సూపర్స్టార్ మహేష్ తెలుగు తెరపై సంచలన విజయాలు నమోదు చేయడంలోనే కాదు, హుందాతనం చాటుకోవడంలోనూ తనకు తానే సాటి అన్పించుకున్నాడు. ‘ఆగడు’ సినిమాలో ‘ప్రతివోడూ పులులు సింహాలు ఎలకలతో ఎదవ కంపేరిజన్స్ ఎలపరమొచ్చేస్తంది’ అనే డైలాగ్ మహేష్ చెప్పాడు. ఆ డైలాగు టాలీవుడ్లో ఓ ప్రముఖ హీరోపై సెటైర్ వేయడం కోసమే పెట్టారని వివాదం రేగింది.
తన డైలాగ్ కారణంగా వివాదం వచ్చిందని తెలుసుకున్న మహేష్, ఆ డైలాగ్ సన్నివేశానికి తగ్గట్టు రాసిందే తప్పించి ఎవర్నీ కించపర్చడానికి కాదని చెప్పాడు. జంతువుల మీద తనకు చిన్న చూపు కూడా లేదని వివరణ ఇచ్చాడు మహేష్. తద్వారా రేగిన వివాదాన్ని సద్దుమణిగేలా చేయడంలో తన హుందాతనాన్ని మహేష్ చాటుకున్నట్లయ్యింది.
‘ఆగడు’ విషయానికి వచ్చినట్లయితే ఈ సినిమాపై తెలుగు సినిమా వర్గాలలో భారీ అంచనాలు ఉన్నాయి. రికార్డుల్ని తిరగరాసే చిత్రం అవుతుందని మహేష్ అభిమానులు ‘ఆగడు’ గురించి అంచనాలు పెట్టుకున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్నదీ సినిమా. ఇదివరకు శ్రీనువైట్ల ` మహేష్ కాంబినేషన్లో వచ్చిన ‘దూకుడు’ పెద్ద విజయం సాధించింది. ఆ మ్యాజిక్ ఇప్పుడు రిపీట్ అవుతుందని భావిస్తున్నారు సగటు సినిమా అభిమానులు కూడా.
|