కిట్టు చిన్నతనంలో ఇప్పట్లోలాగా టీవీలు, వీసీయార్ లు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, కంప్యూటర్ గేమ్ లు, ప్లే స్టేషన్లు లేవు. ఐమాక్స్ లాంటివి సమస్యే లేదు.
సినిమా చూడాలంటే పక్కనే మైలున్నర దూరంలో ఉన్న ' చింగిచ్చం' లో ఒక టూరింగ్ టాకీస్ ఉంది. అక్కడికి వెళ్లాలి. చింగిచ్చం ఊరు అసలు పేరు 'శృంగవృక్షం'. అంత స్పష్టంగా పలకలేని కిట్టు నాయనమ్మ సింపుల్ గా చింగిచ్చం అనేది.
ఆ టూరింగ్ టాకీస్ కు బలమైన గోడలు ఉండవు. నేల, బెంచీ, చెక్క అనే మూడు తరగతులుంటాయి. నేల ఖరీదు నలభై పైసలు. ఇసుకపోసిన నేలపై తెరకు దగ్గరగా కూర్చుని చూడాలి.
ఆ తరువాత బెంచీ...
బెంచీ ఖరీదు నేలకంటే ఎక్కువ, డబ్భై అయిదు పైసలు... రోడ్డు పక్క టీ కొట్లలో వేసేటటువంటి బెంచీలుంటాయి.
ఆఖర్న కుర్చీ...
'హ్యాండిల్స్' ఉన్న చెక్క కుర్చీలు గానీ, మడతపెట్టే ఇనుప రేకుతో చేసిన 'గాడ్రెజ్' కుర్చీలుగానీ, వేస్తారు.
... దాని ఖరీదు రూపాయి పావలా.
కిట్టు, కిట్టు స్నేహితులు, ఎవరో ఒక 'పెద్దవాడిని' తోడుగా తీసుకుని. రెండో ఆటకి వెళ్లేవాళ్లు. ఒక్కోసారి తాతయ్య నాయనమ్మలతో కలిసి వెళ్లేవాళ్లు.
రెండో ఆట అంటే సెకండ్ షో...
కొంచెం ముందుగానే పోయి, మొదటి ఆట ఎప్పుడైపోతుందా అని ఎదురు చూసేవాళ్లు. మొదటి ఆట అయిపోయిందనడానికి గుర్తుగా...
హే... కృష్ణా... ముకుందా... మురారీ...
జయ కృష్ణా ముకుందా మురారీ...
జయ గోపాల కృష్ణా ముకుందా మురారీ...
అనేపాట వేసేవారు...
అమ్మయ్య... అయిపోయిందిరా... నడవండిరా... అని ఆతృతతో పరుగులు తీసి నేల టికెట్టు కొనుక్కుని లోపలికి వెళ్లేవాళ్లు.
సినిమా వేసే ముందు న్యూస్ రీళ్ళని వేసేవారు. ఆ న్యూస్ ని చాలామంది ఇష్టపడే వాళ్లు. కిట్టు నాయనమ్మ న్యూస్ రీళ్ళను ఎట్టి పరిస్థితిల్లోనూ మిస్సవకుండా చూసుకునేది.
సినిమా మధ్యలో ఒకోసారి కరెంట్ పోయేది.
వెంటనే టూరింగ్ టాకీసు వాళ్లు రంగంలోకి దిగి, జనరేటరు తో గంటసేపు యుద్ధం చేసేవారు. ప్రేక్షకులంతా ఆ యుద్ధాన్ని తిలకిస్తూ... జనరేటరు బాగవ్వాలని దేవునికి ప్రార్ధనలు చేసేవారు...
జనరేటరు బాగవ్వగానే సినిమా మళ్ళీ మొదలయ్యేది.
ఈ గందరగోళంలో కిట్టు, కిట్టు స్నేహితులు నేల నుంచి బెంచీ తరగతిలోకి జంప్ చేసేవారు. ఒకోసారి పట్టుబడేవాళ్లు కాదు... ఒక్కోసారి ఎవరైనా 'స్ట్రిక్ట్ ఆఫీసర్' గేట్ కీపర్ గా ఉంటే వీళ్లని పట్టుకుని తిట్టి, నేలకి నెట్టేవాడు.
ఇంటర్వల్ సమయంలో అడ్వర్ టైజ్ మెంట్ లు వేసేవారు.
"గోదావరి... గల... గల., షా... హి... డక్కను... ఘుమ... ఘుమ... షా... హి... డక్కను సిగరెట్టే తాగండి"
"చేనుకు చేవ... రైతుకు రొక్కం...
ఇఫ్ కో ఉరువులు వేస్తే పిల్లా... తిరుగులేదు మన పంటకు మల్లా...
ఇలా ఉండేవి అడ్వర్ టైజ్ మెంట్ లు... "
జగన్మోహిని, సువర్ణ సుందరి, తాతమ్మ కల, శ్రీ కృష్ణ పాండవీయం, రంగుల రాట్నం, ఒకటేమిటి ఇలా ఎన్నో చిత్ర రత్నాల్ని తిలకించేవాడు కిట్టు.
"కంప్యూటర్ గేములు", ప్లే స్టేషన్ల బాబుల్లాంటి ఆటలు ఆడుకునేవారు కిట్టు, కిట్టు స్నేహితులు.
తాటి చెట్టు నుండి వచ్చే ముంజకాయల్ని చక్కగా కట్ చేస్తే చక్రాల్లాగా అవుతాయి.
రెండు ముంజ కాయల్ని కట్ చేసి, ఆ రెండింటికీ సరిగ్గా మధ్యలో ఒక చిన్న కర్రతో కలిపితే, జిమ్ లో కనిపించే 'డంబెల్' లాగా అవుతుంది. ఒక పొడవాటి 'పంగల కర్ర' తో ఆ మధ్యలోని కర్రని తోస్తే చక్రాలు ముందుకు పరిగెడతాయి. ఆ చక్రాల్ని తోసుకుంటూ 'స్పీడు'గా పరిగెడుతుంటే కలిగే ఆనందం వర్ణనాతీతం.
ఎదుటివాడి చక్రాల్ని తన చక్రాలతో గుద్దించి, వాడి చక్రాల్ని ఊడగొట్టిన వాడిని 'ఫార్ములా కార్' రేస్ లో నెగ్గిన వాడంత గొప్పగా చూసేవారు.
'నల్లటి బంక మట్టిని నీటిలో నానబెట్టి, చపాతీ పిండిలా తయారు చేసి, దానితో రకరకాల సైజుల్లో 'గూడు బండి', 'ఎడ్ల బండి' తయారుచేసి, దానికి 'మట్టి'తోనే చక్రాలు చేసి, అమర్చి. ఎండబెట్టి, గట్టిబడిన తర్వాత దానికి తాడు కట్టి, లాగుతూ ఆడుకునేవారు.'
'గూటీ బిళ్ళ లేదా కర్రా బిళ్ళ ఇంకో ఆట.... దీని నుండే క్రికెట్ వచ్చిందంటారు.
చిన్న కర్ర, పెద్ద కర్ర ఉంటాయి. పెద్ద కర్రతో చిన్న కర్రని చాకచక్యంగా కొట్టడం 'గొప్పకళ'.
కొట్టేటప్పుడు టంగు టంగుమని శబ్దం వస్తే, ఆ కర్రల క్వాలిటీ మంచిదన్నమాట.
'కుప్పాట'... లో ఇటుక సైజులో ఉన్న మెత్తటి రాళ్లని కనబడకుండా ఇసుకతో పూర్తిగా నింపి 'కుప్ప' తయారు చేసి, దాని చుట్టూ 'బరి' గీస్తారు. ఆ కుప్పను తన్నుతూ, రాళ్లని బయటపడేలా చేసి, ఇంకా తన్నుతూ, రాళ్లని బరి నుంచి బయట పడేయాలి.
ఎవరు ఈపని ముందుగా చేస్తే వాళ్లకి గొప్ప వస్తుంది.
'తన్నులాట'లో ఎదుటివాడిని తన్ని వెంటనే కూర్చోవాలి. కూర్చున్నవాడిని తన్నకూడదు. అది రూలు.
ఎదుటి వాడిని ఎంత స్పీడుగా తన్నేసి, అంతే స్పీడుగా కూర్చోగలిగేవాడు బహునేర్పరి."
"ఈ కుప్పాట, తన్నులాటల నుండే టేక్వాండో వచ్చి ఉండవచ్చు"
టేక్వాండో అంటే ఏమిటి? అని ఎవరైనా అడిగితే తన్నులాట అని తప్ప, వేరేమాట చెప్పలేము.
నల్లమట్టిని మెత్తగా చేసి గోళీల్లాగా తయారుచేసి, ఎండబెట్టి, గట్టిబడ్డాక 'ఉండేలు'(ఇంగ్లీష్ లో కెటాపుల్ట్ అంటారు) లో పెట్టి, లాగి కొడుతూ కాకుల్ని భయపెడుతూ తిరగడం ఒక సరదా.
గోళీలాటలో గోళీని వంచిన వేలిలో ఇరికించి, ఇంకో వేలితో దానికి 'సపోర్టు' ఇస్తూ గురిచూసి ఇంకో గోళీని కొట్టాలి.
దూరంగా ఉన్న గోళీని కొట్టినవాడు 'గొప్పవాడు', కొట్టిన దెబ్బకి గోళీ పగిలిపోతే 'అబ్బ ఏం కొట్టాడురా...' అనేవారు.
'గచ్చు' పై గానీ, మట్టినేల మీదగానీ సుద్దతో మూడు పలకలుగా (ఇంగ్లీష్ లో స్క్వేర్) గీతాలు గీసి వాటిపై 'పిక్క' (ఏదయినా గింజగానీ, చిన్నరాయి ముక్కగానీ, చిన్నపుల్లగానీ) ఉంచి, వాటిని తెలివిగా కుదుపుతూ 'దాడి' చేసి, ఎదుటివాడి 'పిక్కల్ని' సొంతం చేసుకోవాలి. ఇదే 'దాడి' ఆట.
'అష్ట చెమ్మ' లో తెలుగు క్యాలెండర్ లో లాగా గడులు గీసి, వాటిల్లో (పిక్కల్ని) చింత గింజలు గానీ, సపోటా గింజల్ని గానీ... వేసిన 'పాచిక' (ఇంగ్లీష్ లో డైస్) కు వచ్చిన సంఖ్య ప్రకారం కదుపుకుంటూ వెళ్తారు... అష్ట అంటే ఎనిమిది... అష్ట పడితే మన పిక్క ఎనిమిది గడులు దాటాలి. చమ్మ పడితే నాలుగు దాటుతుంది. ఎవరి పిక్క ముందుగా గడులన్నీ దాటితే వాళ్లు నెగ్గినట్లు...
సీతాఫల గింజల్ని గుండ్రంగా గీసిన గీత మధ్యలో వేసి, ఇంకో గింజ కంగకుండా (కదలకుండా) చూపుడు వేలితోగానీ, మధ్యవేలితోగానీ నేర్పరితనంగాబయటకు లాగాలి. వేరే గింజ కదిలితే లాగేవాడు ఓడిపోయినట్లు, మళ్లీ ప్రయత్నించాలి.
గవ్వలాట, లేక కచ్చకాయ ఆటలో ఒక గవ్వని పైకి విసిరి, అది కిందపడేలోగా నేలమీద ఉన్న గవ్వను దానికి చేర్చి పట్టుకోవాలి ఒకే చేతితో.
ఈసారి రెండు గవ్వలు ఎగరవేసి, ఆ రెండూ కిందపడేలోగా నేలమీద ఉన్న మూడో గవ్వని చేర్చి మూడూ ఒకే చేతితో పట్టుకోవాలి. ఇలా సంఖ్య పెరుగుతూ ఐదో, ఆరో గవ్వలతో ముగుస్తుంది.
ఈ ఆటలో మళ్ళీ రకాలున్నాయి.
ఆడపిల్లలు, మగపిల్లలు ఈ ఆట ఆడినాగానీ సాధారణంగా ఆడపిల్లలు బాగా ఆడతారీ ఆట.
ఇవికాక కబడ్డీ, బంతి ఆట, ఖో ఖో, బ్యాట్ - బాల్ ఆటలు కూడా ఆడేవారు.
కిట్టు, స్నేహితులు కలిసి తోటల్లోకి వెళ్లేవాళ్లు.
రాలిన మామిడికాయలు, మామిడిపండ్లు, జీడికాయలు, ఏరుకునేవారు.
పాదుల్లోని దొండపండ్లు, అక్కడక్కడ దొరికే బుడబుచ్చకాయలు (ఇంగ్లీష్ లో రాస్ప్ బెర్రీ), ఉసిరికాయలు, నేరేడు పళ్ళు, రేగుపళ్ళు, సీమ చింతకాయలు, చింతకాయలు, జామకాయలు మొదలైనవి తింటూ తిరిగేవారు.
ఈ రోజుల్లో పిల్లలకి బయట ఆడే ఆటలు తక్కువైపోతున్నాయి. ఎంతసేపూ చదువే...
ఖాళీ ఉంటే కంప్యూటర్ గేమ్ లు...
అదేదో స్కూలో, కాలేజీనో...
అందులో పిల్లవాడిని చేర్పించడానికి వెళ్లిన తల్లిదండ్రులు ఆ సంస్థవాళ్లని అడిగారట... 'మీ సంస్థలో ఆటస్థలం ఉందా అని..?'
ఆ సంస్థవాళ్లు ఈ తల్లిదండ్రుల్ని మహాపాపం చేసిన పాపాత్ముల్ని చూసినట్లుగా చూసి,... 'అలాంటి వెధవ్వేషాలు మా దగ్గర చదువుకునే స్టూడెంట్లని వెయ్యనివ్వం'... 'చదువు... చదువు... అదే మా ధ్యేయం'... మీకు ఆటలు కావాలంటే అవి ఉన్న పనికిమాలిన సంస్థలు చాలా ఉన్నాయి. అక్కడకు పొండి... మా దగ్గరకు ఎందుకొచ్చారు?' అని కసిరి విసిరేశారంట!!
అలాగే ఇప్పటి పిల్లలు ప్రకృతి నుండి వచ్చే పండ్లు, ఫలాలు తక్కువగానూ, పిజ్జాలు, బర్గర్లు ఎక్కువగానూ వాడుతున్నారు. పిల్లలకు ఆటపాటల్ని, మంచి ఆహారపు అలవాట్లని నేర్పించి, తల్లిదండ్రులు, సమాజం ప్రోత్సహించవలసి ఉంది.
మూసపోసినట్లుగా... అందరూ ఏదో ఒకటి చేస్తున్నారు... మనం కూడా అలాగే చేద్దాం... అనుకోవడం మంచిది కాదు.
***
కిట్టు ఆరోతరగతిలో చేరే సమయం వచ్చింది. పెన్నాడ ఆగ్రహారంలో ఆరో తరగతి లేదు. చింగిచ్చంలో ఉంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. అందులో చేర్చారు కిట్టుని.
రోజూ మైలున్నర పోనూ, మైలున్నర రానూ... నడుచుకుంటూ వెళ్లి రావడమే...
మధ్యాహ్నం ఇంటికి రావడం కుదరదు కాబట్టి, క్యారేజీ తీసుకువెళ్లేవాళ్లు.
ఎర్రరంగులో ఉన్న సత్తు క్యారేజీ(ఇంగ్లీష్ లో జర్మన్ సిల్వర్) ఒక చేతిలో, భుజాన్న పుస్తకాల సంచితో కిట్టు, కిట్టు వాళ్ల అన్నయ్య ఇతర స్నేహితులు గ్రూపుగా వెళ్లేవారు.
పెన్నాడ ఊరి పొలిమేర దగ్గర శ్మశానం, అది దాటాక, రాంపెల్లి చెరువు (రాంపెల్లి చెరువు దగ్గర ప్రమాదాలు జరుగుతాయి అని అనుకునేవారు) తర్వాత అట్టల ఫ్యాక్టరీ, రైస్ మిల్లులు, కాలువ, కాలువ పక్కన గుడి, టూరింగ్ టాకీసు, ఆపై స్కూలు...
ఇలా రోజూ కబుర్లు చెప్పుకుంటూ ఎండ, వాన లెక్కచెయ్యకుండా నడుస్తూ వెళ్లి వస్తుండేవారు.
పెన్నాడ ఆగ్రహారంలో బయలుదేరగానే, వేణుగోపాలస్వామి గుడి కన్పించేది.
వెళ్తూ వెళ్తూ గుడిలోపలికి వెళ్లి, దండం పెట్టుకుని, పూజారిగారిచ్చిన ప్రసాదం తింటూ ఆనందంగా బయటకు వచ్చేవారు. గుడి ముందు ఎత్తైన అరుగులతో ఒక ఇల్లు ఉండేది.
'సోమరాజు' గారనే పెద్దాయన పెద్దమీసాలతో, తెల్లని మెరిసిపోయే లాల్చీ పైజామాలతో ఠీవీగా ఒక అరుగుపై కుర్చీలో కూర్చొని ఉండేవారు. ఆయనను చూడగానే నమస్కారం చేయాలన్పించేది.
పిల్లలంతా నమస్కారం చేయగానే, ఆయన కూడా ఎంతో వాత్సల్యంగా చూస్తూ, రెండు చేతులతో ప్రతి నమస్కారం చేసేవాడు. రోజూ ఇదొక కార్యక్రమంలాగా ఉండేది.
ఎప్పుడయినా వీళ్లకి ఆయన కన్పించకపోతే అయ్యో అనుకునేవారు.
స్కూలుకు వెళ్లడానికి మూడు దారులున్నాయి.
మొదటిది, తిన్నగా మెయిన్ రోడ్ కి వెళ్లి, అదే దారిలో ఊరిపొలిమేరలు దాటడం, రెండోది, సోమరాజుగారి ఇంటివైపు తిరిగి తిన్నగా ముందుకు వెళ్లి, శ్రీవైష్ణవుల ఇళ్లు మీదుగా మెయిన్ రోడ్ లో కలవడం.
ఈ శ్రీ వైష్ణవులు ఎక్కువగా బయట కన్పించేవారు కాదు. ఆ దారిన పోతుంటే రకరకాల వాయిద్యాల కమ్మని శాస్త్రీయ సంగీతం విన్పించేది. ఎప్పుడన్నా కుతూహలంగా స్నేహితులంతా అరుగు ఎక్కి కిటికీల్లోంచి చూసేవారు. ఒక క్రమపద్ధతిలో కూర్చొని, చిత్ర విచిత్రమైన వాయిద్యాలతో సాధన చేస్తున్న మనుషులు కన్పించేవారు.
ఇక మూడోదారి...
మెయిన్ రోడ్ కి వెళ్లకుండా దానికి అపోజిట్ గా వెళ్లి, పొలాల వైపు వెళితే రైలు పట్టాలొస్తాయి. ఆ పట్టాల మీదుగా నడుచుకుంటూ స్కూలుకి వెళ్లడం. ఈ మూడోదారికి, ముచ్చటగా "అడ్డరూటు" అనిపేరు పెట్టుకున్నారు స్నేహితులంతా... ఇప్పుడన్నా స్కూలు ఎగ్గొట్టాలంటే ఈ "అడ్డరూటు"లో వెళ్లడం, దారిలో రేగుకాయలు, నేరేడు కాయలు కోసుకుంటూ వెళ్లడం, చింగిచ్చం రాగానే అక్కడొక చిన్న రైల్వే బ్రిడ్జి, బ్రిడ్జి క్రింద కాలువ కన్పించగానే ఆగడం, బ్రిడ్జి మీదనుండి కాలువలోకి దూకడం, కాలువలో ఈత కొట్టడం చేసేవారు.
టైమ్ ఎలా గడిచేదో తెలిసేది కాదు.
మధ్యాహ్నం కాగానే క్యారేజీలు తీసి తినడం, మళ్ళీ ఈత...
ఆ తర్వాత వచ్చిన దారినే అదే పద్ధతిలో ఇంటికి చేరడం...
(... ఇంకా వుంది) |