జాతీయ అవార్డులకొచ్చేసరికి తెలుగు సినిమాకి అన్యాయం జరుగుతూనే ఉంది. దక్షిణాది చిత్రాల పట్ల చిన్న చూపు చూస్తున్న జాతీయ అవార్డుల జ్యూరీ, అందులో తెలుగు సినిమాని ఇంకా చిన్న చూపు చూస్తూ ఉండడం పట్ల తెలుగు సినీ పరిశ్రమ వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. మంచు లక్ష్మి, నరేష్, కృష్ణుడు ప్రధాన పాత్రల్లో, ప్రవీణ్ సత్తా నిర్మించిన ‘చందమామ కథలు’ సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరీలో జాతీయ పురస్కారానికి ఎంపిక అవడం తెలుగు సినిమాకి కొంచెం ఊరట మాత్రమే. పాటల విభాగంలోగానీ, దర్శకత్వం, నిర్మాణం, నటన విభాగాలలోగానీ తెలుగు సినిమాకి జాతీయ అవార్డులు రాకపోవడం విస్మయం గొలుపుతోంది, ఆవేదన రగిలిస్తోంది.
హిందీ తర్వాత అంతటి స్థాయిలో కమర్షియల్ స్టామినా ఉన్న తెలుగు సినిమా పరిశ్రమలో కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా, కంటెంట్ ఉన్న సినిమాలూ తక్కువ సంఖ్యలోనే అయినా వస్తున్నాయి. వాటిని నేషనల్ అవార్డుల జ్యూరీ పరిగణనలోకి తీసుకోకపోవడం సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడికి బాధ కలిగించే అంశం. జాతీయ అవార్డు అంటే తెలుగు సినిమాకి సంబంధం లేనిదేమో అనే భావన పెరిగిపోతుండడంతో నేషనల్ జ్యూరీ ఇకనైనా తెలుగు సినిమాని దృష్టిలో పెట్టుకోవాలి.
|