మా ఊరిని ఆనుకొనే ఉంది ప్రళయకావేరి. సుమారు ముఫ్ఫై మైళ్ళ పొడవు. పది మైళ్ళ వెడల్పు ఉన్న సరస్సు అది. ప్రళయ కావేట్లో నలభై వరకూ దీవులున్నాయి. వాటికి రకరకాల పేర్లు. వాటిల్లో కొన్ని దీవుల్లో మాకు చుట్టాలున్నారు. ఆ దీవుల్లో ఒకటి 'జల్లల దొరవు.' విసిరేసినట్లు ఒక మూలగా ప్రళయకావేరి ఒడిలో ఒదిగి వుండేది. ఆ దీవిలో నాకు వరసకు మామ ఒకాయన ఉండేవాడు. వాళ్ళింటికీ మా ఇంటికీ రాకపోకలు ఉండేవి. నేను కూడా అప్పుడప్పుడూ అక్కడకు పోతుండేవాడిని.
జల్లల దొరువు ప్రయాణమంటే చిన్న విషయం కాదు. తెల్లవారి అయిదు గంటలకు మొదలుపెడితే రాత్రి ఏడుకో, ఎనిమిదికో ఆ దీవికి చేరేవాళ్ళం. అంటే ఒక పగలంతా ప్రయాణమే... కాసేపు నీళ్ళల్లో నడిచి... ఒక దీవి నుంచి ఇంకో దీవిని దాటి... చేరుకోవాలి. ఇంతా చేసి మా ఊరికీ, జల్లలదొరువుకీ నడుమ దూరం పాతిక కిలోమీటర్ల లోపే.
ప్రళయకావేర్లో ప్రయాణం ఒక వింత అనుభూతి. నడిచి నడిచి కాళ్ళు పీకుతున్నా, ఇంకా నడవాలనే మనసు పీకుతుంది. ఎండా, వానా, మంచు... ఇవన్నీ కాలానికి అనుగుణంగా సరస్సులో ఎరగనన్ని వన్నెలు చూపించేవి. మా ప్రయాణం ముచ్చట్లు మొదలుపెడితే మీకూ తెలుస్తాయి ఆ వన్నెచిన్నెలు.
ఒకసారి నేనూ, మా వెంకటన్న, నా నేస్తాలు శీనయ్య, చెంగయ్య నలుగురం ప్రయాణం కట్టినాము ప్రళయకావేరిలో. శీనయ్య, చెంగయ్యలు 'రాగన్నపట్టెడ' కు, నేనూ, మా అన్న జల్లలదొరువుకు. అప్పుడు నా వయస్సు పన్నెండో, పదమూడో ఉండొచ్చు. అప్పటికి ఉత్తరకార్తె పెట్టి రెండు దినాలయింది. ఆ ఏడాది మఖ, పుబ్బల్లోనే గట్టి వానలు పడినాయి. అందుకే మా అమ్మకూ, మా అవ్వకూ మా ప్రయాణమంటే దిగులు.
"దార్లో వానొస్తే 'రాగన్నపట్టెడ' లోనే నిలిచిపొండి. ఉత్తరపొద్దులో కావేట్లో దిగబాకండి," మా అమ్మ హెచ్చరించింది.
"ఉత్తరపొద్దంటే వాళ్ళకేం తెలుస్తాదమ్మే!" అని మాయమ్మని ఒక్క కసురు కసిరింది మా అవ్వ.
మావైపు తిరిగి, "నాయినా! మద్దినేల మడకలిప్పే పొద్దులో పెళయకావేట్లో నడవబాకండ్రా," అనింది.
"పునమాల తిప్ప దాటినాక, చిన్నతోటకు పొయ్యేదాకా దిగులుతిప్ప లెక్కువ. చూసి నడవండి," మా పెద్దమ్మ సలహా ఇచ్చింది. 'దిగులుతిప్ప' అంటే ఒక రకమైన బురదగుంట. ఊబి కాదు. ఇందులోకి దిగితే నడుముల దాకా కూరుకుపోతాము.
"ఉత్తరపొద్దు బిడ్డల్ని ఏమారస్తాదేమో!" మా అమ్మ గొణగసాగింది.
ఆడవాళ్ళ సణుగుడంతా విన్న నా తాత లేచి, "మేయ్! గమ్మునుంటారా? లేదా? అయినా పంట రంగస్వామి లేడా, ఏదన్నా అయితే చూసుకొనేదానికి. పోయిరానీ వాళ్ళని," అన్నాడు.
మా వైపు చూసి, "అబయా, నలగామూల దాటినాక, పెళయకావేరమ్మకు సక్కల గిలెక్కువ. మునేళ్ళు అదిమిపెట్టి నడవండి. లేకపోతే గెబ్బిడు గెబ్బిడు ఎంట్రకాయల్ని జవరాల్సి పడతాది," అన్నాడు. అంటే నలగామూల దగ్గర జారుడు ఎక్కువ, జాగ్రత్తగా నడవకపోతే పడతామని చెప్పడం.
అప్పటికి మా పల్లెల్లో తమదల (రాగుల) వాడకం ఇంకా వుంది. చిక్కటి మజ్జిగ కలిపిన గట్టి అంబలిని స్టీలు టిఫిన్ లో పోసిచ్చినారు. అట్లే రెండు పులుసన్నం పొట్లాలు కట్టిచ్చినారు. తెల్లవారి ఆరుగంటలకు 'అటకానితిప్ప'కు పొయ్యే బస్సు ఎక్కి కూచున్నాము. బస్సు బయల్దేరి కసారెడ్డిపాలెం, చెరువుకండ్రిగ, దావాదిగుంటలు దాటి కుదిరికి వచ్చింది. కుదిరి వస్తే మా ఆనందం ఎక్కువవుతుంది. కుదిరి దాటగానే ప్రళయకావేరి మొదలవుతుంది. ఇక కనుచూపుమేరా నీలాలు ఆరబోసినట్లు నీళ్ళు.
అరగంట ప్రయాణించి అటకానితిప్పలో మమ్మల్నిదించింది బస్సు. ప్రళయ కావేరీలోని దీవులకు కేంద్రం అటకానితిప్ప దీవి. దీవులలో ఉండేవాళ్ళు కూడా పేటకు (మా ఊరికి) రావాలంటే అటకానితిప్పకు వచ్చే బస్సు ఎక్కాలి.
మూడునాళ్ళుగా ముసురుపట్టిన మబ్బుల చాటు నుంచి సూర్యుడు తొంగి తొంగి చూస్తున్నాడు. అటకానితిప్పలోని వినాయకుడి గుడి దగ్గరకు పోయి తెచ్చుకొన్న అంబలి లో కొంచెం తాగినాము.
"ఏ ఊరికి సిన్నా?" ఒక ముసలాయన అడిగినాడు.
"మేము జల్లలదొరువుకీ, వీళ్ళు రాగన్నపట్టెడకీ," ఇద్దరి తరపునా నేనే చెప్పినాను.
"జల్లల దొరువా! నాయినా దూరాబారం బొయ్యేవోల్లు బిన్నా బయల్దేరండి. తూరుపు గాలి మళ్ళింది. వానొస్తాదేమో! ఇప్పుడు పెళయకావేట్లో దిగితేగానీ సద్ది కూటేళ్ళకు 'కొరిడి' కి పోలేరు. ఉత్తరపొద్దుల్లో యాడ్నో ఒక దెగ్గిర నిలబడిపోండి," అన్నాడా ముసలాయన.
మేము ఆ మాటతో దెబగుబా ప్రళయకావేట్లో దిగినాము.
తూరుపు నుంచి, చల్లగాలీ లేత ఎండా కలిసి మమ్మల్ని గిలిగింతలు పెడుతున్నాయి. వానలు బాగా పడి సరస్సంతా నిండుగా వుంది. అడుగు మీగాళ్ళనూ, నీళ్ళు మోకాళ్ళనూ దాటుతున్నాయి. వలసపక్షులు కూడా కొంచెం ముందుగానే వచ్చినట్లుండాయి. ఉల్లంకి పిట్టలు వేలకు వేలు బార్లు కట్టి నిలబడి ఉన్నాయి. వాటి రెక్కల పసిమిచాయ, నీటి నీలివన్నె, ఎండ బంగరురంగు కలిసి ప్రళయకావేరి కొత్త హొయలు పోతోంది.
రెండు గంటలసేపు నీళ్ళల్లో కాళ్ళీడ్చుకుంటూ సాగిన మా నడక 'కొరిడి' దీవికి చేరి కుదుటపడింది. దీవంటే గట్టి నేల. కాలు చకచకా సాగుతుంది. అప్పటిదాకా గిలిగింతలు పెట్టిన సూర్యుడు, చుర్రుమనిపిస్తూ పైకి లేస్తున్నాడు. పేము పొదల దొరువులో కాళ్ళు కడుక్కొని, తియ్యని ఆ నీళ్ళు తాగి, నడక సాగించినాము.
కొరిడి దీవంతా చిట్టడవి. ఆ అడవిలోని పాలపండ్లు, కలిగిపండ్లు, బీరపండ్లు, బిక్కిపండ్లు, నిమ్మకాయలు, ఊటిపండ్లు, గొంజిపండ్లు, బలిజపండ్లు, ఎలికి చెవులూ, పిల్లొట్టలూ కోసుకొని తింటూ సాగుతున్నాం. అడివంతా చిన్నచిన్న రంగుల పిట్టలు. వింత వింతగా పలకరించుకొంటూ, కులుక్కుంటూ, గిలుక్కుంటూ చెట్టు చెట్టుకు చెంగున ఎగురుకొంటూ చెటాలున దోవ కడ్డంగా పరుగెడుతూ మమ్మల్ని పలుకరిస్తున్నాయి.
కొరిడి దాటిన తరువాత మళ్ళీ ప్రళయకావేరిలో గంటన్నర ప్రయాణం. తరువాత కొల్లపట్టు దీవి. కొల్లపట్టు నుంచి గంట ప్రయాణంలో తోటకట్ల. తోటకట్లకు చేరేసరికి మిట్టమద్దినేల అయింది. ఎండ కసిగా కొడుతోంది. గాలి ఎంత చల్లగా తగులుతున్నా, చెమట కారుతూనే ఉంది. తోటకట్ల తరువాత గంట నడిస్తే 'రాగన్న పట్టెడ' వస్తుంది.
మాతోపాటు తెచ్చుకున్న తిండి ఎప్పుడో అయిపొయింది. మధ్యాహ్నం ఒంటి గంటప్పుడు రాగాన్నపట్టెడకు చేరుకొన్నాం. మా నేస్తాల ఊరు అదే. మేమయితే సగం వచ్చినట్లు. మా నేస్తాల ఇళ్ళల్లో మమ్మల్ని చూసి చాలా సంతోషించినారు. చెంగయ్య వాళ్ళ అమ్మ ఆదరాబాదరాగా సంగటి గెలిగి, చెనిగపప్పుల ఊరిబిండి నూరి కడుపునిండా పెట్టింది.
"ఈ పొద్దు ఈడ్నే ఉండి రేపు బయలుదేరిపోండి నాయినా. ఉత్తరపొద్దు పెయానం మంచిది కాదు," అన్నారు వాళ్ళింట్లోని పెద్దలంతా.
ఎప్పుడెప్పుడు జల్లలదొరువు పోదామా అని ఆత్రుతతో ఉన్న మేము వారి మాటలను వినలేదు. నేనూ, మా అన్నా బయలుదేరినాము.
ప్రళయకావేట్లో మిట్టమద్దినేల ప్రయాణం కొంచెం కష్టమే. ఎండకు నీళ్ళు తళతళలాడుతూ కళ్ళను జిగేలు మనిపించి దారి తప్పేటట్లు చేస్తాయి. దారితప్పి మిట్టకు పోయినామా నీళ్ళ వేడికి కాళ్ళు బొబ్బలు లేస్తాయి. పల్లానికి పోయినామా ఏ దిగులు తిప్పో తగిలి నడుము లోతు అడుసులో కూరుకుపోతాము. దోవ పొడవునా అనుభవం ఉండే పెద్దలు అక్కడక్కడా కట్టెపుల్లలు నాటి ఉంటారు. వాటిని చూసుకుంటూ నడవాలి.
రాగన్నపట్టెడ తరువాత గంటన్నర నడకలో 'పంటరంగం' ఉంది. ఆ దీవిలో ఎవరూ కాపురం ఉండరు. పాతకాలం నాటి శివాలయం ఉంది అక్కడ. ప్రళయకావేరీ ప్రయాణీకులు ఆ శివాలయం దగ్గర విశ్రాంతి తీసుకొనిపోతుంటారు. త్వరగా పోవాలనుకునేవారు శివాలయానికి పోకుండానే మరో గంట ప్రయాణంలో వచ్చే 'చిన్నతోట' వైపు సాగిపోతారు. మేమూ అట్లాగే పోవాలనుకొన్నాం. కానీ మేమనుకొన్నట్లు జరుగలేదు.
రాగన్నపట్టెడ తరువాత అరగంట నడిచినామో లేదో తూరుపు నుంచి పశువుల పండక్కి పరుగెత్తే బర్రెల మందలాగా గుంపులు గుంపులుగా మెయిళ్ళు(మబ్బులు) బయలుదేరినాయి. మరుక్షణంలోనే నల్లగా మూసుకొనుంది. కంటికి మింటికి ఏకధారగా వాన మొదలయింది.
ఇక మేము చిన్నతోటకు పోయే ఆలోచన మానుకొని పంటరంగం చేరుకొనేందుకు త్వరత్వరగా నడవసాగినాము. ఎగువ నుంచి ప్రవాళం వాగో, కాళంగినదో పరుగెత్తికొచ్చి ప్రళయకావేట్లో పడినట్లుంది. ప్రళయకావేట్లో సుళ్ళు పుట్టినాయి. దోవ పక్కన నాటిన పుల్లలు కొట్టుకొని పోయినాయి. మాకు పంటరంగం దీవి కంటి కానడం లేదు.
మధ్యాహ్నం మూడు గంటలు కూడా అయి వుండదు. కానీ చీకట్లు ముసురుకొన్నాయి. మేము గుడ్డి గురుతులలో చాలా సేపు నడిచి, నడిచి చివరకు పంటరంగం చేరుకొన్నాము. ఆ దీవంతా పెద్దపెద్ద మానులతో చిక్కటి అడవి. వాటి మధ్యలోనే శివాలయం ఉంటుంది. ఆ గుడి దగ్గరకు పోతే, ఎవరో ఒకరు ప్రయాణీకులు వుంటారు. కానీ గుడి దగ్గరకు పోవడానికి కాలిబాట కూడా దొరకడం లేదు. చివరకు నీటి వరవను పట్టుకొని ఎదురు నడిచినాము. ఆ వానలోనే గంటకు పైగా ఆ దీవిలో నడిచినాము. శివాలయం జాడేలేదు. నాకు చలికి తోడు భయం కూడా మొదలై వణుకు ఎక్కువయింది. తిరిగి తిరిగి గుడి కనబడక ఒక మర్రిచెట్టు కింద నిలబడినాము.
చీకటి చిక్కబడుతోంది. ఏనుగు తొండంతో చల్లినట్లు వాన కురుస్తూనే వుంది. నేను భయంతో మా అన్నకు దగ్గరగా జరిగి నిలబడినాను. ఆయన పరిస్థితీ నాలాగే ఉన్నట్లుంది. నాకన్నా ఒక ఏడాది పెద్దవాడంతే. ఇద్దరమూ ఏమీ మాట్లాడుకోవడం లేదు. ఒకరికొకరం బాగా ఆనుకొని నిలబడినాము. ఇంతలో -
"ఎవడ్రా ఆడ, ఇయ్యాలప్పుడు ఈడకొచ్చింది?" అని కేక వినపడింది. మెరుపు ననుసరించే ఉరుములాగా, కేకతో పాటు మనిషీ మా ముందుకొచ్చినాడు. నల్లగా నిలువెత్తు మనిషి, తెల్లజుట్టు, ముడతలు పడిన మొహం. వయసుడిగినా కండలు తిరిగిన దేహం.
"మేము జల్లలదొరువుకు పోవాల తాతా! రాగన్నపట్టెడ దాటినాక వానొచ్చింది. పంటరంగం గుళ్ళో తల దాచుకొందామని వచ్చినాము. గుడి కనబడక ఈడ నిలబడినాం తాతా," మా అన్న అన్నాడు.
"ఓరి కొడకా! ఉత్తరపొద్దు ఏమార్చెను గదరా మిమ్మల్ని. పెద్దోళ్ళే ఉత్తరపొద్దులో పెళయకావేట్లో పెయాణం చెయ్యరు. ఏలిడంత లేరు మీరిద్దరూ. ఎట్ట దాటదామనుకున్నార్రా? సూడబోతే మిడిమాళపు బిడ్డలుగుండారే?" అన్నాడు ఆ తాత.
మాకేమీ అర్ధంకావడం లేదు. మళ్ళీ ఆ తాతే అడిగినాడు. "ఒరే! ఇప్పుడు మీరు యాడుండారో తెలుసా?" అని.
మేమిద్దరమూ అయోమయంలో పడి ఏమీ మాట్లాడలేదు.
"రాగన్నపట్టెడ నుంచి ఉత్తరానికి పోతే పంటరంగం. మీరు దోవ తప్పి తూరుపుకు నడిచి 'రెట్టమూల' కు వచ్చుండారు. ఇది నరమానవులు తిరిగే దీవి కాదు, తెలుసా మీకు?" తాత కంటం ఖంగుమనింది.
మా పై ప్రాణాలు పైనే పోయినట్లయింది. రెట్టమూల గురించి మా అవ్వా తాతలు అప్పుడప్పుడూ మాట్లాడుకొనే మాటలు గుర్తొచ్చినాయి.
'రెట్టమూల' కూడా ఒక దీవే. కానీ మనుషులెవరూ ఆ దీవికి పోరంట. కాలభైరవుడు ప్రేత గణాలతో ఆదీవిలో తిరుగుతూ ఉంటాడు. ఏడాది కొకసారి మాత్రం ఆ దీవిలో కాలభైరవుడి బొమ్మ దగ్గరకు చుట్టూ దీవుల్లో ఉండే వాళ్ళు పొయ్యి పొంగళ్ళు పెట్టి వస్తారంట. ఇవన్నీ గురుతొచ్చి నాకు ఏడుపొచ్చింది. గట్టిగానే ఏడవడం మొదలు పెట్టినాను. ఎంతసేపటి నుంచి అణుచుకొని ఉన్నాడో, మా అన్నా ఏడవడం మొదలుపెట్టినాడు.
"రేయ్! అబ్బయ్యల్లారా! ఏడవబాకండ్రా, నేనుండ్లా," అని ఆ తాత మాకు ధైర్యం చెప్పి ఆయనతో కూడా తీసుకొనిపోయినాడు.
కొద్ది దూరం నడిచి ఒక చిన్న గుడిసె దగ్గరికి పోయినాము. "రాండ్రా లోపలికి," అన్నాడు తాత. లోపల తాత పొయ్యి రాజేసి మంట పెట్టినాడు. మేము మంట దగ్గర కూర్చుని చలి కాసుకొన్నాము. తాత అన్నం వండి, తక్కోలం(టమోటా) కాయల పులుసు పెట్టినాడు. చుట్టూ కన్ను పొడుచుకున్నా కనపడని చీకటి. పొయ్యి మంట చీకటినీ, చలినీ గుడిసెలో నుంచి తరమేస్తూ ఉంది. తాత మట్ట మూకుడులో అన్నం కలిపి మాకు చెరి నాలుగు పిడచలు చేతిలో పెట్టినాడు.
మాకు ప్రాణం కుదుటపడింది. తాత ఏవో తత్వాలు పాడడం మొదలుపెట్టినాడు. నాకు కడుపులో ముద్దపడి, ఒంట్లోకి వెచ్చదనం వచ్చేసరికి బుర్ర పనిచేయడం మొదలయింది. పొద్దున్నించీ నన్ను పీడుస్తున్న ఒక సందేహాన్ని తాతముందు పెట్టినాను.
"తాతా, తెల్లారి నించీ చానామంది ఉత్తరపొద్దు, ఉత్తరపొద్దు అంటుంటారు. అంటే ఏంది తాతా?" అడిగినాను.
"ఒహొహొ! ఎద్దు గిట్లో ముల్లంత లేవు. అప్పుడే ఇయ్యన్నీ నీకు దేనికిరా?" అన్నాడు తాత.
నేను వదల్లేదు. "చెప్పు తాతా, చెప్పు తాతా," అని విసిగించసాగినాను.
"అబ్బ! బొక్కలాడబాక. చెప్తానుండ్రా," అని మొదలుపెట్టినాడు తాత.
"ఒరే అశ్విని, బొరణి, కిర్తిక, రోయిణి... ఈ మాదిరిగా మనకు ఇరవై యేడు కార్తిలుండాయిరా. దాంట్లో ఉత్తరకార్తి ఒకటి. ఈ ఉత్తరకార్తిలో సూరయ్య మన పెళయ కావేరమ్మతో కూడతాడురా."
"కూడేదంటే ఏంది తాతా?!" మధ్యలో అందుకున్నాన్నేను.
"ఆ! గోగాకు పులగుర్రా. అందుకే ఇప్పుడు నీకర్ధం కాదు. నేను చెప్పను అనింది," అన్నాడు తాత.
"సరే సరే. నడిమిద్దిలో మాట్లాడను. చెప్పు తాతా," అన్నాను.
"అబయా! ఉత్తరకార్తిలో పెళయకావేరమ్మ కట్టుకొస్తాది. సూరయ్యకు ముడిడస్తాది. ఇద్దరూ కూడతారు. దానికే ఉత్తర పొయినాకనే పెళయకావేట్లో చేపా, రొయ్య ఎచ్చయ్యేది. ఉత్తరకార్తి పన్నెండు, పదమూడు దినాలుంటది. ఈ దినాల్లో మద్దినేల గాలి బిగిసే పొద్దులో వోల్లిద్దరూ కూడేది," అన్నాడు తాత.
"గాలి బిగిసే పోద్దంటే ఎప్పుడు తాతా?" ఈసారి మా అన్న అడిగినాడు.
"మద్దినేల రెండూ, మూడు మద్దిలోరా. వాళ్ళు కూడేటప్పుడు ఎవురున్నా పెళయకావేట్లోకి దిగితే సూరయ్యకు కోపమొస్తాది. దోవ తప్పించో, దిగులుతిప్పలో ఇరికించో కసి తీర్చుకొంటాడు. దానికే ఉత్తరపొద్దులో మరీ అవసరమైతే తప్ప ఎవరూ పెళయ కావేట్లో దిగరు. దిగినా సూరయ్యకూ, పెళయకావేరమ్మకూ తప్పు చెప్పుకొని దిగుతారు.
మీకు తెలియక దిగి ఎన్ని అగచాట్లు పడినారో చూడండి. నేను లేకపొయ్యుంటే మీ గతేం కావాల?" చెప్పినాడు తాత.
మా మనసంతా తాతంటే ఒక రకమైన ప్రేమతో నిండిపోయింది.
మాకిద్దరికీ గోతాలు పరిచి, పడుకోమని చెప్పి పొయ్యి దగ్గర కూర్చుని తత్వాలు పాడసాగినాడు తాత. మాగన్నుగా కన్ను మూతబడి మంచి నిద్రపట్టింది మాకు. తాత ఆ రాత్రి తిన్నాడో, నిద్రపోయినాడో లేదో. తెల్లవారి వెలుగుపడే వేళకు మమ్మల్ని తట్టి లేపినాడు తాత.
"నేను కూడా మీతో ఆడదాకా వస్తాను పదండి," అని బయలుదేరినాడు.
తాత వెనుక చకచకా నడిచినాము. పొద్దు పుట్టేటప్పటికి పంటరంగం చేరుకొన్నాము. కోనేట్లో మునిగి, పంట రంగేశ్వరునికి మొక్కినాము. తాత రాత్రి మిగిలిన గంజి అన్నాన్ని సొరకాయ బుర్రలో పోసుకుని వచ్చినాడు. మమ్మల్ని తినమని దోసిట్లో పెట్టినాడు.
మేము తినిన తరువాత, "నేను ఈడనే నిలస్తాను. మీరు బద్దరంగా పోయి రండి," అన్నాడు.
మేము తాతకు వీడుకోలు చెప్పి బయలుదేరినాము. చిన్నతోట, పెద్దతోట, పాములతేరి, నలగామూలలు దాటుకొని గొడ్లు విప్పే వేలకు జల్లలదొరువుకు చేరినాము. ఆ సమయంలో వచ్చిన మమ్మల్ని చూసి మా మామ ఆశ్చర్యపోయినాడు.
"ఇంత పొద్దున్నే ఎట్లోచ్చిన్నారా?" అని అడిగినాడు.
మేము జరిగిందంతా చెప్పినాము. మా మామతో పాటు, ఊర్లో వాళ్ళు నలుగురయిదుగురు విన్నారు మేము చెప్పిన మాటలు.
అంతా విన్న కుమ్మరోళ్ళ రమణన్న లేచి, "అయ్యా! సుధాకరయ్యా... ఆ పంట రంగసామే మీ బిడ్డల్ని కాపాడినాడు. రెట్టమూల్లో ఇన్ని తరంతాలుగా నర మానవుడున్నట్లు ఎరగం. ఆ సోమే, పెద్దాయన మాదిర వొచ్చి బిడ్డల్ని ఉత్తరపొద్దు నించి కాపాడినాడు. శివురేత్తిరికి కూటిపొరుపు (అన్నదానం) జేస్తామని మొక్కో," అన్నాడు.
మా మామ పంటరంగం వైపు తిరిగి చేతులెత్తి మొక్కి, మమ్మల్ని గట్టిగా గుండెల కదుముకున్నాడు.
ప్రళయకావేరమ్మతో కూడడానికి సూరయ్య చరచరా పైకి లేస్తున్నాడు.
|