Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
help

ఈ సంచికలో >> శీర్షికలు >>

ప్రివెంటివ్ మెయిన్టెనెన్స్ - భమిడిపాటి ఫణిబాబు

Preventive Maintenance

మన కర్మాగారాల్లో చూడండి, యంత్రాలు అకస్మాత్తుగా  పనిచేయడం మానేస్తే నానా గొడవా అయిపోతుంది.ఉత్పత్తులు ఆగిపోతాయి, వారు పెట్టుకున్న టార్గెట్ చేరుకోపోవచ్చు. కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోయి, చివరకు కంపెనీయే మూసేయాల్సిన పరిస్థితి కూడా రావొచ్చు. ఈ ఆధునిక యుగంలో అలాటి avoidable సమస్యలు రాకుండా, కొత్తగా ప్రివెంటివ్ మెయిన్టెనెన్స్ (preventive maintainance) అని ఒకటి మొదలెట్టారు. అది ఒక యంత్రాలకే కాదు, మన జీవితాలలో కూడా ఆచరిస్తే, జీవితంలో ఏ సమస్యా రాకుండా చూసుకోవచ్చు. కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు. కానీ మనసు పెట్టి ఆలోచిస్తే మాత్రం, తప్పకుండా ఒప్పుకుంటారు. ఉమ్మడి కుటుంబాలు వినడానికి చాలా ఆదర్శప్రాయంగానే ఉంటాయి. వాటిని ఈ రోజుల్లో చూడకపోవడానికి , కారణాలు అనేకం.  ఛాన్సొస్తే తప్పంతా ఈ తరం కుర్రాళ్ళదే అంటారు. కానీ అంత వయసొచ్చి ఈ పెద్దాళ్ళు మాత్రం చేస్తున్నదేమిటీ? రెండు కోణాలలోనూ ఆలోచిస్తే చివరకి తప్పు ఇద్దరిదీ అని అందరూ ఒప్పుకుంటారు.అసలు అలాటి గొడవలే లేకుండగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటే పోలేదూ?

పెళ్ళి అయినప్పటినుండీ ప్రతీ కుర్రాడికీ, ఓ మైకం కమ్మేస్తుంది.ప్రతీదానికీ కళ్ళు మూసేసుకుంటాడు.పెళ్ళి అయిన తరువాత, 'మంచిమనసులు' సినిమాలోని పాట “కనులు లేవని కలతపడవలదూ, నా కనులు నీకనులు చేసికొని చూడూ' శిలలపై శిల్పాలు చెక్కినారూ” పాటలో ఓ చరణం ఇది.అక్కడ జానకి కి కళ్ళులేవని, నాగేశ్వర్రావు ఈ పాట పాడాడు, ఇక్కడ పెళ్ళి అయిన తరువాత ప్రతీ భార్యా పాడే పాట ఇది.

ఏ విషయం తీసికోండి, భార్య సలహా లేనిదే ఏ పనీ అవదు.ఓ ఇల్లు కట్టుకుందామనుకుంటే, అదేమి చిత్రమో అత్తారి ఊరులోనే స్థలాలు కనిపిస్తాయి.నూటికి 50 మందిదాకా అత్తవారి ఊరులోనే ఇల్లు కట్టడమో, కొనడమో చేస్తారు. తల్లితండ్రులున్న ఊరిలో కొందామంటే, వాళ్ళు ఏమైనా ఆక్రమించేస్తారో అని భయం అనండి,లేకపోతే, ఏ కారణం చేతైనా వాళ్ళీ ఇంట్లోకి వస్తే అద్దె అడగడం బాగోదనండి, ఇంకేదీ కాకపోతే ఇల్లు కట్టేటప్పుడు మామగారితో సంబంధబాంధవ్యాలు ఇంకా మెరుగౌతాయనో, ఏవేవో కారణాలవల్ల అత్తారి ఊరిలో సెటిల్ అయిపోతాడు.

ఇంట్లో మనవడో, మనవరాలో ఉందనుకోండి, ఇంక అన్నీ గొడవలే ప్రతీదానికీ,అలాగని ఏదో ప్రాణాంతకమనికాదు. పిల్లలు తినే తిండి దగ్గర-- కోడలేమో ఆ పుస్తకాలూ, ఈ పుస్తకాలూ, నెట్లూ చదివి  ఏదో ప్రొటీన్లూ,కార్బోహైడ్రేట్లూ అంటూ ఆకులూ, అలమలూ, బ్రెడ్డూ,బటరూ, కార్న్ ఫ్లేక్సూ, పాలూ,పాపాలూ అంటూ పిల్లల ప్రాణాలు తీసేస్తుంది. అవన్నీ డెఫినెట్ గా ఆరోగ్యకరమైనవే కాదనం, వాళ్ళు అవన్నీ తింటూంటే ఈ పెద్దాళ్ళు కూరలూ,పచ్చళ్ళూ,ఊరగాయలూ వేసికుని తింటే ఎలా? మార్కెట్ కి వెళ్ళినప్పుడు కొన్నికొన్ని కూరగాయలు అసలు తీసికునే రారు, కూరలే లేకపోతే గొడవే లేదు.ఎప్పుడైనా సరదా పడి ఆ పిల్లలకి ఏదైనా పెట్టామా,ఇంక చూసుకోండి “ మావయ్యగారూ, పిల్లలకి లేనిపోని అలవాట్లు చేయకండి, అసలే వాడు వీక్కూ, దానికి సాయం మీతో ఊరగాయా అవీ తింటే వాడికి కండెప్పుడు పడుతుందీ” అంటుంది. ఈయననుకుంటాడూ, ఒక్కరోజు ఊరగాయ తింటే వచ్చిన నష్టం ఏమిటంట? ఏరా అబ్బాయీ, ఇదేనా పధ్ధతీ పెద్దాళ్ళతో మాట్లాడడం అని మీ ఆవిడకోసారి చెప్పు అంటాడీపెద్దాయన. స్కూలికి వెళ్ళే పిల్లలుంటే ప్రతీ రోజూ వాళ్ళ దినసరి కార్యక్రమాలు చూసి ఈ పెద్దాళ్ళకి గుండె చెరువైపోతూంటుంది.స్కూలూ, ట్యూషన్లూ, మ్యూజిక్ క్లాసులూ, డ్రాయింగు క్లాసులూ,ఇంకో క్లాసులూ. రోజు రోజంతా ఇవన్నీ అవసరమా అని ఈ పెద్దాయన అన్నాడనుకోండి, ఆ కోడలంటుందీ '“ఈ రోజుల్లో ఆల్ రౌండ్ డెవెలప్మెంటుకి ఇవన్నీ కావాలీ, మీ రోజుల్లోలా కాదుగా” అని.

ఇదివరకటి రోజుల్లోలాగ ఏదో మామగారంటే భయం,భక్తీ ఉండాలనడం లేదు, మరీ చిన్న పిల్లలెదురుగుండా క్లాసు తీసికోవలసిన అవసరం లేదుకదా అనుకుంటాడీ పెద్దాయన. ఇంత గొడవౌతున్నా ఈయనగారి కొడుకు ( భార్య కనులే తన కనులుగా చేసికొని లోకాన్ని చూస్తున్న హీరో), ఏమీ పట్టనట్టుగా హాయిగా తన రూంలోకి వెళ్ళి ఏదో పేద్ద పనున్నట్లు, ల్యాప్టాప్ ఓపెన్ చేసేసికుని కూర్చుంటాడు, ప్రాణానికి హాయి. వాళ్ళమానాన్ని వాళ్ళే కొట్టుకుంటారు,ఓపికున్నంతసేపూ అనుకుంటాడు, తనేమైనా ఆర్చేవాడా తీర్చేవాడా?

ఇంట్లో ఉన్న చిన్నపిల్లల్ని ఏమీ అనకూడదు. వాళ్ళేం చేసినా నోరుమూసుకుని కూర్చోవాల్సిందే. హాల్లో బాల్ తో ఆడితే, ఏ టి.వీ మీద పడుతుందో అని ఈ పెద్దాయనకి భయం, పోనీ వద్దురా అని చెప్తే ఆ పిల్లాడెలాగూ వినడు, పైగా కోడలికి కోపం వస్తుంది.వాయిస్ పెంచితే తప్పు, ఏక్ దం లో డెసిబుల్  లోనే చెప్పాలి, అంత ఓపికెక్కడిదీ ఈయనకి.వీళ్ళిద్దరి బి.పీ పెరిగిపోతుంది.ఈ పిల్లలు మెళుకువగా ఉన్నంతసేపూ, టి.వీ లో పిల్లలకి నచ్చిందితప్ప ఇంకే కార్యక్రమమూ చూడకూడదు. ఇంట్లో ఎన్ని టి.వీ లున్నాసరే ,కారణం ఈ పిల్లలు కూడా తాతయ్యలూ, నానమ్మలూ చూసే టి.వీ దగ్గరకే వచ్చి ఒళ్ళో కూర్చుంటారు! రోజంతా టి.వీ చూస్తూనే ఉంటారుకదా, పోనీ పిల్లలు ఇంటికి వచ్చేక, వాళ్ళకి కావలిసిందేదో చూడనివ్వక ఊరికే గొడవా అని విసుక్కుంటారు.

ఇవి కాకుండా ఈ మధ్యన ప్రతీవాళ్ళూ తమ పిల్లలకి, ఐపాడ్లూ అవీ విచ్చలవిడిగా ఇచ్చేస్తున్నారు. ఆ పిల్లా/పిల్లాడి వయస్సు ఎంతైనా సరే. దీనితో ఏమౌతోందంటే, ఇవన్నీ రాకముందు పిల్లలు, ఏ పుస్తకమో, బుక్కో చదువుకునే వారు, ఇప్పుడు ఈ ఐపాడ్లు వచ్చినతరువాత, ఆ అలవాట్లు అన్నీ పోయాయి.ఐపాడ్డే లోకమైపోయింది.పొనీ ఇంకో రెండుమూడేళ్ళు పోయిన తరువాత ఇవ్వవలిసిందేమో అని ఈ పెద్దాయన అనగానే, “ మావయ్యగారూ, మీకేం తెలియదు, దీని ఫ్రెండ్సందరిదగ్గరా లేటెస్ట్ గాడ్జెట్స్ ఉన్నాయీ, దీనిదగ్గర లేకపోతే చిన్నబుచ్చుకుంటుంది”

ఇదివరకటిరోజుల్లో ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నప్పుడు, ఇంటి పెద్ద మాటే చెల్లేది.కారణాలు ఎన్నో కావచ్చు.మొదటిది, ఆ రోజుల్లో పెద్దవారంటే ఉండే గౌరవం కావచ్చు. ఆస్థి అంతా ఆ పెద్దాయన పేరునే ఉండిఉండొచ్చు.ఊరికే దెబ్బలాటలు పెట్టుకుంటే, ఆస్థి ఇవ్వరేమో అనే భయం అవొచ్చు.అప్పుడైనా 'అండర్ కరెంట్స్' ఉండేవి.ఓ కొడుకు బాగా సంపాదించేవాడయుండొచ్చు,ఇంకోడు సామాన్య ఉద్యోగి అయిఉండొచ్చు. ఓ కోడలు పేద్ద కట్నంతో వచ్చుండొచ్చు,ఇంకో కోడలు సామాన్య కుటుంబంలోంచి వచ్చుండొచ్చు కాలక్రమేణా రోజులు మారేకొద్దీ, ఎవరి కాపురాలు వాళ్ళు పెట్టుకున్న తరువాత అందరూ సుఖపడ్డారు. విడిగా ఉండడంలో ఉన్న సదుపాయాలు ఇటు తండ్రులకీ తెలిసింది, అటు కొడుకులకీ తెలిసింది.ఎవరి స్పేస్ వారికున్నప్పుడే అందరికీ హాయి. గ్రౌండ్ రియాలిటీస్ అర్ధం చేసికున్నంత కాలం, ఎవరు ఎక్కడున్నా ఒక్కటే. ఊరికే సొసైటీ కోసం 'ఉమ్మడికుటుంబం' లో ఉండి బి.పీ లు పెంచుకోవడంకన్నా విడివిడిగా ఉంటే, వారానికో,పదిహెను రోజులకో కలిసినప్పుడు, ఆత్మీయంగా ఉంటారు.మనవలూ,మనవరాళ్ళూ తాతయ్యా అంటూ పలకరిస్తారు.

అలాగని పిల్లలు అంటే కొడుకులూ,కూతుళ్ళూ రాక్షసులనీ, పెద్దవాళ్ళంటేగౌరవం లేనివారనీ కాదు. వారి కష్టాలు వారికీ ఉన్నాయి.  పెద్దవారు మాత్రం తక్కువ తిన్నారా? వాళ్ళ సుకరాలు వాళ్ళకీ ఉన్నాయి.ఉదాహరణకి ఇంట్లో చదువుకునే పిల్లలున్నాసరే, వారి వారి కార్యక్రమాలకి అడ్డుండకూడదు.టైమయ్యేసరికి టి.వీ ముందర సెటిల్ అయిపోతారు.అందులో కథ ఎంతదాకా వచ్చిందో తెలిసికోకపోతే నిద్ర పట్టదు. పోనీ మర్నాడు పిల్లలు స్కూలుకి వెళ్ళిన తరువాత తీరికగా చూడొచ్చు కదా.కొడుకు ఇల్లూ, తమకి అధికారం ఉందీ అనే అనుకుంటారు. పిల్లలు చదువు మానేసి మామ్మ, తాతయ్యలతో టి.వి. చూస్తూకూర్చుంటానంటే ఎలా కుదురుతుందీ? అసలు గొడవలన్నీ ఈ టి.వీ ల వల్లే  వస్తున్నాయి.పిల్లలకి కార్టూన్లూ, పెద్దవాళ్ళకి సీరియల్సూ, పెద్దాయనకి న్యూసూ కావాలి. మరి ఒకే ఇంటిలో ఇన్ని రకరకాల చాయిస్ లు అయితే, అక్కడ కొట్టుకోకుండా ఉంటారని ఎలా అనుకుంటాము? మరి కోడలుకి చిర్రెత్తిందంటే చిర్రెత్తదూ? ఈ పెద్దాళ్ళు మహా ఉంటే ఇంకో పదిహేనేళ్ళుంటారు, పిల్లల భవిష్యత్తు తల్లేకదా చూసుకునేది.

ఇంట్లో పిల్లలకి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిందనుకోండి, ఈ పెద్దాళ్ళు తమకి తెలిసున్న కషాయాలూ, రసాలూ వాడితే చాలని ఊదరకొట్టేస్తూంటారు. పిడుక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అంటే ఎలాగ? వీళ్ళని నమ్ముకుని, డాక్టరు దగ్గరకు తీసుకెళ్ళకపోతే అంతే సంగతులు! ఈ మాత్రం తెలియదనుకోవడానికి వీల్లేదు, వాళ్ళ పెద్దరికం చూపించుకోడానికి ఉచిత సలహాలిచ్చేస్తూంటారు. పోనీ  అలాగని వాళ్ళకేమైనా వచ్చిందంటే, డాక్టరుదగ్గరకు తీసికెళ్ళేదాకా ఇల్లు పీకి పందిరేసేస్తారు, అప్పుడు రసాలూ,కషాయాలూ మర్చిపోతారు, 'తమదాకా వస్తే' రూల్స్ మారిపోతాయి. పైగా ఎన్ని టెస్టులు చేయిస్తే అంత బాగా చూసుకున్నట్లు!లేదూ, “ మావాడికి పాపం వైద్యం చేయించాలనే ఉంటుంది, కానీ మా కోడలు సాగనివ్వదు” అంటూ అడిగినవాళ్ళకీ, అడగనివాళ్ళకీ చెప్పుకొస్తారు. కూతురు కూడా అదే ఊళ్ళో ఉంటే ఇంకా కాలక్షేపం!

ఈ రోజుల్లో నగరాల్లో అయినా పట్టణాల్లో అయినా, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తే, పిల్లలకి మంచి చదువులు చెప్పించొచ్చు,అన్ని సదుపాయాలూ సమకూర్చుకోవచ్చు. కోడలు ఉద్యోగానికి వెళ్తానంటే, ముందర అబ్జెక్షన్ పెట్టేది అత్తగారే! 'నాకు ఓపిక లేదమ్మోయ్, నీ పిల్లల్ని చూడ్డానికి' అని ఖరాఖండీగా చెప్పిన వారిని చూశాము.వీళ్ళు అవసరానికి పిల్లలకి ఉపయోగించకపోతే, వాళ్ళేదో వీళ్ళని చూడ్డంలేదూ అని ఏడవడం దేనికో? పోనీ అని పిల్లల్ని ఏ క్రెచ్ లోనో పెట్టి,ఉద్యోగానికి వెళ్ళడానికే డిసైడ్ అయిందా, ఇంక చూసుకోండి, ఈ అత్తగారనే ప్రాణి,తనకి వీలైనన్ని రకాల 'థర్డ్ డిగ్రీ మెథడ్సూ' ఉపయోగిస్తుంది.సాయంత్రం కోడలొచ్చేసరికి, ఓ గిన్నెతో అన్నం వండి, ఏ వేపుడో చేస్తే ఈవిడ సొమ్మేంపోదు, అయినా సరే, తనకేం పట్టనట్లే కూర్చుంటుంది.అలాటి అత్తగార్లని ఛాన్సొస్తే ఏ కోడలు వదుల్తుందీ?ఇంట్లో ఉన్న మామగారు ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ తనకే తెలిసున్నట్లూ,అసలు తన సలహా లేనిదే, గ్రహాలు గతి తప్పుతాయన్నట్లూ ప్రవర్తిస్తారు.అడిగినా అడక్కపోయినా ఉచిత సలహాలు ఇచ్చేస్తూంటారు.ప్రస్తుత ప్రపంచం,తన రోజుల్లా లేదని ఓమారు జ్ఞాపకం చేసికుంటే ఎవరికీ ఏ సమస్యా ఉండదు. ఏదో ' ఆయనే ఉంటే.....'అన్నట్లు ఆమాత్రం 'సంఝోతా' ఉంటే ఈ గొడవలన్నీ ఎందుకు వస్తాయి?

కలిసే ఉండవలసిన పరిస్థితే వస్తే,ఎవరైనా అడిగితేనే కానీ సలహా ఇవ్వకూడదు. జరిగేవి జరక్క మానవు, ఊరికే కంఠ శోష తప్ప ఒరిగేదేదీ లేదు.ఎవరి పిల్లల్ని ఎలా పెంచుకోవాలో వాళ్ళకే వదిలేస్తే ఎంతో హాయి.మన పిల్లల్ని మనక్కావలిసిన పధ్ధతిలోనే పెంచుకున్నప్పుడు, వాళ్ళ పిల్లల్ని వాళ్ళేం చేసికుంటే వీళ్ళకెందుకంట? ఎవరి దృష్టికోణాన్ని బట్టి వారు ఆలోచిస్తారు.ఇలాటివాటికి పుస్తకాలు చదివితేనూ, కౌన్సెలింగులకి వెళ్తేనూ సొల్యూషన్సు రావు. వీధిన పడకూడదనుకుంటారా హాయిగా విడివిడిగా ఉండాలి.అంతేకానీ, ఎదో పాయింటు ప్రూవ్ చేద్దామని కలిసే ఉండడానికి ప్రయత్నిస్తే ఎప్పుడో ఒకప్పుడు చిన చిన్న అపార్ధాలు తప్పవు. అలాగని ఒకే ఊళ్ళో, పిల్లలోచోటా, తల్లితండ్రులోచోటా ఉంటున్నారంటే వాళ్ళకేదో గొడవొచ్చిందనికాదు. దీన్ని ' ప్రివెంటివ్ మైంటెనెన్స్' అంటారు.

మరిన్ని శీర్షికలు
Ahimsaa Pradhamam Pushpam