రాష్ట్రం విడిపోయినా కలిసే ఉన్నా తెలుగు సినీ పరిశ్రమకు వచ్చిన కష్టమేమీ ఉండదని సినీ ప్రముఖులు చెప్పడం వింటునే ఉన్నాం. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలతో తెలుగు సినీ పరిశ్రమ తీవ్రంగానే నష్టపోయింది. కొన్ని సినిమాలపై దాడులు జరిగాయి. దాంతో ఉద్యమాల విషయంలో సినిమా వారు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
అదలా ఉంచితే, రాష్ట్రం విడిపోయేందుకు వాతావరణం అనుకూలంగా మారుతోంది. కేంద్రం వేస్తున్న వడి వడి అడుగులతో, తెలుగు సినిమా పరిశ్రమ కూడా అప్రమత్తమవుతోందంటున్నారు. రాష్ట్రం విడిపోతే, హైదరాబాద్తోపాటు, సీమాంధ్రలో ఇంకో చోట కూడా తెలుగు సినీ పరిశ్రమ విస్తరించేందుకు అవకాశం ఏర్పడుతుంది. అలా డ్రీమ్ డెస్టినేషన్స్ గురించి ఆలోచిస్తే మొదటి స్థానం వైజాగే. అక్కడ ఇదివరకే రామానాయుడు స్టూడియో వెలిసింది.
కొత్త రాష్ట్రం సినిమా పరిశ్రమను ప్రోత్సహిస్తుంది కాబట్టి, అక్కడ ఇంకో ఫిలింనగర్ ఏర్పాటు జరుగుతుందని భావిస్తున్న సినిమా పరిశ్రమకు చెందినవారు, అక్కడ కూడా ఓ ‘బేస్’ని ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇప్పటినుంచే వైజాగ్లో సినిమా పరిశ్రమ ఎదిగేందుకు, తాము స్థిరపడేందుకు తగిన స్థలాల గురించి వాకబు చేస్తున్నారు. ప్రభుత్వం ఖచ్చితంగా తమకు స్థలాలు కేటాయిస్తుందనే ఆలోచనతో ఉన్నారు సినీ ప్రముఖులు.
|