అంతరాత్మ - పోడూరి వెంకటరమణ శర్మ

amtaratma

సాయంత్రం నాలుగింటికే యూనివర్సిటీ నుంచి ఇంటికి వచ్చిన ఆనంద్ తో భార్య రజని " రివర్ వాక్ మాల్ దాకా వెళ్లి వద్దాం, ఓపిక ఉందా ? " అంది బట్టలు మార్చుకోబోతున్న ఆనంద్ " సరే పద" అన్నాడు. ఆమెతో బయటికి నడిచి ఎప్పటిలా గే వీధులు నిర్మానుష్యంగా ఉన్నాయి. పెద్ద పెద్ద చెట్ల నీడలో మెల్లిగా నడుస్తూ " కాంట్రాక్టు రెన్యూవల్ కి వచ్చింది. ఈమాటు రెన్యూవల్ అడగకుండా ఇండియా వెళ్ళిపోదాం" అన్నాడు భార్యతో "

" అలాగే మీ ఇష్టం " అని ఆమె పైకి మామూలుగా అన్నా లోపల మనసు ఆనందంతో ఉరకలేసింది. కూతురుకు దగ్గరగా ఉండబోతున్నందు కు. ఆనంద్ గత పదిహేను సంవత్సరాలకి పైగా బోట్స్వానా యూనివర్సిటిలో పని చేస్తున్నాడు. చేరడం రీడర్ గా చేరినా త్వరలోనే ప్రొఫెసర్ గ ప్రమోషన్ ఇచ్చారు. ఒక్కగా నొక్క కూతురు జలజ ని, ఇండియా లో మెడిసిన్ లో చేర్చే దాకా తమ దగ్గరే ఉంచుకున్నారు. ఇండియా లో మెడిసిన్ లో సీటు వచ్చిన తరువాత అతని చెల్లెలు వనజ దగ్గర పెట్టారు కూతుర్ని. మంచి జీతాలు కాబట్టి, బాగానే పొదుపు చేసుకుని ఇండియా లో రియల్ ఎస్టేట్ లో పెట్టి చాల వృద్ధి చేసుకున్నాడు. వాటన్నిటి లోను అతని క్లాస్ మేట్ నారాయణ సహాయం చేశాడు. నారాయణ అతనికి చిన్నప్పటి నుంచీ క్లాస్ మేట్ . సెలవు మీద ఇండియా వెళ్ళినప్పుడల్లా, నారాయణ ని కలవడం, మిగతా స్నేహితుల గురించి మాట్లాడుకోవడం తప్ప, మిగతా వాళ్ళని ఎవరినీ కలవడం జరగ లేదు.

********

అనుకున్నట్టు గానే ఇండియా వచ్చేసి మిత్రుడి సహాయంతో సెటిల్ అయి, ఒక ప్రైవేట్ యూనివర్సిటీ లో డీన్ గా చేరాడు. ఆనంద్ , ఇండియా రాగానే, నారాయణ, అతనూ కలిసి శిరిడీ వెళ్లి వచ్చారు. తిరుగు ప్రయాణం లో పాత మిత్రులందరినీ తలుచుకున్నారు. అందరూ ఎక్కడున్నారో చెప్ప గలిగాడు కానీ, రామ కృష్ణ వివరాలే చెప్పలేకపోయాడు నారాయణ . డిగ్రీ పరీక్షలు అవగానే రామకృష్ణ , వాళ్ల చిన్నక్క భర్త, ఎదో ,ఉద్యోగం ఇప్పిస్తానంటే విజయవాడ వెళ్ళిపోయాడు. అంతే, తరవాత వివరాలు తెలియలేదు. మామూలుగానే వాడు మిత భాషి, ఎవరితోనూ ఎప్పుడూ కలిసే వాడు కాదు

బద్రుక లో బికాం చదివినప్పుడు కొద్ధి మంది దగ్గర స్నేహితులలో రామకృష్ణ ఒకడు. ఆనంద్ తండ్రి అతనికి పెద్దగా పాకెట్ మనీ ఇచ్చేవాడు కాదు కానీ, ఆనంద్ ఊళ్లోనే ఉన్న తల్లి వైపు తాత భద్రయ్య గారి దగ్గరనుండి కావలిసినంత తీసుకుని స్నేహితులతో గడుపుతూ, వాళ్ళకి కూడా బాగా ఖర్చు చేస్తూ ఉండేవాడు. భద్రయ్య గారికి మగ పిల్లలు లేకపోవడం వల్ల మనవడిని చాలా గారం చేసే వాడు. అప్పటి రోజులు గుర్తు చేసుకుని , ఆరోజులు మళ్ళీ రావు అనుకున్నారు మిత్రులు ఇద్దరూ.

షిరిడీ వెళ్లి వచ్చిన ఒక వారం తరవాత ఒక రోజు ఆనంద్ తన రూమ్ లో కూర్చుని మెయిల్స్ చూస్తున్నాడు. రజని వచ్చీ " ఎవరో ఒకావిడ వచ్చి మీ గురించి అడుగుతోంది " అంది రూమ్ లోకి వచ్చి

" ఎవరబ్బా ?" అంటూ డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చాడు. ఇంచుమించు రజని వయసు ఉన్న ఒకావిడ గుమ్మం దగ్గర నుంచుని ఉంది. మనిషి చాలా నీరసంగా ఉండి, నలిగిన చీర అదీ చూస్తే చాలా బీద మనిషి అనిపించింది

" ఆనంద్ గారా ? " అని అడిగిందావిడ

" అవునమ్మా , రండి లోపలికి రండి అన్నాడు కుర్చీ చూపించి కూర్చోమంటూ

" నేను రామకృష్ణ గారి భార్య నండి" అంది ఆవిడ

" రామకృష్ణా ? ఏ రామకృష్ణ అన్నాడు అర్థం కాక

" మీ క్లాస్మేట్ చెరుకూరి రామకృష్ణ అండి, మీరు ఆయన చదువుకున్నారు ట కదా?

ఓ మీరు రామకృష్ణ భార్యనా ? సారీ అండీ. వాడి పెళ్లి కి నేను రాలేదు కదా? మిమ్మలిని నేను ఎప్పుడూ చూడ లేదు . అందుకే గుర్తు పట్టలేదు. మీరు ఒక్కరూ వచ్చారేమిటి. వాడు రాలేదా? " అన్నీ ఒక్క మాటే అడిగాడు పక్కనే నుంచుని వింటున్న రజని కేసి ఆమె ఒక మాటు చూసి సందేహిస్తోంటే

" కొంచం కాఫీ తెస్తావా ? అని రజని కేసిచూసి అన్నాడు " ఆనంద్ . ఆమె గ్రహిచి లోపలికి వెళ్ళగానే "చెప్పండమ్మా" అన్నాడు ఆమె ఎదో చెప్ప బోయి దుఃఖంతో మాటలు రాక చీర కొంగు నోట్లో కుక్కుకుంది. కొంచం తమాయించుకుని. "కొద్దిగా డబ్బు సహాయం కావాలండి. ఇంటి అద్దె చాలా కాలం బకాయి పడిందండి. అది వెంఠనే కట్టాలండి ఆయన ఇంట్లోనే ఉన్నారు . మీరు ఒక్క మాటు ఇంటికి వస్తారా?" అంది. అడగచ్చో, అడగ కూడదో ఆమెకి తెలియలేదు కానీ ఇంటి పరిస్థితి తలుచుకుని సందేహించ లేదు. రజని తెచ్చిన కాఫీ అందుకుని ఆవిడకి కూడా కాఫీ ఇస్తున్నరజని తో చెప్పా డు. " మా రామకృష్ణ భార్య. మేమూ వాడూ. డిగ్రీ చదువు దాకా క్లాస్ మేట్స్ మి . డిగ్రీ అవగానే విజయ వాడ వెళ్లి పోయాడు," అని పరిచయం చేశాడు

ఇప్పుడే వస్తానండి అని లోపలికి వెడుతూ భార్యకి కూడా సౌంజ్ఞ చేశాడు రమ్మని. లోపలికి వెళ్లి ఇంట్లో ఎంత క్యాష్ ఉందొ అంతా తెచ్చి ఇమ్మని, తన పర్సు కూడా తీసుకుని బయటికి వచ్చాడు ఆవిడని రమ్మని, కారు ఎక్కించుకుని బయలు దేరాడు. వాళ్ళు ఉండేది సీతాఫల్ మండి అని చెబితే, మారేడ్ పల్లి నుంచి అక్కడికి బయలుదేరారు దారిలో అడిగాడు. "వాడు రాలేదేమిటి ? మీరు వచ్చారేమిటి ? నా అడ్రసు ఎవరిచ్చారు ?"

ఆయన వచ్చే లా లేరు. ఎందుకో తరవాత చెబుతాను. మీ గురించి తెలియడం చాలా విచిత్రం గా జరిగిందండి. మా ఇంటి పక్కన దామోదర్ గారని చాలా కాలం నుంచి మెడికల్ షాపు నడుపుతున్నారు. వారి బంధువుల ఇంట్లోనే మేము అద్దెకి ఉంటున్నాము. ఆయన మీ తాత గారింటికి తీసుకువెళ్లి మందులు ఇస్తూ ఇండేవారట. అప్పుడు మిమ్మలిని అక్కడ చాలా మాట్లు చూశారట. మొన్నీ మధ్యనే మిమ్మలిని కళ్యాణి నర్సింగ్ హోమ్ దగ్గరగా ఒకటి రెండు మాట్లు చూశారట. కానీ ఖచ్చితం గా అడ్రసు చెప్పలేకపోయారు"

" మరి ఎలా కనుక్కున్నారు ? " అడిగాడు ఆనంద్

" ఇది మూడో సారి రావడం, దగ్గరలో ఉన్న మెడికల్ షాపులలోనూ, కిరాణా షాపులలోనూ అడిగాను. ఈవాళ సెల్ ఫోన్ల షాపు లో మీకు పా లు పొసే వ్యక్తి ఈ ఫోటో చూసి చెప్పాడు" అని ఒక చిన్న ఫోటో చూపించింది అది చూడ గానే అతనికి గుర్తుకు వచ్చింది. " ఓ ఇదా! బి కామ్ పరీక్షలు ఆఖరు రోజున, అందరం ఫోటోలు దిగుతున్నప్పుడు, నాకూ, వీడికీ నారాయణ తీశాడు" అన్నాడు ఫోటో తిరిగి ఇస్తూ ఆవిడ చెప్పిన డైరెక్షన్స్ ప్రకారం, సీతా ఫల్ మండీ లో ఆనంద్ తాత గారి ఇంటికి వెనక వీధిలో, ఒక చిన్న సందులో కి వెళ్ళ వెలిసి వచ్చింది . సందులోకి కారు కష్టం అనిపించి, పెద్ద వీధిలో కారు ఆపుకుని అక్కడినుంచి నడిచి వెళ్లారు ఒక వసారా, ఒక గది తో చిన్న వాటా. వసారాలో ఒక పక్కగా మంచం మీద పడుకుని ఉన్న వ్యక్తిని మొదట ఆనంద్ గుర్తు పట్టలేదు. మనిషి నీరసంగా పడుకుని ఉన్నాడు. ఆ స్థితి లో ఆనంద్ ని చూసి ఆనంద్ మనసు వికల మయిపోయింది పక్కనే ఉన్న ఒక స్టూల్ లాక్కుని దగ్గరగా కూర్చున్నాడు

" పిల్లలు ఏమీ తిన లేదురా " అన్నాడు ఒక మూలగా కూర్చున్న పదిహేను ఏళ్ళు ఉన్న కొడుకునీ, ఎనిమిదేళ్లు ఉన్న కూతురికేసి చూసి. సుజాత చెప్పలేదా? అన్నాడు భార్యకేసి చూసి. పరిస్థితులు మామూలు విషయాలు మాట్లాడే లా లేవని గ్రహించాడు ఆనంద్ . వెంఠనే లేచి "పిల్లలికి వంట చేయలేదా అండీ" అన్నాడు ఆమెతో "ప్రొద్దుట నేను పనిచేసే వాళ్ళ ఇంట్లోంచి ఇడ్లీలు తెచ్చి పెట్టానండి" అంది సుజాత తల వంచుకుని.

" నేను తరవాత వచ్చి మాట్లాడుతాను రా " అని లేచి పిల్లలిని, సుజాతని "మీరు నాతో రండి" అని చెప్పి బయటకి తీసు కెళ్ళాడు దగ్గరలో ఉన్న హోటల్ లో పిల్లలికి ఆవిడకి ముందు భోజనం ఆర్డర్ చేశాడు . ఆవిడ తనకి వద్దంది. ఆనంద్ ఊరుకోలేదు. ఆవిడకి కూడా చెప్పి

" నేను ఇప్పుడే వస్తాను" అని చెప్పి బయటికి వచ్చి దగ్గరలో ఉన్న గ్రోసరీ షాప్ లోకి వెళ్ళాడు. బియ్యంతో సహా, నలుగురికి నెల కి సరిపడా సామానులు అన్నీ పేక్ చేసి రెడీ చేసి ఉంచమని చెప్పి, అడ్రసు ఇస్తాను అక్కడికి పంపాలని డబ్బు కట్టి, మళ్ళీ హోటల్ కి వచ్చాడు భోజనాలు పూర్తి చేసిన, సుజాత, పిల్లలిని తీసుకు వెడుతూ, సుజాతని గ్రోసరీ షాపు వాడికి ఇంటి అడ్రసు చెప్ప మన్నాడు. వాళ్ళ ఇల్లు తెలుసండి అని చెప్పి

" పాత బాకీ చాలా ఉందం డి" అన్నాడు నసుగుతూ. ఆనంద్ అతని దగ్గరగా వెళ్లి, మెల్లిగా ఆ బాకీ వాళ్ళని అడగవద్దని, ఇక ముందు నెలకి సరిపడా పంపుతూ ఉండమని చెప్పి వచ్చాడు. ఇంటికి వచ్చిన తరువాత, రామకృష్ణ కి ఏమీ తీసుకురాలేదని " వాడి భోజనం మాటేమిటి? అన్నాడు సుజాత తో.

" ఆయన జావ తప్ప ఏమీ తాగ లేకపోతున్నారండి. ప్రొద్దుట జావ ఇచ్చాను" అంది " రామకృష్ణ తో మాట్లాడే ముందు, మొత్తం జరిగినదంతా తెలుసుకోవడం ముఖ్య మనుకుని పిల్లలిద్దరినీ తండ్రి దగ్గర ఉండ మని చెప్పి, సుజాతని తన తో రమ్మన్నాడు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి మంటపం లో కూర్చుని, ఆవిడని కూడా కూర్చోమన్నాడు

" ఇప్పుడు చెప్పండి. డిగ్రీ తరవాత వాడు విజయవాడ వెళ్లిన తరువాత ఏమిజరిగిందో నాకు తెలియదు. మొత్తం చెప్పండి" అన్నాడు

" మా పెళ్లికి ముందునుంచీ ఆయన అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చే వారండి.ఆయన మానా]న్నగారి రెండవ భార్య తమ్ముడండి. డిగ్రీ అవగానే నాన్నగారు ఒక కాంట్రాక్టర్ వద్ద పని ఇప్పించారు. అక్కడ చేరిన ఆరునెలలలకే మా పెళ్లి అయ్యిందండి. పెళ్ళికి ముందు మాఇంటికి అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఎప్పుడూ లేనిది, పెళ్లి అయిన తరువాత ఆయనకి తాగడం అలవాటయింది అని గమనించానండి. డిగ్రీ అయిన తరువాత ఉద్యోగం కోసం వచ్చినప్పటి నుండీ ఉండి ఉండాలి. పెళ్లి అయిన కొద్దీ రోజులకే నాకు తెలిసిందండి. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత నాన్నగారు, పిన్ని కొద్దిరోజుల తేడాతో పోవడం తో మా కష్టాలు ప్రారంభమయ్యాయి. నాన్నగారు పోయిన తరువాత, ఆ కాంట్రాక్టర్ ఉద్యోగం నుంచి తీసేస్తే, షాపులలో అకౌంట్స్ రాయడం చేసే వారు. కానీ సగం పైగా ఆయన తాగుడుకె అయిపోయేది. నేను రెండు ఇళ్లల్లో వంట పని చేసి కాలక్షేపం చేసేవాళ్ళం.అప్పట్లో వాళ్ళ అన్నగారు, ఉమ్మడి ఆస్తి కొద్దిగా ఉంటె అది అమ్మి, ఈయన వాటాకి వచ్చింది పంపించారు. అది కొన్నాళ్ళు నడిపింది. పిల్లలు ఎదిగిన కొద్దీ, ఖర్చులు పెరిగి, తెలిసిన వాళ్లు అందరి దగ్గరా అప్పులు చేయడం మొదలు పెట్టారు, ఆ తరవాత, అటు వైపు, ఇటువైపు బంధువులు ఇక ఇవ్వడం మానేసిన తరవాత, పరిస్థితి ఇంకా దిగజారింది. వాళ్ళ అన్నగారు కూడా ఆయన పరిస్థితి బాగోలేక ఏమీ చేయలేకపోయారు

నేను వంట చేసే వాళ్ళ చుట్టాలకి ఇక్కడ వంట మనిషి కావాలంటే, ఎక్కువ జీతం ఇస్తారంటే రెండేళ్ల క్రితం ఇక్కడికి వచ్చేశాము. ఇక్కడ కూడా కోటీ లో షాపుల లో పద్దులు రాయడం ప్రారంభించారు. ఎలాగో బాగానే నెట్టుకు వస్తున్నా అయన తాగుడు మానక పోవడంతో పరిస్థితి మెరుగు అవ లేదు. ఈ లోగా ఆయన ఆరోగ్యం బాగా క్షీణించి పనికి వెళ్లడం తగ్గిపోవడంతో, అద్దె కట్ట లేకపోవడం, ఇంట్లో కనీస ఖర్చులకి కూడా కష్ట మయింది.

" ఇక్కడ నారాయణ ఉన్నాడు, ఇంకా స్నేహితులున్నారు. వాళ్ళని ఎవరినయినా, ఎంక్వయిరీ చేసి ఎందుకు కాంటాక్ట్ చేయలేదు?" అడిగాడు ఆనంద్

" నేను అదేచెప్పాను ,. స్నేహితులదగ్గర కి సహాయం కోసం వెళ్ళడానికి ఎందుకో ఆయన అసలు ఇష్టం చూప లేదండి. చాలా మాట్లు దామోదర్ గారు ఇంటి అద్దెకి వచ్చినప్పుడు చెప్పే వారు. వాళ్ళ చుట్టాలదే ఈ ఇల్లు. వాళ్ళకి దామోదర్ గారు అద్దె వసూలు చేసి పంపేవారు. ఆయన ఒక మాటు వచ్చినప్పుడు మీ ఫోటో చూసి ఆయన బలవంతం చేస్తేనే, పిల్లలు ఆకలి చూడలేక, ఒప్పుకున్నారు. బయటికి వెళ్లి తాగడానికి, ఓపిక, డబ్బులూ కూడా లేక పోవడంతో ఇంట్లోనే ఉండి పోయారు. వారం నుంచి విపరీత మయిన నొప్పి తో బాధ పడడం చూడ లేక, మీ అడ్రసు కోసం ప్రయత్నం ప్రారంభించానండి. వాళ్ళ చుట్టాలు అద్దె కోసం పట్టు బడుతోంటే, దామోదర్ గారు కూడా ఏమీ చెప్పలేని స్థితి లో పడి, మిమ్మలిని కలవమని సలహా ఇచ్చారండి. ఆయన కోలుకున్న తరువాత, వెంఠనే కాక పోయినా, మీకు మెల్లిగా తీర్చుకుంటాము. కొంచం సహాయం చేయండి" అంది సుజాత కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ ఆనంద్ కు కూడా దుఃఖం ముంచుకు వచ్చింది. అయినా తమాయించుకుని " మీరు నన్ను వెదుక్కుంటూ రావడం చాలా మంచిది అయ్యింది. మీరు ఆందోళన పడకండి, నేను,రేపు పొద్దున్నే వచ్చి వాడిని డాక్టర్ దగ్గరికి తీసుకు వెడతాను. ఈ డబ్బు మీదగ్గర ఉంచండి, అని తాను తెచ్చిన డబ్బు ఆవిడ చేతిలో పెట్టి లేచాడు"

ఇద్దరూ మళ్ళీ ఇంటికి వచ్చారు. ఆనంద్, రామకృష్ణ దగ్గరగా కూర్చుని, " నువ్వు పెద్దగా ఆందోళన పడకురా, రేపు డాక్టర్ దగ్గరికి వెడదాము. నువ్వు కోలుకున్న తరువాత ఎక్కడేనా ఉద్యోగంలో చేరుస్తాలే " అన్నాడు.

రామకృష్ణ ఎదో అడగబోయి, భార్య కేసి చూశాడు. ఆమె గ్రహించి " మీరు తాగడం ఆపక పోతే, పిల్లలికి తల్లి ఉండదు," అంది అతని అబ్యర్ధన గ్రహించి "మళ్ళీ వస్తాను రా " అని చెప్పి వచ్చేశాడు ఆనంద్

***

ఆనంద్ ఇంటికి రాగానే, తన రూమ్ లోకి వెళ్లి మంచం మీద పడుకున్నాడు. నిద్ర పోతున్నాడేమో అనుకుంది రజని . కానీ పది నిముషాలకే డ్రాయింగ్ రూమ్ లోకి వచ్చి సోఫా లో ఎదో ఆలోచిస్తూ కూర్చున్నాడు అతను సీరియస్ గా ఉండడం చూసి, మాట్లాడకుండా దగ్గరికి వచ్చి కూర్చుంది. నారాయణ తప్ప అతని మిత్రులు మిగతా వాళ్ళు పెద్ద తెలియదు ఆమెకి. ఈ రామకృష్ణ ఎవరో ఎపుడూ చెప్పలేదు ఆనంద్ ఆమెకి.

" ఏమిటి ఎమన్నా సమస్యలా మీ స్నేహితుడికి " అంది .

మేము ముగ్గురం క్లాసులో కలిసి ఉండేవాళ్ళం . రామకృష్ణ మాత్రం ఎప్పుడూ ఎవరితో కలిసే వాడు కాదు. చదువు లో కూడా కొంచం వెనకే. కానీ ఎప్పుడూ మమ్మలిని వదిలి ఉండే వాడు కాదు. మేము అల్లరి చిల్లరి గా ఉన్నా వాడు చాలా బుద్ధి గా ఉండేవాడు. ఇవాళ చాలా కష్టం లో ఉన్నాడు" అన్నాడు ఎదో ఆలోచిస్తూ

" మీకు బోట్స్వానా లో అలవాటే కదా? ఎతోకొంత సహాయం చేయండి" అంది ఆమె. బోట్స్వానా లో చాలా మంది లోకల్ కొలీగ్స్ జీతం మొదటి వారం లోనే ఖర్చు చేసి, రెండో వారం నుంచీ తిండికి చేబదుళ్లు అడుగుతూ ఉండేవారు. వాళ్లకి సహాయం చేయడం అలవాటే అతనికి , ఇచ్చిన వాళ్ళు తిరిగి ఇవ్వడం , లేని వాళ్ళు లేనిదిగా ఉండేది. అంత జాలిగా ఉంటె కష్టమేమో అనేది చాలా మాట్లు.

*****

ఆనంద్ నారాయణ కి ఫోన్ చేశాడు . వంట ఇంట్లో రజని కి వినపడే లేదు కానీ, నారాయణ తో చాలా సేపు మాట్లాడడం ఆమె గమనించింది. తాగుడు, హాస్పిటల్ లాంటి కొన్ని మాటలు వినపడ్డాయి. మర్నాడు వెళ్లి రామకృష్ణని డాక్టర్ దగ్గరికి తీసుకువెడదామని నిర్ణయించుకున్నారు నారాయణ, ఆనంద్. అనుకున్నట్టు గానే స్నేహితులు ఇద్దరూ రామకృష్ణని కళ్యాణి నర్సింగ్ హోమ్ లో చేర్చి టెస్టులు చేయించారు. రిపోర్టులు ఆధారంగా డాక్టర్లు విషయం చెప్పే టైముకి, సుజాత కూడా వచ్చింది. ఆమె కి సాయంగా ఉంటుందని రజని ని కూడా రమ్మన్నాడు ఆనంద్ తాగుడు వల్ల లివర్ దెబ్బతిందనీ, సిర్రోసిస్ ముదిరితే రివర్స్ కష్టమని, ఇంక తాగకుండా ఉంటె, కొంత వైద్యం చేసి నయం చేయవచ్చనీ, కొన్ని ఇంప్లాంట్స్ వేయ వలిసి ఉంటుందనీ చెప్పారు. ఆపరేషన్ కి అన్నిటికీ ముందు పది లక్షలు కట్ట మన్నారు. మళ్ళీ మందు ముట్టుకుంటే, ఇంక మరణం తధ్యం అని కూడా చెప్పారు రామకృష్ణకి

****

రామకృష్ణ ఆసుపత్రి నుంచి బయటికి వచ్చేటప్పటికి పది హేను లక్షలు పైనే అయింది. నారాయణ సహాయం తో, తమ ఇంటికి దగ్గరగా ఒక చిన్న ఇల్లు చూసి మార్చడం, పిల్లలిని దగ్గరలోనే స్కూల్ లో చేర్చడం, రామకృష్ణ కి తాను పని చేసే యూనివర్సిటీ లో అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్ లో చేర్చడం అన్నీ ఒక దాని తరువాత ఒకటి త్వరగానే అయిపోయాయి.

ఇవన్నీ గమిస్తున్న రజని కి, మొత్తం వ్యవహారం లో ఆనంద్ ప్రవర్తన పెద్ద ప్రశ్న మార్కు అయి కూర్చుంది. ఇతరుల కష్టాలకి సానుభూతి గా స్పందించడం అతనికి అలవాటే అయినా, ఒక స్థాయి మించి అతను ఖర్చు చేసే వాడు కాదు. అతను తనకి తాను గా చేసే స్థాయికి మించి ఎప్పుడయినా ఖర్చు చేయవలిసి వస్తే అతను చాలా చిరాకు పడే వాడు. జానకి చెల్లెలి, భర్త ఒక మాటు ఎవరిచేతిలోనో మోస పోయి అత్యవసరం గా డబ్బు కట్టవల్సి వస్తే, మరదలు సరితమీద, ఒక స్థాయి సహాయం తరవాత, చాలా చిరాకు పడ్డాడు. అటువంటిది రామకృష్ణ విషయం లో హద్దులు లేకుండా, ఏ మాత్రం సంకోచం లేకుండా ఖర్చు చేయడం కాకుండా, మొత్తం కుటుంబం భారం, పిల్లల చదువు అన్నీ మీద వేసుకోవడం, ఆమెకి కొన్ని నెలలు జవాబు లేని ప్రశ్న గానే మిగిలి పోయాయి.

రామకృష్ణ జీవితం ఒక గాడి లో పడే దాకా ఆనంద్ ప్రదర్శిస్తున్న అసహనాన్ని రజని గమనిస్తూనే ఉంది

***

వారానికి ఒక్క మాటయినా నారాయణ ఆనంద్ ఇంటికి వస్తూ ఉండడం, వాళ్ళు ఇద్దరూ రియల్ ఎస్టేట్ వ్యవహారాలూ మాట్లాడుకోవడం జరుగుతూనే ఉండేది ఒక మాటు నారాయణ వచ్చినప్పుడు ఆనంద్ లేడు . ఎవరో విజిటింగ్ ప్రొఫెసర్ ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాడు. నారాయణ కి కాఫీ ఇచ్చి ఆవిషయం ఈ విషయం మాట్లాడుతూ కూర్చుంది. మాటలు సందర్భంలో . రామకృష్ణ విషయం కూడా వచ్చింది. అప్పుడు రజని తన మనసులో మాట పైకి అంది నారాయణతో " ఎందుకు రామకృష్ణ విషయం లో అంత శ్రద్ధ వహించాడు. మామూలుగా అయితే ఎదో కొంత ఆర్ధిక సహాయం చేసి ఊరుకుంటారు కదా అందరూ ! " అడిగింది నారాయణ ని " ఆనంద్ మీకు చెప్పా లేదా? " అన్నాడు ఆశ్చర్యంగా నారాయణ "క్లాస్ మేట్ అని తెలుసు అంతే " ఇంకా ఏముంది అన్నట్టు రామకృష్ణ దిగజారిపోవడానికి కారణం తానే అని ఆనంద్ అనుకోవడం వల్ల ఇదంతా చేశాడు. మామూలుగా ఏ స్నేహితుడికయినా చేసే వాడేమో. కానీ రామకృష్ణ విషయం లో పూర్తి బాధ్యత తీసుకోవడానికి ఒక కారణం ఉంది. మేము బికాం చదివేటప్పుడు నలుగురు, అయిదుగురం కలిసి తిరిగేవాళ్ళం. అందరం కలిసి సిగరెట్లు కాల్చడం, మందు తాగడం జరిగేది.

మా అందరికీ లీడర్ ఆనందే. వాళ్ళ తాత గారి దగ్గర నుండి డబ్బు తెచ్చి వాటికి ఖర్చు చేస్తూ ఉండేవాడు. కానీ రామ కృష్ణ వాళ్ళ నాన్న వేదం చదువుకున్నారు. అతను చాలా బుద్ధిగా ఉండి. మాతో కలిసి తిరిగినా ఎప్పుడూ సిగరెట్ కానీ, మందు కానీ ముట్టుకోలేదు ఫైనల్ ఇయర్ అయిపోతోంది అనగా ఆనంద్ ఒక పార్టీ ఇచ్చాడు. ఎప్పటి లాగే రామకృష్ణ కూడా వచ్చాడు, అతను ఎప్పుడూ స్నాక్స్ తీసుకుని, కూల్ డ్రింక్ మాత్రమే తాగేవాడు. పార్టీ మొదలయిన తరువాత, ఆనంద్ కొంచం తాగిన తరివాత రెచ్చి పోయాడు. " ఇవాళ రామ కృష్ణ గాడి చేత తాగించాలి రా " అని మొదలు పెట్టి, ఆవేళ రామకృష్ణ తాగేదాకా వదల లేదు. బహుశా వాడు ఇన్నాళ్లూ అంత బుద్ధి గా ఉండడం, కంపేర్ చేస్కుని లోపల లోపల ఏమయినా ఫీల్ అవుతున్నాడేమో తెలియదు.

ఆ వేళ మాత్రం వాడి చేత వ్రత భంగం చేసే దాకా వీడు ఊరుకోలేదు. ఆ తరవాత విడిపోయేముందు ఒకటి రెండు పార్టీలు మాత్రమే అయ్యాయనుకుంటా. వాటిలో. బలవంతం లేకుండానే రామకృష్ణ పాల్గోవడం మాకు ఆశ్చర్యమేసింది. పరీక్షలు అయిపోగానే వాడు వాళ్ళ బావ గారి దగ్గరికి వెళ్లి పోయాడు. వాడి తల్లీ, తండ్రీ ఎక్కడో నార్త్ లో ఉన్నవాడి అన్నగారిదగ్గరికి వెళ్లిపోయారు ఆ తరవాత ఇదిగో మళ్ళీ ఈ మధ్యనే కలవడం, మాకెవరికీ అంతగా వ్యసనం కాని తాగుడుకు రామకృష్ణ బలి అయి పోయాడు. అందులోంచి బయటికి రాలేక వాడు జీవితాన్ని ధ్వంసం చేసుకున్నాడు. ఆ వేళ ఆనంద్, ఎదో ఛాలెంజింగ్ గా , స్నేహితుల ముందు ప్రదర్శన కోసం, వాడి చేత తాగించకుండా ఉంటె, వాడు ఈ స్థితి కి వచ్చేవాడు కాదని ఆనంద్ అనుకున్నాడు. మొదటిసారి రామకృష్ణ ఇంటినుంచి మీ ఇంటికి తిరిగి వచ్చిన రోజే, మీ ఇంట్లోంచి నాకు కాల్ చేసి అదే చెప్పాడు. " సుదీర్ఘ వివరణ ఇచ్చాడు నారాయణ

"ఓహో అదా సంగతి" అనుకుంది రజని. తన తప్పిదాన్ని గుర్తించి, మిత్రుడి జీవితం మళ్ళీ గాడిలో పదేసినందుకు, మనసు లోనే మెచ్చుకుంది.

మరిన్ని కథలు

Abhimanam khareedu
అభిమానం ఖరీదు
- మద్దూరి నరసింహమూర్తి,
Nirvika
నిర్విక
- బొబ్బు హేమావతి
Anji marindoch
అంజి...మారిందొచ్
- కాశీ విశ్వనాథం పట్రాయుడు
Moodu vupayalu
మూడు ఉపాయాలు
- డా.దార్ల బుజ్జిబాబు
Ayyo sankaram mastaaru
అయ్యో! శంకరం మాస్టారు
- తటవర్తి భద్రిరాజు (949 3388 940)
Second hand
సెకండ్ హ్యాండ్
- బొబ్బు హేమావతి
Emi jariginaa antaa manchike
‘ ఏమి జరిగినా అంతా మంచికే ’
- మద్దూరి నరసింహమూర్తి