దర్శక ధీరుడు రాజమౌళి, తెలుగులో మహాద్భుతం అనిపించదగ్గ సినిమాల్ని తెరకెక్కించాడు. ‘మగధీర’ వంటి కళాఖండం సృష్టించడం రాజమౌళికే సాధ్యమయ్యింది. స్టార్ వాల్యూ లేకుండా, ‘ఈగ’ సినిమాతో సంచలనాలు సృష్టించిన దర్శకుడాయన. అలాంటి రాజమౌళికి ఓ డ్రీమ్ వుంది. అదే మహాభారతాన్ని సినిమాగా తెరకెక్కించడం. ఆ కోరిక నెరవేర్చుకోవడానికి రాజమౌళికి ఇంకా టైమ్ పట్టొచ్చు.
ఈలోగా బాలీవుడ్లో మహాభారత్ని సినిమాగా తెరకెక్కించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అశోక్ బేంకర్ అనే రైటర్ కథతో యూటీవీ సంస్థ అత్యంత భారీగా ‘మహాభారత్’ని సినిమాగా రూపొందించనుంది. అంటే, రాజమౌళికన్నా ముందే మహాభారతాన్ని తెరపై ఇంకొకరు చూపించబోతున్నారన్నమాట.
మహాభారతంలో అనేక పర్వాలున్నాయి. చాలా అంశాల్ని బేస్ చేసుకుని చాలా చాలా రకాలుగా సినిమా తెరకెక్కిచొచ్చు. నర్తనశాల, కురుక్షేత్రం.. ఇలా ఏ అంశాన్ని పట్టుకుని సినిమా రూపొందించినా, అదో కళాఖండమవుతుంది. కాబట్టి, రాజమౌళి డీలాపడాల్సిన పనిలేదు. చిన్న పాయింట్ని పట్టుకుని తెరపై అద్భుతాలు చేసే రాజమౌళి, మహాభారతాన్ని డీల్ చేస్తే ఎలా వుంటుందోనని సగటు తెలుగు సినీ అభిమాని ఎదురు చూస్తున్నాడు ఉత్కంఠగా.
|