Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
avee-e vee

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevanam
ఆముక్తమాల్యద

ఖాండిక్య కేశిధ్వజులు అనే యిద్దరు చక్రవర్తులు 'నిమి' వంశానికి చెందినవారు. శ్రీరాముని  వంశంలో ప్రసిద్ధుడైన ఇక్ష్వాకు మహారాజు కుమారుడు నిమి (తన కులగురువైన వశిష్టుని  శాపకారణంగా శరీరహీనుడు అయినాడు ఇతను. బ్రహ్మదేవుని దయవలన ' శరీరం లేకున్నా  అతి ముఖ్యమైన ధర్మాన్ని, కర్మాన్ని నిర్వహించే వరం యిస్తున్నాను, ప్రాణుల కంటిరెప్పల యందు నివశించుమని వరమును పొంది, ప్రాణుల కంటిరెప్పలయందు నివసిస్తున్న కారణంగా కంటిరెప్ప ఒకసారి మూసి తెరవడానికి పట్టే కాలం నిమేషం అని పిలవబడుతున్నది.) ఆ నిమి వంశంలో ధర్మద్వజుడు అనే రాజుకు 'మితధ్వజుడు', 'క్రుతధ్వజుడు' అనే యిద్దరు కుమారులు.వీరిద్దరికీ చెరొక కుమారులు కలిగారు. ఆ కుమారులు 'ఖాండిక్యుడు', 'కేశిధ్వజుడు'. అన్నదమ్ముల కుమారులైన వీరికి దాయాదులకు సహజమైన వైరం కలిగి ఒకరి రాజ్యాన్ని మరొకరు ఆక్రమించుకోడానికి ప్రయత్నం చేయడంతో చాలారోజులు పెద్ద యుద్ధం జరిగింది.  

పలపల వేగ నిచ్చలును బౌఁజులు దీర్చి యతండు నాతడున్
వెలువడి వచ్చి యిక్షుమతి వేణిక యేపిరికాఁగ వీఁగుచున్
దలపడుచుం బెనంగఁగఁ గృతధ్వజనందనుసైనికావళీ 
హళహళికిం జెడన్విరిగె నార్తి మితధ్వజ నందనుం డనిన్

తెల్లవారగానే (పలపలన్) సైన్యాలను తీర్చి ఆ యిద్దరూ శిబిరాల్లోనుంచి బయటకొచ్చి యిక్షుమతీ నది ఒడ్డున ఆ నది తల్లడిల్లేలా పోరుసలుపుతుండగా కృతధ్వజుని కుమారుడైన కేశిధ్వజుని సైన్యం యొక్క 'ఒత్తిడికి'(హళహళికిన్) తట్టుకోలేక, మితధ్వజుని కుమారుడైన ఖాండిక్యుడు ఆర్తితోయుద్ధాన్ని వదిలి పారిపోయాడు(చెడన్ విరిగెన్)  

చెడవిఱిఁగియడవిఁ బడి యెడ 
నెడ గట్టులతుదలఁ గోటి యిడి లోఁ గడకున్ 
దడుకుఁ బొడిపించి యాకుల 
గుడిసెల వసియించె మంత్రిగురుభటయుతుడై

యిది ఒక చమత్కారపు పద్యం. పదబంధాన్ని బట్టి మాత్రమే కాక, సహజంగా రాజుల విధానాన్ని చెప్పాడు యిందులో. పారిపోయిన ఖాండిక్యుడు ఒక అడవిలో ప్రవేశించి, అక్కడక్కడ, కొండకొనలమీదవేగులవాళ్ళను నియమించి(గట్టులతుదలన్ 'కోటి'యిడి, 'కోటికాడు' అంటే వేగులవాడు అని)చుట్టూ లోతుగా కంప పాతించి( లోనన్ కడకు తడుకున్ పొడిపించి, తడుకు అంటే కంప)ఆకుగుడిసెలలో   (పర్ణశాల అనే పదాన్ని మక్కీకి మక్కీ తేలికజేసిన జానపద తెలుగులో ఆకుగుడిసె అన్నాడు!) తన మంత్రి, గురువు, భటులు మొదలైన వారితో నివసించడం మొదలుబెట్టాడు. అక్కడ కేశిధ్వజుడు ఖాండిక్యుని రాజ్యము స్వాధీనమైన తర్వాత, ఆ రాచరికంతో సంతృప్తి పడక,

ఆ కేశిధ్వజుఁడంత నా నృపుని రాజ్యంబెల్లఁ జేరన్ఫలం
బాకాంక్షింపక గెల్తు మృత్యువునవిద్యన్బుట్టకుండం దుదన్
జా కుండ న్వలె నంచు యోగ నిరతిం జ్ఞానాశ్రయుండై  మఖా
నీకంబుల్రచియించు చం దొకటికిం దీక్షించి తానున్నచోన్

ఫలమును ఆకాంక్షింపక, అంటే లౌకికమైన ఫలితములను కోరుకోక, మృత్యువును గెలవాలి, అజ్ఞానముతో మరల మరలా పుట్టడం, చావడం కాకుండా, అని యోగనిరతితో అనేకములైన క్రతువులను చేస్తూ, ఆ క్రమంలో ఒకానొక క్రతువు చేయడానికి దీక్ష పూనుకున్నప్పుడు,

పులు మఖశాలికానికట భూముల మేయుచు నేటివెంటఁ బె
ల్ల లమెడునీఱముం దఱిసి యామ్య పతాకన ఘర్మ ధేను వా
కెలవుల నాడు వాలభుజగిం గని గోండ్రని యంగలార్చుచున్
గలగత ఘంట మ్రోయ నురుకం బిడుగుం బలెం దాఁకి యుద్ధతిన్

ఆ యాగధేనువు(ఘర్మధేనువు, ధర్మధేనువు) యజ్ఞ వాటికా సమీపములోని భూములలో మేత మేస్తూ (మఖశాలికానికట భూముల మేయుచు) ఏటి ఒడ్డున ఉన్న పెద్ద పొదరింటిని సమీపించి, ఆ పొదలో యముని జెండాలాగా ఉన్న పెద్దపులిని, కాలసర్పంలాగా ఉన్న తోకను ఆడిస్తూ ఉన్న పెద్దపులిని చూసి, మెడలోని ఘంటలు మ్రోతలు చేస్తుండగా పరుగెత్తి తప్పించుకుపోదామని ప్రయత్నిస్తున్నా వదలక, గోండ్రుమని గర్జన చేస్తూ పిడుగువలె వడిగా వచ్చి తాకింది ఆ పెద్దపులి. ముఖానికి ముసురుకుంటున్న జోరీగలతో, దుర్వాసన వెలువరిస్తున్న నోటితో, చుట్టుపక్కల ఉన్న చెట్ల ఆకులు రాలేట్లు చెట్లను దూకుతూ,దాటుతూ వర్షాకాలపు మేఘంలాగా బొబ్బరింతలు పెడుతూ వచ్చిన ఆ పెద్దపులిని చూసి ఆ ఆవును కాస్తున్న గొల్ల పిల్లడు చెవులు దిబ్బడలేసి, భయంతో వణుకుతూ స్పృహతప్పి పడిపోయాడు. ఆ ఆవు గొంతును కరిచిపట్టుకుని, దాట్లుకొడుతూ ఈడ్చుకుపోయింది ఆ పెద్దపులి.

  తనువుఁ గొమ్ము గొరిజఁ గొనకుండ మలఁపుచుఁ 
జప్పు డెసఁగఁ దోఁక నప్పళించి
శోణితంబుఁ గ్రోలుచునె నేర్పుమై ఘర్మ 
గవిని గవికి నీడ్చు నవసరమున

తన శరీరానికి ఆ ఆవుయొక్క కొమ్ములు గిట్టలు తగలకుండా దానిని మరలిస్తూ పొర్లిస్తూ, చప్పుడయ్యేలా తోకను నేలకు తాటిస్తూ దాని నెత్తురు తాగుతూనే నేర్పుగా ఆ ఆవును తన గుహకు ఈడ్చుకు పోతుండగా,

పొలమరులందుఁ గూఁతలిడు భూసురులన్నది వార్చి వార్చి  మ్రా
కుల తుద లెక్కి చప్పటలు గొట్టి యదల్పఁగ, సాహిణీలు మా
వులఁ బఱవంగ వైచి సెలవు ల్వెస నాకుచుఁ బోయె వృక్ష మం
డలికయి తూలుచున్ఘుటఘుటధ్వని సారె మలంగి చూచుచున్

ఈ పులి గాండ్రింపులను, ఆవు అంబా రావాలను, పొదల చప్పుడులను విని, ఆ దృశ్యాన్ని దూరంనుండి చూసిన సమీపంలోని పంటచేల కాపరులు హెచ్చరికగా కూతలు వేయగా, ఆ ఏటిలో సంధ్య వార్చి వస్తున్న ఆ క్రతువు బ్రాహ్మణులు దగ్గరలో ఉన్న చెట్లెక్కి పెద్దగా అరుస్తూ చప్పట్లు కొడుతూ ఆ పెద్దపులిని అదిలించడానికి ప్రయత్నాలు చేశారు. కొందరు భటులు గుర్రాలెక్కి ఆ పులిని వెంటబడి తరిమారు. ఈ ఎదురుదాడితో ఆవును వదిలిపెట్టి పెదవులు నాక్కుంటూ, వెనక్కు తిరిగి తిరిగి చూస్తూ, గుర్రుగుర్రుమంటూ, బరువైన శరీరము ఊగుతుండగా (తూలుచున్) వేగంగా సమీపంలోని వృక్షముల మధ్యలోకి వెళ్ళింది పెద్దపులి. ప్రత్యక్షముగా ఎన్నోసార్లు వేటకు వెళ్ళి క్రూరమృగాలను సమీపమునుండి చూసిన అనుభవము, పరిశీలనా  శక్తితో రోమాంచితంగా వర్ణించాడు రాయలు ఈ దృశ్యాన్ని.

జుఱుజుఱుకున నెత్తురు వెలి
కుఱుకుచు రొద సేయ నఱితి యొడపిన యూర్పుల్ 
పఱవ మిడిగుడ్లు వడఁకఁగఁ 
గొఱ ప్రాణముతోడఁ దన్నికొను నమ్మొదవున్

మెడకు ఐన గాయము సుర సురమని ధ్వని చేస్తూ నెత్తురును వెలువరిస్తుండగా, పెద్దగా ఊర్పులు వదలుతూ, మిడిగుడ్లు వేసి, కొసప్రాణముతో తన్నుకుంటున్న ఆ గోవును చూసినవారు వెళ్లి ఈ వృత్తాంతమును రాజుకు(కేశిధ్వజునికి)విన్నవించారు. యజ్ఞధేనువు మరణించింది. యజ్ఞానికి విఘ్నము కలిగింది. దీనికి ప్రాయశ్చిత్తము ఏమిటి అని రాజు ఋత్విక్కులను అడిగాడు. వారు తమకు తెలియదు అని, కశేరువు అనే ఋషిని అడగమని చెప్పారు. అతడిని అడిగితే నాకు కూడా తెలియదు, శునకుడు అనే ఋషిని అడగవలసింది అని చెప్పారు. ఆ శునకుడు అనే ఋషినాకే కాదు, మాకెవ్వరికీ తెలియదు, తెలిస్తే గిలిస్తే, ఎవరు తన సప్తాంగములు ఐన స్వామి, అమాత్య,సుహృత్, కోశ, రాష్ట్ర, బల, దుర్గములను అన్నింటినీ నీకు వదిలిపెట్టి చెట్టూ పుట్టా పట్టి తిరుగుతున్నాడో ఆ ఖాండిక్యునికే తెలిసి ఉండవచ్చు, అతను మహా జ్ఞాని, ప్రాయశ్చిత్తము ఏమిటో అడగడం, ఆచరించడం తప్పదు అనుకుంటే వెళ్లి అతడినే అడుగు అని చెప్పాడు. అంటే ఆ ఋషి ఒక చిన్న విసురు విసిరాడు,నీ దర్పాన్ని, అహాన్ని వదిలిపెట్టి వెళ్లి అతడినే అడుగు, నీ వలన పాపం మహాజ్ఞాని అలా అడవుల్లో పడి మ్రగ్గుతున్నాడు అని! దానికి,

నరపతి పల్కె, మౌనివర నారిపు నిష్కృతి వేఁడఁబోయిన
న్ధర హతుఁ జేసెనేని సవనంపు ఫలం బొడఁగూడు గా క మ
త్సరగతిఁ జెప్పెనేని మఖ తంత్ర మతంత్రముఁ గాక పూర్ణమౌ
నిరు దెఱఁగు న్మదీప్సితమె యేఁ గెదనంచు రథాధి రూఢుడై

ఓ ముని వర్యా! నా శత్రువు ఐన ఖాండిక్యుడిని ప్రాయశ్చిత్త మార్గమును తెలుసుకోవడానికి వెళ్తే నన్ను చంపేస్తాడా, యజ్ఞము చేస్తూ మరణించిన కారణముగా నాకు పుణ్యము, యజ్ఞమును చేస్తున్నవాడిని చంపినందుకు ఆతడికి పాపమూ! అలా కాక, అమత్సర గతితో, అంటే నాయందు ఈర్ష్య లేకుండా మార్గము చెప్తాడా, ఈ మఖతంత్రము అతంత్రము కాకుండా పోతుంది, అంటే ఈ యజ్ఞము క్రమము తప్పదు, సక్రమముగా నడుస్తుంది, అప్పుడూ నాకు పుణ్యమే. కనుక ఉభయత్రా నాకు సమ్మతమే, కనుక వెళ్లి అడుగుతాను అని బయలుదేరాడు కేశిధ్వజుడు.ధార్మిక మర్మాలు, వ్యవహార కౌశల్యము కేశిధ్వజుని ద్వారా వెల్లడించాడు రాయలు.

(కొనసాగింపు వచ్చేవారం)

వనం వేంకట వరప్రసాదరావు.
మరిన్ని శీర్షికలు
Arthritis in Children | Ayurvedic Treatment | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)