మొన్న బుధవారం (13.08.2014) జరిగిన "గీతాంజలి" సక్సెస్ మీట్ లో క్రిటిక్స్-రేటింగ్స్ మొదలైన విషయాల గురించి ప్రస్తావన వచ్చింది.
శ్రీ బ్రహ్మానందం తనదైన ధోరణిలో ఒక చక్కని విషయం చెప్పారు.
ఆయన మాటల్లో, "ఒకసారి కవులు జ్వాలాముఖి, జంధ్యాల పాపయ్య శాస్త్రి, శ్రీ శ్రీ ఒక కళాశాల సభకు వెళ్లారట. వేదిక ముందు వేలాది మంది విద్యార్థులు. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు మాట్లాడుతూ, "ఈ విద్యార్థులందర్నీ చూస్తుంటే వికసించిన గులాబీల్లా కనిపిస్తున్నారు" అన్నారట. జ్వాలాముఖి గారి టర్న్ రాగానే ఆయన, "పాపయ్య శాస్త్రి గారు విద్యార్థులంతా గులాబీల్లా ఉన్నారన్నారు. కాని నాకు మాత్రం లోడ్ చెసిన తుపాకుల్లా కనిపిస్తున్నారు" అన్నారట.
ఇక శ్రీ శ్రీ లేచి, "విద్యార్థుల్ని చూస్తూ ఆయన గులాబీలన్నారు. ఈయన లోడ్ చేసిన గన్ అన్నారు. గులాబీలు రేపటికి వాడిపోతాయి. బులెట్ బయటికి పోయాక తుపాకి ఖాళీ అయిపోతుంది. విద్యార్థుల్ని విద్యార్థులుగానే చూద్దాం. కనీసం వాళ్లు రేపు నిరుద్యోగులుగానన్నా మిగులుంటారు" అన్నారట".ఇలా ఒక్కో అంశం ఒక్కొక్కళ్లకి ఒక్కోలా కనిపిస్తుంది.
ఎవరికి తోచినట్టు వారు వారి బుధ్ధిని, మానసిక స్థితిని, భావాన్ని బట్టి స్పందిస్తుంటారు. అందుకే "లోకో భిన్న రుచిః" అన్నారు. అదన్నమాట.
|