ఆఖరి మజిలి - కందర్ప మూర్తి

aakhari majili

వివేకానందనగర్ కాలనీలో రిటైర్డ్ జస్టీస్ విశ్వనాథం గారి ఇల్లు ప్రత్యేకంగా డిజైన్ చేసి కట్టించారు. ఆయన వయసు ఏడు పదులు దాటింది. సర్వీస్ లో ఉన్నప్పుడు ఎన్నో క్లిష్టమైన సివిల్ క్రిమినల్ కేసుల తీర్పులు చెప్పారని ప్రసిద్ది. ఇద్దరు కొడుకుల్నీ లా చదివించి హైకోర్టులో లీడింగ్ లాయర్స్ గా తయారు చేసారు. విశ్రాంత జీవితం ఆధ్యాత్మిక సమాజ సేవలో గడిచిపోతోంది. వారి ధర్మపత్నివిశాలాక్షమ్మ కూడా సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చి నందున పూజలు , గుళ్లూ గోపురాల సంధర్సన , వృద్ధ మహిళల సేవలో తరిస్తున్నారు. సంప్రదాయ కుటుంబ అమ్మాయి లైనందున కోడళ్లిద్దరూ పెద్ద చదువులు చదివినా ఆధునిక నాగరిక పోకడలకు పోకుండా అత్తమామలకు అనుకూలంగా ఉంటు పేద పిల్లల చదువులు, బాల్య వివాహాల నిరోధం, బడుగు మహిళల బాగోగులతో సమాజసేవ చేస్తున్నారు.

విశ్వనాథం గారికి ఇద్దరు సిసింద్రీల్లాంటి మనుమలున్నారు. వారిద్దరూ ఇంటీవద్ద ఉంటే ఆటపాటలతో గోలేగోల.కుటుంబ సబ్యుల మద్య సుఖ సంతోషాలతో ఆనందంగా రోజులు గడిచిపోతున్నాయి. కాలనీ పార్కులో పదవీ విరమణ చేసిన ఉద్యోగతులు , మిగతా సీనియర్ సిటిజన్ సబ్యులు ఉదయం నడక తర్వాత తీరిగ్గా కూర్చుని దేశ వర్తమాన రాజకీయాలు, ఆరోగ్య , సామాజిక విషయాలు చర్చించుకుని ఇళ్లకి చేరుకుంటారు. విశ్వనాథం గారు ఉదయం వాకింగ్ పూర్తి చేసుకుని ఇంటికొచ్చే సమయానికి కొడుకులు ఇద్దరూ క్లయింట్ల కేసుల స్టడీ తర్వాత భోజనం చేసి గుమస్తాతో కోర్టుకి వెళ్లే హడావిడిలోను , పిల్లల్ని తయారు చేసి స్కూల్ కి పంపి ఇంటి పనులు చూస్తున్న కోడళ్లు , పూజా కార్యక్రమాలతో ధర్మపత్నీ దర్సనం ఇస్తారు. ఆయన సర్వీస్ లో ఉన్నప్పుడు సేకరించిన న్యాయశాస్త్ర వాల్యూములు ఆఫీస్ అద్దాల బీరువాల్లో భద్రంగా ఉంచారు. హాల్లో జాతీయ దేశ నాయకులు మహాత్మాగాంధీ , జవహర్ లాల్ నెహ్రూ ,వల్లభాయ్ పటేల్, వివేకానందుడు, సుభాష్ చంద్ర బోసు పెద్ద ఫోటోఫ్రేముల్లో పలకరిస్తాయి. పాతకాలం నాటి కర్రసోఫాలు , దేవదారు టేకు నల్లమద్ది కుర్చీలు స్వాగతం పలుకుతాయి.

తండ్రి క్రమశిక్షణలో కొడుకుల పర్యవేక్షణలో అవి సురక్షితంగా తరాల్ని జ్ఞాపకం చేస్తూంటాయి. వయసుతో పాటు వృద్ధాప్య ఛాయలు విశ్వనాథం దంపతుల్ని చుట్టు ముట్టాయి. మధుమేహం ,రక్తపోటు లెవెల్సు పెరిగాయి. ఈ మద్య విశ్వనాథం గారి ఆరోగ్యంలో పెనుమార్పులు చేసుకున్నాయి. మతిమరుపు వచ్చి కావల్సిన వస్తువుల కోసం వెతుక్కోవడం, కళ్లజోడు నెత్తిమీద ఉంచుకుని ఏమైందని అందర్నీ అడగడం, బాత్రూం అనుకుని వంటగదిలోకి వెల్తున్నారు. చెయ్యి వణుకుడుతో కాఫీకప్పు కింద పడవేసు కుంటున్నారు. పెన్సన్ కోసం సంతకం సరిపోలక వేలి ముద్రలు వెయ్యవలసి వస్తోంది. కొడుకులు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సీనియర్ న్యూరోలజిస్టును సంప్రదిస్తే ఆయన్ని ఎగ్జామిన్ చేసి పరీక్షలన్నీ జరిపి వయసురీత్యా శరీరంలో మార్పులు జరిగి మెదడుకి సంబంధించిన డెమన్షియ అల్జీమర్స్ సమస్యలు వచ్చాయని తగిన వైద్యం అందించి వంటరిగా వదలకుండా ఎవరో ఒకరు కనిపట్టుకుని ఉండాలనే సూచనలు ఇచ్చారు.

అందువల్ల ఇదివరకటిలా ఆయన్ను ఒంటరిగా బయటకు పంపడం లేదు. అదే కాలనీలో ఉండే రిటైర్డు ప్రిన్సిపల్ నరశింహమూర్తి గారు తరచు విశ్వనాథం గారి దగ్గరకు వచ్చి కాలక్షేపం చేస్తూంటారు. ఇంట్లో వారితో కూడా ఆయనకి చనువు ఎక్కువే. ఒకరోజు కాలనీ కమ్యూనిటీ హాల్లో స్వామి పరమానంద గారి ప్రవచనం ఉందని ఉదయం పది గంటలకు విశాలాక్షమ్మకు చెప్పి నరశింహమూర్తి గారు విశ్వనాథం గారిని వెంట తీసుకు వెళ్లారు. కమ్యూనిటీ హాల్లో స్వామి వారి ప్రవచనం పూర్తయి అందరూ తిరుగు ముఖం పట్టేరు.వెంట వచ్చిన నరశింహమూర్తి గారు కాలనీలోకి వచ్చిన తర్వాత తన కళ్లజోడుపెట్టె కమ్యూనిటీ హాల్లో మరిచి వచ్చానని చెప్పి విశ్వనాథం గారిని వారి ఇంటి గేటు చూపించి వెనక్కి వెళ్లారు. విశ్వనథం గారు అలాగేనని చెప్పి ఇంటికి బయలు దేరారు.ఇంటి గేటు ముందు నుంచి వెళ్లారు కాని గేటు గుర్తు పట్టలేక కాలనీ దాటి చాలా దూరం వెళ్లిన తర్వాత వారి కాలనీ విధ్యార్థి ఎదురు పడి " తాత గారూ, ఇటు ఎక్కడికి వెల్తున్నారని " అడిగాడు. ఆ అబ్బాయి వారి మనవడి స్నేహితుడు కనక గుర్తుపట్టి "ఇంటికిరా, సిద్దూ ! " అన్నారు. " ఓ మైగాడ్ ! మీరు ఇల్లు దాటి చాలా దూరం వచ్చేసారు తాతయ్యా , పదండి , ఇంటి దగ్గర దిగబెడతా" నని వెనక్కి తీసుకు వస్తున్నాడు.

భోజనం సమయం దాటిపోయినా విశ్వనాథం గారు రాలేదని ఇంటి దగ్గర కోడళ్లూ , విశాలాక్షమ్మ ఎదురు చూస్తున్నారు. విశ్వనాథం గార్ని వెంట పెట్టుకు వచ్చిన సిద్ధార్థ జరిగిన విషయం చెప్పి వెళి పోయాడు. ఉదయం నరశింహమూర్తి గారితో వెళ్లిన విశ్వనాథం గారు ఇంటి గేటు దాటి ఒంటరిగా ఎలా వెళ్లారో అర్థం కాలేదు వారికి. తర్వాత ఆయన్ని విషయం అడిగి తెల్సుకుని మతిమరుపు వల్ల ఇంటి గేటు గుర్తు పట్టలేకపోయారను కున్నారు. సాయంకాలం కోర్టు నుంచి ఇంటికి వచ్చిన కొడుకులు విషయం తెలిసి ఆయన్ని ఒంటరిగా ఎక్కడికీ పంపవద్దని , ఎప్పుడూ ఎవరోఒకరు కనిపెట్టుకుని ఉండాలన్న న్యూరోలజిస్టు సూచనలు గుర్తు చేసారు. ఇలా అనేక ఆరోగ్య సమస్యలతో వైద్యుల పర్యవేక్షణలో విశ్వనాథం గారు రోజులు వెళ్లదీస్తున్నారు. ఊబకాయం వల్ల రాత్రిళ్లు నిద్రలో గురక ఎక్కువైంది. విశాలాక్షమ్మకు నిద్రాభంగం అవుతున్నా భర్తని కనిపెట్టుకుని మద్యలో లేపి మంచినీళ్లు తాగించడం చేస్తూంటుంది.

ఒకరోజు తెల్లవారు జామున మగత నిద్రలో ఉన్న విశాలాక్షమ్మ గారు పెద్ద కోడలి పిలుపుకి ఉలిక్కిపడి లేచింది. రోజూ ఆ సమయానికి అత్తగారు స్నానం చేసి పూజ గదిలో ఉంటారు.వేళ దాటిపోయిందని కోడలు గది దగ్గరకొచ్చి పిలిచింది. గాబరాగా లేచిన విశాలాక్షమ్మ మంచం మీద చలనం లేకుండా విగత జీవిగా పడున్న విశ్వనాథం గార్ని చూసి ఆందోళనగా పెద్ద కొడుకుని కేకేసిందీ. కంగారుగా వచ్చిన ఇద్దరు కొడుకులు తండ్రి పరిస్థితి చూసి వారి ఫేమిలీ డాక్టరుకి కాల్ చేసి పిలిపించారు. డాక్టరు ఆయన్ని ఎగ్జామ్ చేసి గురకలో ఊపిరి అందక తెల్లవారు జామున గుండె ఆగి చనిపోయిట్టు నిర్దారించారు. రిటైర్డు జస్టీస్ విశ్వనాథం గారి మరణవార్త తెలిసి కాలనీ సీనియర్ సిటిజన్ సబ్యులు ఉదయపు నడక ఆపి అందరూ గుమిగూడి వచ్చి విషాద వదనాలతో ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మౌన ప్రార్దన చేసారు. మానవ జీవిత నౌక ప్రయాణంలో ఎటువంటి వారి కైనా బాల్యం , యవ్వనం ఎలా గడిచినా వార్ధక్యంలో ఆర్థిక , మానసిక ,శారీరక రుగ్మతలతో చరమాంకం ముగుస్తుంది. వంట్లో ఊపిరి ఉన్నంత వరకు సమాజానికీ , పది మందికి ఉపయోగపడే పనులు తలపెడితే మానవజన్మ సార్దకమవుతుంది.

మరిన్ని కథలు

Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి
Pramod Pesarattu
ప్రమోద్-పెసరట్టు
- వీరేశ్వర రావు మూల