సోమనాథ్ - లక్ష్మీ పద్మజ దుగ్గరాజు

somanath
జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది . దీనిని ప్రభాస తీర్ధం అని కూడా అంటారు . ఈ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలో వేరవాల్ అనే ప్రదేశం లో వుంది . ఇది అరేబియా సముద్ర తీరాన వెలసిన పుణ్య క్షేత్రం . సోమనాథ్ లింగాన్ని  చంద్రుడు ప్రతిష్టించాడని  పురాణ కధనం. సోముడు అనగా చంద్రుడు అని అర్ధం. చంద్రుడిని దక్షుడి శాపం నుండే విముక్తుడిని చేసిన శివుడి ఆలయం కనుక ఇది సోమనాథ్ ఆలయం అని ప్రసిద్ధి చెందింది. 6 సార్లు ధ్వంసం చేయబడి పునర్మించబడిన ఏకైక ఆలయం ఇది .

మహమ్మద్ ఘజనీ ఈ ఆలయం లోని శివలింగాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించి చేతకాక ఆలయ అర్చకులని హింసించి ఆలయం ధ్వంసం చేసి పోయాడు . సోమనాథ్ మొదటి ఆలయం 1 శతాబ్దం లో నిర్మించ బడింది అని చరిత్ర లో ప్రస్తావిచటం జరిగింది . ఆలయాన్ని ఘజనీ ధ్వంసం చేసాక 12-13 శతాబ్దం లో పునర్నిర్మాణం చేసారు.  12 వ శతాబ్దం లో పఠాన్ ప్రభువైన పరమదేవ్ దేవాలయాన్ని నిర్మించాడు . 1296 లో అల్లావుద్దేన్ ఖిల్జీ ఈ ఆలయం పై దాడి చేసి ధ్వంసం చేసాడు . ఉలుం  ఖాన్ అనే సేనాని ఈ ఆలయం పై దాడి చేసి శివలింగాన్ని ధ్వంసం చేసి ముక్కలు ముక్కలు చేసి ఖిల్జీ కి కానుకగా సమర్పించాడు .

ఆ తర్వాత 1325-31  ప్రాంతంలో జునాగడ్ రాజు కుమారుడు ఇక్కడ లింగ ప్రతిష్ట చేసాడు . 1459 లో మహమ్మద్ బెగ్డా ఈ లింగాన్ని తీసి వేసి మసీదు గా మార్చాడు . అక్బర్ పరమత సహనం కలవాడు అవడం వలన కొంత కాలం ఇక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంది . ఔరంగజేబు కాలంలో ఇండోర్ మహారాణి అహల్యాబాయి సోమనాథ్ మందిరాన్ని పునర్నిర్మించారు . ఇండోర్ రాణి అహల్యాబాయి సోమనాథ్ ఆలయం లో లింగ ప్రతిష్ట భూగర్భంలో చేయించి శత్రువుల బారి పడకుండా ఏర్పాట్లు చేసింది . 
 
 
ఆనాటి దేవాలయం శిధిలావస్తకు చేరుకోవడం వలన స్వాతంత్ర్యానంతరం 1951 లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు లింగ ప్రతిష్ట చేయించి పునర్నిర్మాణ కార్య క్రమాలు చేపట్టారు . ఈ దేవాలయం ముందు భాగం నవనగర్ మహారాణి తన భర్త పేరు మీద కట్టించారు . దీనిని 1970 లో సత్య సాయి బాబా గారు ప్రారంభోత్సవం చేసారు. ఇప్పుడు సోమనాథ్ దేవాలయం అన్ని వసతులతో ఏంటో వైభవంగా మన భారతీయులనే కాదు అన్ని దేశాల వారిని ఆకర్షిస్తూ  వెలిగిపోతోంది. 
 
ఈ ఆలయ పురాతన స్తూపాలు మరియు దేవతా మూర్తులను ఇక్కడి పురావస్తు ప్రదర్శన శాలలో భద్ర పరచారు. సోమనాథ్ లో సరస్వతి, కపిల , హిరణ్ ఈ ౩ నదుల త్రివేణి సంగమంగా అరేబియా సముద్రం లో కలుస్తాయి . ఈ ఆలయం కైలాస మహా మేరు ప్రసాదం గా పిలువబడుతుంది . 
 
భారత దేశం లోని అన్ని ప్రాంతాల నుండీ ఈ సోమనాథ్ ఆలయానికి రవాణా సౌకర్యాలు గలవు.ఇక్కడ ఉండడానికి గదుల వసతి సౌకర్యం కూడా కలదు . సోమ నాథ్ కి అతి దగ్గరలో వున్నా రైల్వే స్టేషన్ వీరవల్. ఈ ఆలయం దర్సనం వేళలు ఉదయం 6 గంటల నుండీ రాత్రి 9.౩౦ వరకు. హారతి వేళలు ఉదయం 7, మధ్యాహ్నం 12, రాత్రి 7 .