సినిమా షూటింగ్ పూర్తయ్యిందనే ఆనందంలో ఉన్న రజనీకాంత్ అభిమానులకు షాక్ తగిలింది. రజనీకాంత్ విదేశాలకు వెళ్ళారు, అది కూడా వైద్య చికిత్స కోసం. తన తాజా చిత్రం 'రోబో 2.0' షూటింగ్ పూర్తి చేసుకున్న రజనీకాంత్, వెంటనే ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా విదేశాలకు వెళ్ళడం వెనుక అనారోగ్య సమస్యే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 'కబాలి' సినిమా షూటింగ్ తరువాత విదేశాలకు వెళ్ళిన రజనీకాంత్, అక్కడే రెండు నెలలపాటు ఉండి వైద్య చికిత్స తీసుకున్నారు. క్షేమంగా తిరిగి వచ్చిన రజనీకాంత్, 'రోబో 2.0' షూటింగ్లో బ్యాలన్స్ పార్ట్ని కంప్లీట్ చేశారు.
ఆయన 'కబాలి' సినిమా ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొనలేకపోయారు. అయితే 'రోబో 2.0' సినిమా ప్రమోషన్లో మాత్రం రజనీకాంత్ పాల్గొనే అవకాశం ఉందట. ఈ దఫా విదేశీ టూర్ కేవలం రెండు వారాలు మాత్రమేననీ, గతంలో తీసుకున్న వైద్య చికిత్స కొనసాగింపు, అలాగే కొన్ని వైద్య పరీక్షల నిమిత్తం మాత్రమే ఆయన విదేశాలకు వెళ్ళారని ఆయన సన్నిహితులు చెప్పడం జరుగుతోంది. ఏ అనారోగ్యానికి ఆయన వైద్య చికిత్స పొందుతున్నారో మాత్రం ఎవరికీ తెలియరావడంలేదు. అయితే రజనీకాంత్ అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన తిరిగి వస్తారన్న అభిమానుల ఆశలు ఎప్పటికప్పుడు ఫలిస్తున్నాయి. దాంతో తమ అభిమాన హీరోకి ఏమీ కాదనే వారి ధీమా ఇంకోసారి రెట్టింపుగా కనిపిస్తోంది.
|