Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
mulakkaada rasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

సామాన్యుడి అసహనం - అనంత

                                                                       పచ్చ  భారత్

పర్యావరణ ప్రమాదం అర్ధ శతాబ్ధం క్రితమే భూగోళాన్ని కమ్మేసింది.

ఋతు పవనాలు వరస తప్పాయి. హిమ పర్వతాలు భూతాపానికి వేడెక్కి కరిగి పోనారంభించాయి. తత్ ఫలితంగా సముద్ర మట్టాలు పెరిగి సముద్ర తీర ప్రాంతాలు ప్రమాదపు అంచులకు చేరుకున్నాయి.

అయినా అటు ప్రభుత్వాలకు, అధికారంలో ఉండే నాయకులకు, అధికారులకు చీమ కుట్టినట్టయినా లేదు.

ఎంత సేపు అధికారం కోసం ప్రాకులాట...అది చేజిక్క గానే ఆదాయంపై ఆరాటం.

యధా రాజా తథా ప్రజా...ప్రజలకు అంత కంటే బాధ్యత లేకుండా పోయింది.

స్వతహాగా ఇంటి ముందు చెట్టు, ఇంటి ప్రాంగణంలో నాలుగు చెట్లు నాటుదామనే స్పృహే లేకుండా పోయింది.?

పోనీ ఇంటి ముందు ఏ సేవా సంస్థో, ప్రభుత్వమో నాటిన మొక్కకి టీ కప్పు నీళ్ళు కూడా పోయరు. కానీ రోజుకి పది కప్పులు కాఫీ, టీ లు తాగుతారు.

ఈ మధ్య కొత్త రకం పిచ్చి పట్టుకొని ఈశాన్యంలో చెట్లుండకూడదని కొందరు, కొన్ని చెట్ల మూలంగా తెగులు, పురుగు వస్తుందని ఇంకొందరు నరికేయటం దారుణం.

ఈశాన్యంలో మానవ నిర్మాణం కానీ, ఎత్తు గానీ ఉండ కూడదనుకొంటే కొంతర్థం ఉంది. ప్రకృతి సంపదైన చెట్లని తొలగించటం ఏమిటి..?మనుషుషుల్లో చాదస్తం, మూర్ఖత్వం - బాగా పెరిగి పోయి ప్రకృతికి శని పట్టింది.

యాభై సంవత్సరాల క్రితమే భూవాతావరణంలో చెడు మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిసి కూడా మన దేశాన్ని, రాష్ట్రాల్ని పాలించే నాయకులకు స్పృహ లేకుండా పోయి భవిష్యత్ ని నట్టేట ముంచారు. దేశ భక్తి, చదువు-సంధ్య, దేశ ప్రగతి, భవిష్యత్ పట్ల అవగాహన లేని వాళ్ళని ఎలక్షన్స్ లో పాల్గొనే అవకాశం ఇవ్వటం మూలం గానే దేశ భవిష్యత్ అధోగతి పాలయింది. మన దేశానికి ముందు కావల్సింది స్వచ్చ భారత్ కాదు, దేశమంతటా ముమ్మరంగా చెట్లు నాటి భూ తాపాన్ని తగ్గించి, సకాలంలో వర్షాలు సమృద్ధిగా పడేందుకు - తద్వారా దేశ వ్యవసాయం కళకళలాడేలా రైతన్నలు సుఖ సంతోషాలతో వుండేందుకు, గ్రీన్ అండ్ అగ్రి కల్చర్ ఎమర్జెన్సీ తీసుకు రావాలి. మహా రాష్ట్రలో ఒకే రోజు రెండు కోట్ల మొక్కలు నాటారని ( నిజంగా నాటారా?) కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ చంకలు గుద్దు కొని ట్విట్టర్ లో పెట్టగానే దేశ ప్రధాని గొప్ప మహా గొప్ప అనటం కాదు ఇప్పుడు కావల్సింది.

దేశంలో పచ్చ దనం కోసం ఒక మహా ఉద్యమం తీసుకు రావల్సింది.

అందుకు తగిన కఠినమైన చట్టాలు చేయాల్సింది, వాటిని అమలు చేయాల్సింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే.

ప్రధాని, ముఖ్య మంత్రులు ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన తరుణం ఎప్పుడో ఆసన్నమైనా, ఇప్పటికైనా ఆచరించాలి.

ఇప్పటికీ తేరుకోని, తెలుసుకో లేని ముఖ్య మంత్రులు దేశంలో చాలా మంది ఉండటం సిగ్గు చేటు.

గాలి, నీరు, నేల, ఆకాశం తీవ్ర స్థాయిలో విష తుల్యమై పోయాయని...పారిశ్రామికీ కరణ మూలంగా తీవ్ర స్థాయిలో ఉద్గారాలు విడుదలయి ప్రజలు వ్యాధుల బారిన పడి భారీ మూల్యం చెల్లించు కుంటున్నారని తెలిసి కూడా పచ్చ భారత్ వైపు అడుగు లేయకపోవటం క్షమించ లేని నేరం...

తెలంగాణ రాష్ట్రంలో ఒకే రోజు 45 కోట్ల మొక్కలు నాటాలనే ప్రయత్నం (నిజంగా నాటితే) ప్రశంస నీయం.

బొత్తిగా పచ్చ దనం వైపే చూడని రాష్ట్రాల్లో తమిళ నాడు ఒకటి. అక్కడెప్పుడూ జయ లలిత, కరుణా నిధి వీధి పోరాటాల స్థాయి నుంచి ఎదగరు.

పోయిన సంవత్సరం చెన్నై లో భారీ వర్షాల బారిన పడి వందల్లో ప్రాణ నష్టం - వేల కోట్లలో ఆస్తి నష్టం జరిగినా అమ్మ ఉలకదు-పలకదు.

కర్నాటక, చత్తీస్ ఘడ్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ, హరియాణా లాంటి చోట్ల ముఖ్య మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుండటం- పచ్చ భారత్ ను పట్టించు కోక పోవటం దారుణం.

ప్రతి రాష్ట్రం ప్రతి సంవత్సరం విస్తీర్ణాన్ని బట్టి కోటి ఐదు కోట్ల వరకు మొక్కలు నాటక పోతే కేంద్ర నిధులు ఆపేయటం అనే తీవ్రమైన చర్య లేక పోతే మన దేశం కరువు భారత్- రోగ భారత్ కావటం ఖాయం..

ఈ  విషయం గానే సామాన్యుడిలో అసహనం చోటు చేసుకుంటోంది ఈ మధ్య బాగా. కనుక పచ్చ భారత్ ముందు

ఆ తరువాతే స్వచ్చ భారత్.

మరిన్ని శీర్షికలు