జరిగిన కథ: సహస్ర కోసం విరాట్ ఇచ్చిన పేపర్ యాడ్ తో ఒక్కొక్కరు ఒక్కో విధంగా అలర్ట్ అవుతారు. కోర్టు లో తనను వెంబడించిన వారిని మట్టికలిపించి క్షణాల్లో తప్పించుకొంటుంది జర్నలిస్టు లహరి.
ఆ తరువాత.................
..........................................
అనుచరులకీ అడ్డా అది. అందుకే ఎప్పుడూ అక్కడ పటష్టమైన కాపలా ఉంటుంది. ఇక త్యాగరాజన్ కంపెనీలకు సంబంధించిన ఆఫీసులు మధురైలో ను ముఖ్యపట్టణాల్లోను ఉన్నాయి. ఆ ఆఫీసుల్లో సంచరించే త్యాగరాజన్ చాలా ఆఫీషీయల్ గా హుందాగా కన్పిస్తాడు, అక్కడంతా ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ పని చేస్తుంటారు.
అనుచరుల మాటలు ఎంత వరకు నమ్మాలో అర్ధంగాక అతను ఆలోచిస్తుండగా అంతలో అతడి ఇల్లీగల్ కార్యకలాపాలను గమనించే రైట్ హ్యాండ్ లాంటి ఎట్టయప్పన్ లోన కొచ్చాడు. ఎట్టయప్పన్ మళయాలీ. త్యాగరాజన్ కి నమ్మిన బంటుగా మారి తను బాగానే సంపాదించుకున్నాడు. మనిషి కూడ నల్లగా ఎత్తుగా చూడ్డానికి మెరటోడి లా కన్పిస్తాడు. త్యాగరాజన్ కన్నా ఎట్టయప్పకే అతడి అనుచరులు భయపడుతుంటారు. వాడు లోనకొస్తూ ‘‘మీ సందేహం నేను తీరుస్తా సార్ ’’ అన్నాడు.
‘‘చెప్పు ఈ అమ్మాయి జర్నలిస్టు లహరి అంటున్నారు మనవాళ్ళు. కాదని నా డౌటు’’ అడిగాడు.
‘‘డౌటు అక్కర్లేదు సార్! లహరి ఈ అమ్మాయే’’ అంటూ ఎదురుగా కూచున్నాడు ఎట్టయప్పన్.‘‘ఎలాగా... ఇక్కడ సహస్ర అని వుంది.’’
‘‘ఈ ప్రకటన రావటం మనకు చాలా మంచిదయింది. బయట వీధుల్లో ఇదే చర్చ. నా ఎంక్వయిరీలో తెలిసింది. ఈ అమ్మాయి అసలు పేరు లక్ష్మీ సహస్ర. పెద్దింటమ్మాయి. విదేశాల్లో చదువుకుంది. జర్నలిజంలో గోల్డ్ మెడలిస్టు. రచయిత్రి కూడ. తన పేరు లోని లక్ష్మీ లోని ‘ల’ అక్షరాన్ని సహస్ర లోని ‘హ’ అక్షరాన్ని కలిపితే ‘లహ’ అయింది. దీనికి ‘రి’ చేర్చి జర్నలిస్టు లహరిగా ప్రసిద్ది చెందింది. తనరూపంగాని ఐడెంటిటీ గాని ప్రత్యర్ధులకు తెలీకుండా జాగ్రత్త పడింది.
‘‘సో... ముందు జాగ్రత్తన్న మాట’’
‘‘అవును సార్. ఇక తన అసలు పేరు లోని సహస్రతో కథలు వ్యాసాలు వ్రాస్తూ కథ రచయిత్రి సహస్రగా కూడ పేరు సంపాదించుకుంది. కాబట్టి జర్నలిస్టు లహరి, కథా రచయిత్రి సహస్ర ఇద్దరూ ఒకటే.’’
‘‘సో... ఇక్కడ మనల్ని కెలికి తిప్పలు బెట్టి తప్పించుకుని చెన్నైలో తేలిందన్నమాట. వెరీ ఇంటెలిజెంట్. మార్షల్ ఆర్ట్ స్లో దిట్ట. రెండు మూడు నిముషాల్లోనే పదిమందిని చావు దెబ్బకొట్టి తప్పించుకు పోవటం మాటలా..? నేను తప్పుచేసాను. రివాల్వర్ తో కాల్చి పారేయమంటే కోర్టు ముందే చచ్చుండేది. బ్యాడ్ లక్ తప్పించుకుంది. నేను విధించిన మరణదండన దిక్కరించి తప్పించుకున్న తొలి మహిళ’’ అంటూ మెచ్చుకున్నాడు.
‘‘నువ్వు మరీ ఎక్కువ పొగిడేస్తున్నట్టున్నావ్... నా కన్నా అందంగా ఉందా ఏమిటి?’’ అంది పక్క సీట్లోని లక్ష్మి.తెరిచిన నోరు మూయటం మర్చిపోయి ఆమె వంక చూసాడు త్యాగరాజన్.
లక్ష్మి...
ఆవిడ సాదాసీదా లేడీ కాదు...
పక్కజిల్లాకు చెందిన జాయింట్ కలెక్టర్. అలాగే త్యాగరాజన్ కు అంతరంగిక ప్రియురాలు. త్యాగరాజన్ ఫైళ్ళు వేగంగా కదిలి చక చకా పర్మిట్లు సంపాదించటంలో లక్ష్మి సహకారం చాలా ఉంది. ఇంకా చెప్పాలంటే డబ్బు కోసం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ రూల్స్ ని తుంగలో తొక్కి త్యాగరాజన్ కు న్ని విధాలా ఆది నుంచీ సహకరిస్తూ వచ్చిన అధికారిణి. ఇందుకు ప్రతిఫలంగా కోట్లాది సొమ్ము ఆమె బినామి అకౌంట్లకు మళ్ళించాడు త్యాగరాజన్్.
లక్ష్మి చాలా అందంగా, రొమేంటిక్ గా ఉంటుంది.
ప్రస్తుతం ఆమె వయసు నలభై రెండు సంవత్సరాలు. కాని చూడ్డానికి ముప్పై దాటని ఫ్రౌడలా ఉంటుంది. డబ్బు వయసును కూడ దాచేసి మనిషికి కొత్త యవ్వనాన్ని ఉత్సాహాన్నిస్తుంది. కాస్త ఒళ్ళుచేసినా మేలిమి బంగారు వన్నే మేని ఛాయతో మిస మిస లాడే వంపు సొంపులతో మగాళ్ళని ఇట్టే ఆకర్షించేరూపం.
లక్ష్మి ఏకాంతంలో త్యాగరాజన్ తో కలిసి మందు కొడుతుంది. సిగరెట్లు కాలుస్తుంది. నిర్లజ్జగా అతనికి ఏం కావాలో యిచ్చి తనకి ఏం కావాలో తీసుకుంటుంది.
లక్ష్మికి పెళ్ళయింది. భర్త యిద్దరు పిల్లలున్నారు. భర్త సివిల్ ఇంజనీర్ గా మహారాష్ట్రలో ఎక్కడో పనిచేస్తూ అప్పుడప్పుడూ వచ్చి పోతుంటాడు. లక్ష్మి అక్రమ సంబంధం అతడికి తెలిసిన విషయమే అయినా పట్టించుకోడు. డబ్బు అన్ని తప్పుల్ని క్షమించేస్తుంది. కూతురు కొడుకు యిద్దరూ జర్మనీలో చదువుకొంటున్నారు.
‘‘నన్నో పిచ్చోడ్ని చేస్తే ఎలా?’’ అన్నాడు ఆఖరి ఆపిలు ముక్కను సిల్వర్ డిష్ లోంచి తీసి నోట్లో వేసుకుంటూ.
లక్ష్మి మూతి ముడిచింది.
‘‘ఇందులో పిచ్చితనం ఏముంది? ఆ ప్రకటనలో అమ్మాయి నా కన్నా అందంగా ఉందా? అనడిగాను అంతేగా’’ అంది సమర్దించుకుంటూ.‘‘అంతేగా అంటే?... అడగటంలో కూడ ఓ అర్ధం ఉండాలి గదా, నీ వయసు ఏమిటి? ఈ పిల్ల వయసు పాతికలోపు. వయసు పిల్లతో నీకు పోటీ ఎలా..? ఈ వయసులో నువ్వు అందంగానే ఉండుంటావ్. కాని యిప్పుడు? సహజత్వం ఏదీ? వయసు తెలీకుండా కొని తెచ్చుకొన్న అందమేగా అంతా? తనతో నీకు పోటీ ఏంటి? అందుకే నవ్వొచ్చింది?’’ అంటూ నవ్వాడు త్యాగరాజన్.ఆ యిద్దరు సంవాదం విని ఏంజాయ్ చేస్తూ ఎదురుగా కూచున్న ఎట్టయప్పతో బాటు మిగిలిన గుండాలు లోలోన నవ్వుకొంటున్నారు. లక్ష్మి ముఖం చిన్న బుచ్చుకుని చూసింది.
‘‘ఓకె... నేనేదో తమాషాకి అడిగాననుకో, ఆ పిల్లమీద జాలి చూపిస్తున్నావా. తనకి విధించిన మరణదండన రద్ద్దుచేసి యావజ్జీవ శిక్షగా మార్చబోతున్నావ్? అనడిగింది.
ఆ మాటలకి తల అడ్డంగా వూపాడు త్యాగరాజన్.‘‘మీ ఆడాళ్ళతో వచ్చిన చిక్కేయిది. బోడి గుండుకీ బొటున వేలికీ ముడివేసేయాలని చూస్తారు. ఎలా కుదురుతుంది? నేను విధించిన మరణదండన నుండి తొలిసారిగా ఓ ఆడపిల్ల తప్పించుకొని నాకే సవాల్ విసిరింది. కోర్టు దగ్గర అది కొట్టిన దెబ్బలకి నా మనుషులు ముగ్గరింకా ఆస్పత్రిలో బెడ్ మీద నాలుగు మాసాలుగా కోమాలో ఉన్నారు. అది బతికున్నంత వరకు మన పీకకు చుట్టుకున్న ఉరితాడు అలాగే ఉంటుంది. ఎలా వదిలేస్తాను? పాము చిన్నదయినా అందంగా ఉందని కొట్టి చంపకుండా వదిలేస్తామా? తల చితగొట్టి చంపేస్తాం. ఇదీ అంతే, మరణదండన అమలు జరిగి తీరుతుంది’’ అంటూ ఎట్టయప్ప వంక చూసాడు.‘‘ఇంతకీ ఈ కుర్రది ఎవరి తాలూకు? ఏ వూరు? దీని బ్యాగ్రౌండ్ ఏమిటి ఏమన్నా తెలిసిందా? అనడిగాడు.
‘‘తెలిసింది సార్. ఈ అమ్మాయి సాదాసీద యువతి కాదు. ఈమె బ్యాగ్రౌండ్ చాలా స్ట్రాంగ్. వింటే మీరే ఆశ్చర్యపోతారు’’ అన్నాడు ఎట్టయప్ప.
‘‘ఆహా.... వెరీ ఇంటస్ట్రింగ్... చెప్పుచెప్పు’’
‘‘ఈ అమ్మాయి ఎక్కడిదో కాదు సార్. స్థానికంగా మన మధురైకు చెందినదే. ఈమె తండ్రి మీకు బాగా తెలిసినవాడే. పైగా మీకు ప్రత్యర్ధి. అధికార పార్టీకి చెందినవాడు. ప్రస్తుతం ఈ ప్రాంతపు లిక్కర్ సిండికేట్ ముఖ్య నాయకుడు. అనేక వ్యాపారాలతో కోట్లకు పడగలెత్తినవాడు. ఒకప్పుడు మధురై ప్రాంతాన్ని పరిపాలించిన ఆంధ్రనాయకరాజుల వంశానికి చెందినవాడు.’’
ఎట్టప్పన్ మాటలు వింటుంటే జగన్మోహన్ ముఖంలో చక చక రంగులు మారి పోనారంభించాయి‘‘ఉన్నట్టుండి ఆగాగు’’...... అనరిచాడు‘‘ఏమిరా ఎట్టయప్పా నీవుచెప్పి నది మహాదేవ నాయకర్ గురించి కాదు గదా’’? అనడిగాడు అనుమానంగా. ‘‘కాకపోవటం ఏమి సార్. ఆయన గురించే చెప్తా వుండాను. ఆ మహాదేనాయకర్ ఏకైక కూతురే ఈ లక్ష్మీ సహస్ర.’’ అంటూ దృవీకరించాడు ఎట్టయప్పన్’’షాకైపోయాడు త్యాగరాజన్.
‘‘లోకల్ గా ఈ అమ్మాయి జర్నలిస్టని జనాలకు తెలీదు. తెలీకుండా జాగ్రత్తపడిరది. కాని కథా రచయిత్రి సహస్రగా ఈ అమ్మాయి మాత్రం చాలా మందికి తెలుసు. ముఖ్యంగా పేద బిక్కి మధ్యతరగతి ప్రజల్లో తండ్రి మహాదేవనాయకర్ లాగే ఈమెకూ మంచి పేరుంది. వాళ్ళకి ఏ సమస్య వచ్చి నా ముందుండి ఆదుకుంటుంది. ఆర్ధిక సహాయం చేస్తుంది. అవసరమైతే వాళ్ళ తరుఫున పోరాడుతుంది. కాబట్టి సహస్ర అందరికీ తెలుసు గాని ఈ అమ్మాయే జర్నలిస్టు లహరి అని అందరికీ తెలీదు. ఇ ప్పుడే పేపర్ ప్రకటన చూసి సహస్ర చెన్నైలో తండ్రికి తెలీకుండా ఉంటూ ఎవరో కుర్రాడ్ని ప్రేమించిందని, పాపం ఏమయిందో ఏమిటో ఆమె ప్రియుడు పత్రికల మూలంగా ప్రకటన యిచ్చినాడని చెప్పుకొంటున్నారు’’ అంటూ వివరించాడు.
ఆ మాటలకు కాస్త విసుగ్గా చూసాడు త్యాగరాజన్. లక్ష్మి క్కూడ అర్ధంగాక అయోమయంగా చూస్తోంది.
‘‘అంతా గందరగోళంగా ఉంది. నాయకర్ కి తెలీకుండా చెన్నైలో ఉండటం ఏమిటి? మనకి భయపడగా పారిపోయింది? తన కూతురిపైన హత్యాప్రయత్నం జరిగిందని తెలిస్తే మహాదేవనాయకర్ మౌనంగా ఉండే మనిషికాడే’’
‘‘చెప్తా సార్, అక్కడికే వస్తున్నా’’ అంటూ త్యాగరాజన్ ఆపాడు ఎట్టయప్ప.
చాలా కాలంగా మధురైలో బలమైన రెండు వర్గాలు త్యాగరాజన్ వర్గం, మహదేవనాయకర్ వర్గాలే. నగరంలో చిన్నచిన్న వర్గాలు ఏమున్నప్పటికీ అవి ఈ రెండు వర్గాల్లో ఏదో ఒక వర్గానికి అనుభంధంగా పనిచేసేవే. అయితే ఈ రెండు వర్గాల కార్యకలాపాలు వేరువేరు గావటంచేత ఇంత వరకు వీళ్ళ మధ్య ఎలాంటి ఘర్షణలు గొడవలు చోటు చేసుకోలేదు. అలాగే మధురై ప్రజల్లో మహదేవనాయకర్ కి ఉన్నంత పలుకుబడి అభిమానం త్యాగరాజన్ కు లేదన్నది వాస్తవం. మహాదేవనాయకర్ నేర చరిత్ర లేదు. అతని వద్ద ఉన్న సహచరులు అక్రమాలు అన్యాయాలకు వెళ్ళే వాళ్ళు కాదు. ప్రజలకీి ఏ ఇబ్బంది ఎదురైనా మహాదేవనాయకర్ ముందుంటాడు. ఎవరన్న తమకు అన్యాయం జరిగిందని ఆశ్రయిస్తే నాయకర్ తన మనుషుల్ని పంపి అన్యాయం చేసిన వాళ్ళ తాట తీయించి న్యాయం జరిపిస్తాడు. అలాగే దాన ధర్మాల్లోను ముందుంటాడు. కాని త్యాగరాజన్ అలా కాదు. అతడిది నేర చరిత్ర. తన సంపాదన తనూ తప్ప ప్రజల బాగోగుల గురించి పట్టంచుకోడు. ఇద్దరి స్వభావాల కీ ఉత్తర దక్షిణ ధృవాలంత వ్యత్యాసం వుంది.
ఎట్టయప్ప చెప్పటం ఆరంభించటంతో త్యాగరాజన్ ఆలోచనలు చెదరి పోయి తిరిగి అతడి వైపు దృష్టి సారించాడు.
‘‘సార్ ! మహాదేవనాయకర్ చాలా పట్టుదల మనిషి, మనకి ఇది తెలీని విషయం కాదు. తన మిత్రుడు ఈ ప్రాంతపు ఎంపి తో సంభందం కలుపుకోవాలని ఆయనకి మాటిచ్చేసాడు, కాని ఈ సంబంధం చేసుకోవటం లక్ష్మీ సహస్రకిష్టం లేదు. ఈ విషయంలో కొద్దికాలంగా తండ్రి కూతురు మధ్యన వాదం కొనసాగుతూ వస్తోంది. ఏదీ ఏమైనా ఈ పెళ్ళి జరగాలంటాడు మహదేవనాయకర్, తనుచేసుకోనంటుందాపిల్ల. ఈ పరిస్థితుల్లో తన పట్టుదల కొద్ది నిశ్చితార్ధ నిమిత్తం ముహూర్తం నిశ్చయించేసారు మహాదేనాయకర్.
సరిగ్గా లహరి కోర్టు దగ్గర మనోళ్ళ నుంచి తప్పించుకున్న మరునాడే ఆ నిశ్చితార్ధం రోజు. ఆ రాత్రి బాగా ఆలోచించుకొని అటు యిష్టం లేని పెళ్ళి తప్పించుకోడానికి, యిటు కొంతకాలం పాటు మన కంటపడకుండా ఉండటానికి అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోవాలనుకుని ఉంటుంది. అందుకే ఆ రాత్రికి రాత్రే ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి మధురై నుండి పారిపోయింది.
రాజకీయ పరిచయాలున్న వ్యక్తి గాబట్టి మహాదేవనాయకర్ కూడ జర్నలిస్టు లహరినే........ ఆమె రాజకీయ విశ్లేషణలు వ్యాసాలను చాల ఆసక్తిగా చదువుతూంటాడు. కాని ఆ లహరి తన కూతురు లక్ష్మీ సహస్రని మాత్రం ఆయనకి తెలీదు. కాలక్షాపానికి సహస్ర పేరు మీద ఏవో కథలు రాస్తుంటుందని మాత్రమే తెలుసును.
కాబట్టి ఇష్టం లేని పెళ్ళి నుంచి తప్పించుకోడానికే తన కూతురు ఇల్లొదిలి పారిపోయిందనుకున్నాడు గాని కోర్టు ఆవరణలో లహరి మీద జరిగిన హత్యాప్రయత్నం గురించి ఆయనకు తెలీదు. తెలిస్తే మధురై యింత ప్రశాంతంగా ఉండేది కాదు’’ అంటూ అసలు విషయం వివరించాడు ఎట్టయప్పన్.
ఎట్టయప్ప మాటలు వాస్తవాలని త్యాగరాజన్కి తెలుసు. తమ మధ్య ఎన్ని గొడవలున్న తన కూతురు మీద హత్యాప్రయత్నం జరిగిందని తెలిస్తే మహాదేవనాయకర్ వూరుకోడు. తమ రెండు వర్గాల దాడుల్లో మధురై అల్లకల్లోలమై ఉండేది. కాబట్టి ఈ ప్రశాంతత యిలాగే కొనసాగాలంటే తన కూతుర్ని ఎవరు చంపారో కూడ మహదేవనాయకర్కి తెలీకుండా జాగ్రత్తపడాలి. సానుభూతి చూపిస్తూ తను మహాదేవ నాయకర్ ఇంటికి వెళ్ళి లహరి శవం మీద పూలదండ వేసి రావాలి. ఇది జరగాలంటే మహదేవనాయకర్ కన్నాముందే లహరి చెన్నైలో ఎక్కడ ఉందో ట్రేసవుట్ చేసి హతం చేయాలి.మరోసారి త్యాగరాజన్ ఆలోచనల్ని చెల్లాచెదరు చేస్తూ ఎట్టయప్పన్ తన ఆఖరి ఇన్ఫర్మేషన్ బయటపెట్టాడు.
‘‘నేనిటు వచ్చేముందే తెలిసిన వార్త సార్. పేపర్ ప్రకటన చూడగానే మహాదేవనాయకర్ చెన్నైలో గల్లిగల్లి గాలించయినా లక్ష్మీ సహస్రను పట్టి -వెనక్కి తీసుకురమ్మని ఆదేశించి పదిమంది తన మనుషుల్నిగంట క్రితమే చెన్నై పంపించాడట’’.
ఆ మాటలకు త్యాగరాజన్ సీరియస్ గా చూసాడు.
‘‘సో......... మనమేలేటు. ఇప్పుడ మనం ఏం చేయాలి?’’ అనడిగాడు.
‘‘మనం కూడా పదిమందిని పంపిద్దాం సార్. మహాదేవనాయకర్ మనుషుల కన్నా ముందే మనోళ్ళు చెన్నై చేరుకునేలా ఫ్లైట్ లో పంపించేద్దాం. చెన్నైలో మన ఆఫీసు నుంచి వేన్తీసుకుంటారు. అవసరమైతే అక్కడ లోకల్ గుండాల సాయం తీసుకుంటారు. లేదంటే’’.‘‘ఆపరా! ........’’ అంటూ ఎట్టయప్ప మాటలకు అడ్డం వచ్చాడు త్యాగరాజన్ ‘‘ ఏరా! ........ అదే మన్న చిన్న పల్లెటూరు అనుకున్నావా ? నాలుగు వీధులు తిరిగి ఆ పిల్లదాన్ని పట్టుకోడానికి? చెన్నై మహానగరం. ఎక్కడుందో తెలీకే దీని ప్రియుడు పేపర్ ప్రకటనిచ్చాడు. మన వాళ్ళు మాత్రం పరుగులెత్తి ఏం చేస్తారు? వ్యాన్ ఇచ్చి రోడ్ రూట్లో పంపించు. అయిదుగురు చాలు’’ అన్నాడు. ‘‘ఎందుకైనా మంచిది సార్. పదిమందిని పంపుదాం అన్నాడు’’ ఎట్టయప్పన్.
‘‘కాని ఆ పదిమందిలో కనీసం ఇద్దరయినా బెస్ట్ షూటర్స్ ఉండాలి. రివాల్వర్ ఎత్తుతే గురి తప్పకూడదు. మొదటి బుల్లెట్ కే ప్రాణం పోవాలి.’’‘‘ఆ విషయం నాకొదిలేయండి సార్’’
‘‘మరో మాట ’’
‘‘చెప్పండి సార్’’
ఆమెపై వారి పగ అభిమానం గా మారనుందా? ఏం జరగనుంది????
వచ్చేవారం దాకా అగాల్సిందే....
[email protected]
www.suryadevararammohanrao.com |