ప్రకృతి వైపరీత్యాల సమయంలో తెలుగు సినీ పరిశ్రమ బాధితుల్ని ఆదుకునేందుకు ఎప్పుడూ ముందే ఉంటుంది. వ్యక్తిగత విరాళాలు అందించడంలో సినీ ప్రముఖులు ఒకరితో ఒకరు పోటీ పడతారు. ప్రేక్షకులు సినిమా చూడ్డం ద్వారా స్టార్స్ అయ్యాం కాబట్టి, వారికి కష్టమొచ్చినప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత తమ మీద ఉందని చాటి చెప్తారు సినీ ప్రముఖులు. అలా హుద్హుద్ బాధితుల్ని ఆదుకోవడానికీ ‘మేముసైతం’ అంటూ పెద్ద కార్యక్రమమే చేసింది తెలుగు సినీ పరిశ్రమ.
పదకొండు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయల్ని ‘మేముసైతం’ కార్యక్రమం ద్వారా సేకరించి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆ మొత్తాన్ని సినీ ప్రముఖులు అందజేశారు. ఆహ్వానించదగ్గ విషయమేమిటంటే చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ తదితర స్టార్ హీరోలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడం. సినిమాల్లో నటించడం మానేసినా చిరంజీవి, తుపాను బాధితుల్ని ఆదుకునే గొప్ప వేదిక ‘మేముసైతం’పై డాన్సులు వేశారు. బాలకృష్ణ పాటలు పాడారు. వెంకటేష్ ఇంకా హంగామా చేశారు. నాగార్జున కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు.
యువ తారలు కూడా క్రికెట్, కబడ్డీ పోటీలలో పాల్గొని, ‘మేముసైతం’ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నిర్వహణలో చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ, బేషజాలేవీ లేకుండా సినీ ప్రముఖులు అందరూ కలిసి వేడుకలో పాలుపంచుకోవడం అభినందనీయం.
|