Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nagarjuna sagar

ఈ సంచికలో >> శీర్షికలు >>

అపర పోషకాలు... ఈ అపరాలు... - జయలక్ష్మి జంపని

Millets

చిరుధాన్యాల్లో రాగులు, సజ్జలు, జొన్నలు, మొక్కజొన్నలు, సామలు, కొర్రలు, ముఖ్యమైనవి. వరిగలు, కొడియసాము, అరికెలు కూడా  చిరుధాన్యాల కిందకు వస్తాయి. పసిపిల్లలకు తల్లిపాలతో పాటు రాగి, సజ్జ, జొన్నపిండితొ చేసిన జావను ఇవ్వటం వలన పోషకాలు సమృద్ధిగా అంది పెరుగుదల సజావుగా ఉంటుంది.

పూర్వం ఒకేసారి 6నుండి 12 పంటలను ఏకకాలం లో పండించే పద్ధతి ఉండేది. దక్షిణ భారత దేశంలో నవ ధాన్యాలు (తొమ్మిది), రాజస్థాన్ ప్రాంతంలో సాత్ధాన్ (ఏడు), హిమాలయ ప్రాంతాలలో బారాసజా (పన్నెండు) పంటలు పండేవి. ఈ పంటలలో తృణ ధాన్యాలు విరివిగా పండించేవారు.

చిరు ధాన్యాలు...బహు పోషకాలు..

1.రాగులు: రాగులలో ఇనుము అధికంగా ఉంటుంది. వీటిని కొన్ని ప్రాంతాలలో తైదలు అనీ చోళ్లు అనీ అంటారు. ఇది శరీర పెరుగుదల, ఎముకల నిర్మాణంలో ఉపయోగపడే ఇనుము వీటిలో అధికంగా ఉంటుంది. పాలిచ్చే తల్లులకు, పెరిగే పసిపిల్లలకు అవసరమయ్యే కాల్షియం ఇందులో అధిక మోతాదులో ఉంటుంది.

2.జొన్నలు: జొన్నలతో జొన్నపిండి, రవ్వ తయారు చేసుకోవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు, చిన్నపిల్లలకు అవసరమైన పోషకాలు వీటిలో పుష్కలంగా ఉన్నాయి. గోధుమపిండితో, బియ్యంతో చేసుకునే పిండివంటలను జొన్నపిండితో కూడా చెయ్యచ్చు.

3.సజ్జలు: వీటిలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉండటం వలన ఆహారంలో వినియోగించుకోవచ్చు. తగిన మోతాదులో ఇనుము ఉండటం వలన శరీరానికి కావలసిన శక్తిని, రక్తపుష్టిని కలిగిస్తాయి. బాలింతలలో సాధారణంగా వచే రక్త హీనతను తగ్గించి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. చిన్నపిల్లలలో పోషకాల లోపంతో వచ్చే నంజు పొక్కులు, రక్తహీనతలను తగ్గించవచ్చును.

4.కొర్రలు: చిన్నపిల్లలకు గర్భిణులకు బలవర్ధకమైన ఆహారం. వీటితో అన్నం, ఉప్మా, కిచిడీ, పాయసం చేసుకోవచ్చు. ఇవి ఎక్కువగా ఏజన్సీ ప్రాంతాలలో పండుతాయి. స్థూలకాయులకు ఇది మంచి ఆహారం. పిండిపదార్ధం తక్కువగా ఉండి పీచుపదార్థం ఎక్కువగా ఉండటం వలన మలబద్ధక సమస్య దరి చేరదు.

వ్యాధులకు దూరం...ఆరోగ్యానికి చక్కని యోగం..

1.ఆస్త్మా నుండి ఆమడ దూరం: ఆస్త్మా ఉన్న చిన్నారులు తృణ ధాన్యాలతో పాటు చేపలు విరివిగా తీసుకుంటే యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్ సి, ఇ, మెగ్నీషియం, జింక్, ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా అందుతాయి. వీటి వలన ఆస్తమా నుండి రక్షణ పొందవచ్చు.

2.మలబద్ధక నివారణలో: చిరుధాన్యాలు పెద్దపేవును తడిగా ఉంచి మల విసర్జన సక్రమంగా జరగడంలో తోడ్పాటును అందిస్తాయి. సెరోటిన్ ను అందిచడం ద్వార మానసిక స్థితి అదుపులో ఉండి మనసుకు హాయిగా ఉంటుంది.

3.గుండెజబ్బుల నివారణలో: తృణ ధాన్యాలలోని మెగ్నీషియం అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. మధుమేహ వ్యాధి గ్రస్తులలో గుండె జబ్బుల తీవ్రతను తగ్గిస్తుంది. మైగ్రేన్, శ్వాసకోస సంబంధ వ్యాధులను నయం చేస్తుంది. నియాసిన్ రక్తంలోని కొవ్వు స్థాయిలను తగ్గిస్తుంది. ఒక కప్పు వండిన  చిరుధాన్యాలు అవసరమైన మెగ్నీషియంలో 27 శాతాన్ని అందిస్తుంది.

4.కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది: పిత్తాశయ రసాలు తక్కువగ స్రవించడానికి తృణ ధాన్యాలలోని పీచు బాగ ఉపయోగ పడుతుంది. వీటివల్ల పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించే అవకాశం ఎక్కువగ ఉంటుంది.

5.రొమ్ముక్యాన్సర్ ను నిరోధించేందుకు: గింజ ధాన్యాలు, పండ్ల ద్వార లభించే పీచుపదార్ధం 30 గ్రాముల వరకు ప్రతి రోజు తీసుకుంటే  కాన్సర్ తీవ్రతను తగ్గించవచ్చు.

చిరుధాన్యాలతో ఎన్నో పసందైన వంటలను కూడా చెయ్యచ్చు. కొర్రలు, సామలు, మొక్కజొన్న పిండి ఉపయోగించి కేక్, పిజ్జా, కేసరి, రాగి పిండితో లడ్డు, మురుకులు, జొన్నపిండితో బొబ్బట్లు, పూరీలు, మిరపకాయ్ బజ్జీలు ఒకటేమిటి శనగ పిండితో, బియ్యపు పిండితో  ఏమేమి చేస్తామో అన్నీ వీటితో కూడ చెయ్యచ్చు.

మరిన్ని శీర్షికలు
vastu - north west