్త వాద్యాన్ని ఆ రోజుల్లో పదహారు వేల రూపాయలకు ఆర్డర్ ఇచ్చి తెప్పించారు. ఈ వాద్యాన్ని అప్పట్లో వేణు తప్ప ఎవ్వరూ వాయించలేకపోయేవారు. ఆ వాద్యాన్ని "గుణసుందరి కథ", "పాతాళభైరవి" మరియు "మల్లీశ్వరి" తదితర చిత్రాల్లో ఉపయోగించారు. ఎన్నో విజయవంతమైన సినిమాలకు పాటలు స్వరపరిచారు. వీరు సెప్టెంబర్ 8, 1981 న స్వర్గస్థులయారు.

సెప్టెంబర్ 11

1.శ్రీ ప్రయాగ నరశింహ శాస్త్రి :  ప్రముఖ ఆకాశవాణి ప్రయోక్త, నటుడు. తన ప్రత్యేక కంఠస్వరంతో ఖంగుమని పలుకుతూ, జానపద శైలిలో పాడుతూ శ్రోతల్ని వుర్రూత లూగించేవారు.  స్క్రిప్టు లేకుండా యధాలాపంగా అనర్గళంగా తన సంభాషణలతో వినోదాన్ని అందించేవారు శ్రీ ప్రయాగ..వీరు సెప్టెంబర్ 11, 1983 న స్వర్గస్థులయారు.

2 శ్రీమతి గోవిందరాజు సీతాదేవి :  ప్రముఖ కథా/నవలా రచయిత్రి. ఈమె 300కు పైగా చిన్నకథలు, 21 నవలలు రాసింది. ఆమె రాసిన తాతయ్య గర్ల్‌ఫ్రెండ్, ఆశలపల్లకి నవలలు సినిమాలుగా వచ్చాయి. అనేక అవార్డులు, పురస్కారాలు ఈమెను వరించాయి. ప్రముఖ నవలారచయిత్రి యద్దనపూడి సులోచనారాణి ఈమెకు సొంత చెల్లెలు..వీరు సెప్టెంబర్ 11, 2014 న స్వర్గస్థులయారు.

మరిన్ని శీర్షికలు
karnataka  viharayatralu