జూలై 12, 13, 14 తేదీల్లో వందేళ్ళ సినిమా పండుగను ఘనంగా నిర్వహించడానికి దక్షిణ భారత దేశానికి సంబంధించిన వివిధ సినీ పరిశ్రమలు ఏకతాటిపైకి వచ్చాయి. సౌతిండియన్ ఫిలిం ఛాంబర్ ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహించబోతున్నాయి. ఈ వేడుకలకు హిందీ సినీ పరిశ్రమ నుంచీ పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. సాధారణంగా దేశవ్యాప్తంగా జరగాల్సిన ఇలాంటి వేడుకల్లో బాలీవుడ్ డామినేషన్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. దక్షిణాది సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులకు ఆ వేడుకల్లో చిన్నచూపు తప్పదనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలోనే సౌతిండియన్ ఫిలిం ఛాంబర్ వందేళ్ళ సినిమా పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించాలనే పట్టుదలతో వున్నట్లుగా కనిపిస్తోంది. 1913లో రాజా హరిశ్చంద్ర అనే మూకీ సినిమాతో ప్రారంభమైన వెండితెర వెలుగులు ఇప్పుడు ఏ స్థాయిలో వున్నాయో, ప్రేక్షకులను ఎంతలా రంజింపజేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
|