తెలుగు సినిమా హీరోల్లో గత కొన్ని సంవత్సరాలుగా ఆరోగ్యకరమైన వాతావరణం కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఫ్రెండ్లీ నేచర్ కారణంగానే పవన్ కళ్యాణ్ నటించిన 'జల్సా' సినిమాకి, ఎన్టీఆర్ నటించిన 'బాద్ షా' చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ వాయిస్ ఓవర్ అందించాడు. 'జగద్గురు ఆదిశంకర', 'హనుమాన్' చిత్రాలకు మెగాస్టార్ చిరంజీవి, 'నువ్విలా', 'మర్యాద రామన్న', 'దూసుకెళ్తా' చిత్రాలకు రవితేజ, 'యువత' చిత్రానికి దర్శకుడు పూరి జగన్నాథ్... ఇలా కొన్ని చిత్రాలకు స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ చిత్రాలకు అదనంగా మరింత క్రేజ్ ని అందించారు. ఇప్పుడు అదే బాటలో మరో క్రేజీ వాయిస్ ఓవర్ అందిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే... చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ను దర్శకుడు వై.వి.యస్. చౌదరి 'రేయ్' చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. అంతకుముందు తెలుగు చిత్ర పరిశ్రమకు 'దేవదాసు' చిత్రం ద్వారా ఎనర్జిటిక్ స్టార్ రామ్ ను హీరోగా పరిచయం చేసిన ఘనత వై.వి.యస్. చౌదరిదే. అయితే మే 9న విడుదల కాబోతున్న 'రేయ్' చిత్రానికి సంబంధించిన క్రేజీ న్యూస్ రామ్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించడం.
ఈ సందర్భంగా దర్శకనిర్మాత వై.వి.యస్.చౌదరి మాట్లాడుతూ - "రేయ్ చిత్రంలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలకు వాయిస్ ఓవర్ అవసరమైంది. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాక ఆలోచిద్దామనుకున్నాను. అయితే ఇటీవల జరిగిన థియేటర్ ట్రైలర్ విడుదల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామ్ ని ఆహ్వానించాను. ఆ టైమ్ లో మా సినిమాకి రామ్ వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుందనుకున్నాను. అదే విషయం రామ్ కి చెప్తే వెంటనే ఓకే అన్నాడు. అందుకు రామ్ కి థాంక్స్. రామ్ వాయిస్ ఓవర్ రికార్డ్ చేశాము. చాలా బాగా వచ్చింది" అన్నారు.
|