Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Risk

ఈ సంచికలో >> శీర్షికలు >>

సంస్కరణ - హైమా శ్రీనివాస్

Samskarana

ప్రపంచంలోని వస్తువులన్నింటినీ సంస్కరించకుండా ఉపయోగించడం సాధ్యంకాదు. సంస్కారం వలన రూపం మారిపోయి వస్తువు విలువ పెరుగుతుంది. అల్పవస్తువు అధికవిలువగల వస్తువుగా, మరొక వస్తువుగా రూపొందుతుంది. మనం భుజించేభోజనం, ధరించే  వస్త్రములు, నివసించే గృహము, నిత్యం వాడుకునే వస్తువుల వరకుఅన్నీసంస్కరింపబడినవే. పంటపొలాలనుండీ తెచ్చినవడ్లనుఅలాగే భుజించలేము. వాటిపొట్టుతీసి బియ్యంగా చేసి నీటితోకడిగి అగ్ని సంస్కారంతో అన్నంగా చేసుకుని భుజించే రీతిగా మార్చుకుంటున్నాము. మనం భోజనంలోతినే ఆధరువులు సైతం సంస్కరింపబడిన తర్వాతే భుజిస్తున్నాం.

నేలలోమొక్కలకు పండిన పత్తిని అలాగే ధరించలేము, నూలుగా దానితో వస్త్రములుగా, వాటిని ధరించుటకు అనుగుణంగామార్చి సంస్కరించుకుని ధరిస్తున్నాము.. సంస్కరణకు ముందున్న రూపంమారిపోయి కొత్తరూపం పొంది విలువపెరుగుతున్నది. పేరుమారుతున్నది. కేవలం మనం వాడుకునే వస్తువులు సంస్కారం వలన రూపురేఖలు విలువ పెరుగుతున్నపుడు మానవుల మైన మనం సంస్కారం పొందినపుడు మన విలువ ఎంత పెరుగుతుందో ఆలోచించవలసి ఉంది.

మనకు మూడువిధాలైన సంస్కారాలు అవసరం. అవే శారీరక, మానసిక, ఆత్మ సంస్కారాలు. మనదేహం అనేక మార్పులతో కూడినది. మలమూత్ర దుర్గంధ రక్త మాంసాదులతో కూడినది. పన్నీట సుగంధభరితమైన సబ్బురాచి స్నానము చేసి, శరీరముపై సెంటు కొట్టుకున్నంత మాత్రమున అంతర్ముఖ శుధ్ధిరాదు. శరీరంలో దాగి ఉన్న దుర్గంధము ఎలా శుధ్ధమౌతుంది? లోపలి మనస్సును సుగంధభరితం చేస్తే మానసిక శుధ్ధిఏర్పడుతుంది. దానికై హృదయ పవిత్రతను పెంపొందించేసత్కార్యాలు చేయాలి. కల్మషంలేని హృదయము, పవిత్ర భావాలు, పరమాత్మపై భక్తి, సమాజ సేవ, అసహాయులపట్ల దయ, సానుభూతి, ప్రతిఫలాపేక్షలేని సాయము, దీనజనోధ్ధరణ వలన అంతర్ముఖ శుధ్ధి ఏర్పడుతుంది. మానశిక శుధ్ధివలన బహిర్ముఖ శుధ్ధి, తద్వారా దేహ శుధ్ధి ఏర్పడతాయి.

శారీరక మానసికములు రెండూ ప్రాకృతములు. ఇవి అనేక పరిణామాలు పొందుతున్నాయి. పరిణామం  చెందేవాటికే సంస్కారం అవసరం. ఆత్మ ప్రాకృత మైనది కాదు, పరాకృతమైనది, కనుకఆత్మకు సంస్కారం అవసరం లేదు. ఆత్మసంస్కారమని మనం అంటున్నాము, శారీరక, మానసిక సంస్కారము ఆత్మసంస్కారమునకు దారితీస్తాయి, అనగాయదార్ధముగా సంస్కారము అవసరంలేని ఆత్మకు ఈరెండు సంస్కారముల వలన, మన తృప్తికోసం, వాడుకగా ఆత్మసంస్కారం అంటున్నామే కానీ పరా కృతమైన ఆత్మకు సంస్కారం అవసరంలేదు.  ఆత్మ నిత్య శుధ్ధమైనది..

కొండలో ఉన్న రాతిని శిల్పంగా సంస్కరించి ఏగుడిలో ఉంచినా రూపము నామమూ మారడం వలన దైవంగా మనం పూజిస్తాం. అది కొండలోఉన్నంతవరకూ అది బండే! , సంస్కరింప బడటం వలన అది గుడిలో ధూప దీప నైవేద్యాలు అందు కుంటుంది.  చెట్టు మొదలుకు ఉన్నఒక చెక్క మొద్దును రధంగా మలచి సంస్కరించినపుడు  నపుడు దాని రూపము, నామమూ  మారి దానిని భగవంతుని ఊరేగించే తీరు అని అందరం దేవునితో పాటు దానికీ కొబ్బరికాయలు కొట్టి పూజిస్తుంటాం. ఫ్రాకృతమైన ప్రతి పదార్ధమూ సంస్కారింప బడటం వలన పవిత్రమైన, దివ్యమైన, భవ్యమైన స్వరూపంగామారి అధిక గౌరవ మర్యాదలు పొందుతున్నది. దీనికంతకూ కారణం సంస్కారమే కదా!

పట్టుపురుగు పెట్టిన గుడ్లనుమనం ధరించలేము, అది క్రిమిగా మారినపుడు దాని రూపం చూసి వళ్ళు జలద రిస్తుంది., అది గూడుకట్టి ప్యూపా దశలో ఉన్నపుడు దానికి అంత గౌరవం విలువ తక్కువగానే ఉంటుంది. దాని గూడునుండీ దారం తీసి, దానితో పట్టువస్త్రం తయారు చేస్తే దాని రూప నామములు మారి విలువపెరిగి దేవతా విగ్రహానికి సమర్పించుకుంటాం, మనం ధరిస్తాం.  సంస్కరణ వలన ఈవిధంగా అసలైన వస్తువుకు రూప నామమలు మారి విలువ గౌరవమూ పెరుగుతాయి. కనుక మన గుణములను సాత్వికమైనవిగా మార్చుకుని మానవసేవలో మన జీవితాన్నితరింప జేసు కుంటే, మనం శారీరక మానసిక సంస్కారములు పొందితే ,ఆత్మసంస్కారం లభ్యమై దైవత్వాన్నిపొందగలమనడం లో సందేహం ఏమాత్రం లేదు.

మరిన్ని శీర్షికలు
bhogi mantalu