Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

మలేషియ విహారయాత్రలు - కర్రానాగలక్ష్మి

malaysia tourism

( పినాంగ్)

పినాంగ్ కి దగ్గర గా చాలా చిన్న చిన్న అంటే మహ అయితే ఓ యెకరం విస్తీర్ణం వున్న ద్వీపాలు కూడా వున్నాయి . కొన్నిటికి పేర్లు వున్నాయి , పేరులేని ద్వీపాలు యెన్నో వున్నాయి . కొన్ని ప్రతీ నెలా వచ్చే ఆటూపోట్లకి మునిగి తేలుతూ వుంటాయి . మా నివాసానికి యెదురుగా అలాంటి ద్వీపం వుండేది . ఓ నాలుగు వృక్షాలు చిన్న యిల్లు వుండేవి ,  ప్రతీ నెలా నాలుగు రోజులు నీటిలో వుండేవి . ఆ యింట్లో మనుష్యులు యెలా వుంటున్నారో నాకైతే అర్ధమయేదికాదు . అప్పుడప్పుడు మనుషులు ఆ ద్వీపంలో కనిపించేవారు .

అలాంటిదే మరో ద్వీపం మా బాల్కనీ లోంచి కనిపిస్తూ వుండేది . ఓ మోస్తరుగా వుండేది . సుమారు ఓ నాలుగైదు యెకరాలు వుంటుందేమో ? , పచ్చగా బాగా దట్టమైన అడవిలా వుండేది . ' పెంతయి జెరజాక్ ' అనేవారు . జెరజాక్ అంటే జైలు , ఆంగ్లేయుల కాలం లో మన అండమాన్ జైలులా దీనిని వాడేవారుట . దాని తరువాత అలాగే పాడు పెట్టేరు . పినాంగ్ ద్వీపం నుంచి అక్కడకి వెళ్లడానికి ప్రయాణ సాధనాలు లేక వెళ్లలేక పోయేవారం . కాని అక్కడి అడవి , అందులోంచి రాత్రి పగలు వినిపించే పక్షి , జంతువుల కూతలు మమ్మల్ని ఆకట్టుకొనేవి . రోజూ మా బాల్కనీలోంచి చూస్తూ అక్కడకి వెళ్లగలిగితే బాగుణ్ణు అని అనుకుంటూ వుండేవాళ్లం . ఓ రెండేళ్ల తరువాత ఓ రోజు లాంచి ఆ ద్వీపం చేరడం చూసేం . మనుషులు ప్రయాణిస్తూ కనిపించేరు . మేము మా ఫ్రెండ్స్ ( మన దేశస్థులే , మా వారు పనిచేస్తున్న కంపెనీలోనే పనిచేసేవారు ) వారితో కలిసి అక్కడకి వెళ్లేం . ఆ ద్వీపానికి ప్రతీ గంటకి లాంచీ సర్వీస్ వుంది . యేవేవో హోటల్స్ వచ్చేయి . మసాజ్ పార్లర్లు యేర్పాటు అవుతున్నాయి .

ద్వీపం లోపల తిరగడానికి ప్రయాణ సాధనాలు లేవు , కొందురు చైనీయులు సైకిల్లు తెచ్చుకొని తిరుగుతున్నారు . ఎంతైనా మనకన్నా తెలివైన వారు కదా ? , మేము నడవగలిగినంత దూరం నడిచి ప్రకృతిని అనుభవించి బీచ్ లో కూర్చున్నాం , సైకిళ్ల మీద వెళ్లిన చైనా వాళ్లుకూడా ఓ గంట తరువాత బీచ్ కి వచ్చేరు . మాకు యెక్కడా జైలు లాంటిది కనబడలేదు , వారు ద్వీపం మొత్తం తిరిగారు కాబట్టి వారిని అడిగేం జైలులాంటి కట్టడం యేమైనా చూసేరా ? అని  , అలాంటి కట్టడాలు యేమీ లేవట , మరి ఖైదీలను యీ ద్వీపం మీద వదిలేసేవారో లేక కట్టడాలు సముద్ర అలల తాకిడికి నేలమట్టం అయిపోయేయో మరి . మా చైనీయులు అందించి సమాచారం మరో ఆరునెలలు మాత్రమే యీ ద్వీపానికి రాగలమని , తరువాత ఓ రోజు గడపాలంటే ముందుగా అంటే బోటు టికెట్స్ తో పాటు ఆ ద్వీపంలో గడపడానికి ముందుగానే డబ్బులు చెల్లించాలని , పిక్నిక్ లా మన భోజనం తీసుకొని రావడానికి కుదరదని , కాబట్టి యీ ఆరు నెలలలో వీలైనన్ని సార్లు వచ్చి యిక్కడ గడపాలని వారి ఆలోచన . వీరు ప్రతీ వీకెండుకీ యెక్కడకైనా వెళ్లే అలవాటు వారికి , యెక్కడకీ వెళ్లలేకపోతే యింటి యెదురుగా వుండే పార్కుకి వెళ్లి సాయంత్రం దాక గడిపి యింటికి వెళ్లిపోయేవారు . నిజంగానే వారు చెప్పినట్లుగానే ' పెంతై జెరజాక్ ' ఓ మంచి ఔటింగ్ స్పాటు ' గా తీర్చి దిద్దబడింది , అలాగే అందులోకి వెళ్లడానికి మూడువేల రూపాయలు ప్రవేశ రసుముగా పెట్టేరు . ఆ ద్వీపంలో అంతకన్నా చూడ్డానికి యేమీలేదు .

మలేషియన్ కరెన్సీని ' రింగెట్ ' అంటారు అప్పట్లో మన పదకొండు రూపాయలు ఒక రింగెట్ తో సమానం . ఒకటి , రెండు , ఐదు , పది , యిరవై , యాభై , వంద రింగెట్ల నోటు మాత్రమే వుండేవి .

స్థానిక తమిళులు ' విల్లి ' అనేవారు . నెలసరి సరుకులు ఓ యాభై అరవైగెట్స్ లో అయిపోయేవి . కూరలు మాత్రం నెలకు ఓ వంద రింగెట్లు అయేవి . పినాంగ్ లో లిటిల్ యిండియ లాగే చైనీస్ మార్కెట్ వుండేది . అక్కడో సెల్ ఫోను టివి ప్రొగ్రామ్స్ కేచ్ చేసేది కొన్నాను . యిది 2003 నాటి మాట . మనకి మామూలు ఫోను నంబరు కన్పించే సెల్ ఫోన్స్ కాలంలో అన్నమాట . 3000 రూపాయలకు కొన్నాను . 2010 వరకు దానిని వాడేను . మన దేశం లో కూడా టివి ప్రోగ్రామ్స్ కేచ్ చేసేది . చిన్న స్క్రీను మీద బొమ్మలు చూడ్డం తమాషాగా వుండేది .

పినాంగ్లో అతి యెత్తైన కట్టడం ' కోమ్ తార్ ' , దీనిని కట్టినప్పుడు యిది మలేషియాలోనే కాక మొత్తం ఆసియా దేశాలలోనే అతి యెత్తైన కట్టడంగా వుండేది . తర్వాత తర్వాత నిర్మించబడ్డ కట్టడాలు యింకా యెత్తుగా కట్టడంతో ప్రస్తుతం ఆసియాలో పదవ స్థానాన్ని , మలేషియాలో ఆరవ స్థానాన్ని దక్కించుకుంది . స్వతంత్ర మలేషియ రెండవ ప్రధానమంత్రి  ' తున్ అబ్ధుల్ రజాక్ ' చే 1974 లో శంకుస్థాపన  జరిగి అతని గౌరవార్దం నిర్మాణంప బడిన అరవై అంతస్థుల కట్టడం . దీని యెత్తు సుమారు 248.7 మీటర్లు , 68 అంతస్థలలో నిర్మించబడింది . ఈ కట్టడం లో జిల్లా పరిపాలనా కార్యాలయాలతో పాటు , నిజ వాణిజ్య కార్యాలయాలు , షాపులు మాల్స్ , నివాసాలు వున్నాయి .

దీని నిర్మాణానికి గాను కావలసిన 11 హెక్టార్ల చదరపు నేలను కేటాయించినపుడు చాలా నివాసాలు , మందిరాలు నేలమట్టం గావించబడ్డాయి . దీని పై అంతస్థులో ' రైనా బొ స్కై వాక్ ' నడపబడుతోంది . ఈ ప్రాంతం యెప్పుడూ రద్దీగానే వుంటుంది . దీనిని ఆనుకొని వున్న బహుళ అంతస్థుల పార్కింగ్ మరో ఆకర్షణగా వుండేది . గుడ్రంగా  కారులో తిరుగుతూ పార్కింగ్లో కి వెళ్లి కారు పార్క్ చెయ్యడం అప్పట్లో అదే అనుభవం .

కిక్ - లాక్ -సి ( రామ vi )-----

ఇది మలేషియాలో వున్న పెద్ద బౌద్దమందిరం . ఈ మందిర నిర్మాణానికి కావలసిన ధనసహాయం మలేషియాలోని 5గురు చైనీ వ్యాపారవేత్తలు అందించేరు . ఈ మందిరం సముద్రానికి యెదురుగా వున్న ఓ గుట్టమీద కట్టబడింది . ఎయిర్ - యితేమ్ కి పక్కగా వుంటుంది . ఎయిర్ యితేమ్ కి వెళ్లినపుడు చూసి దేవుడి మందిరమా ? కాదా?  తెలుసుకొని వెళ్లేం. చాలా మంది బౌద్ధ బిక్షువులు అటూ యిటూ తిరుగుతూ కనిపించేరు . చైనా , థైవాన్ , హాంగ్ కాంగ్ , ఫిలిపైన్స్ , థాయ్ లాండ్ వారికి యిది పవిత్ర స్థలం .

బయట పెద్దపెద్ద మూడు విగ్రహాలు కిరీటాలతో వున్నవి పిశాచాల రాజు అతని అనుచరులవి  . బయట తీర్చి దిద్ది నట్లున్న ఉద్యానవనం చాలా బాగుంది . ప్రతీ చెట్టుకొమ్మకి , లోపల ప్రతీ స్థంబానికి కట్టిన యెర్రని లాంతర్లు యెంత ముచ్చటగా వున్నాయో . 7 అంతస్థులలో వున్న పగోడా , మొదటి రెండతస్థులు చైనా శిల్పకళ , దానిపైన మూడంతస్థులు థాయి , ఆపైన బర్మీస్ శిల్పకళను చూడొచ్చు . ఈ మందిరం మహాయాన బౌద్ధమత తెగకు చెందినది .

లోపల మందిరం లో కి అడుగు పెట్టానే యెన్నో విగ్రహాలు , కంచువి వున్నాయి . పదివేల బౌద్ధ విగ్రహాలేకాక బోధిసత్వుని విగ్రహాలు , బౌద్ధ బిక్షువుల విగ్రహాలు వున్నాయు . గర్భగుడిలో వున్న పెద్ద బుద్ద విగ్రహాన్ని అప్పటి థాయ్ ల్యాండ్ రాజైన ' భూమి భోల్ ' యీ మందిరానికి కానుకగా యిచ్చేడు . 2002 లో ఇంతకు ముందు వున్న ' కాన్ యిన్ ' దేవత ప్లాష్టర్ ఆఫ్ పేరిస్ విగ్రహం యీ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పాడయిపోగా దాని స్థానంలో 30.2 మీటర్ల యెత్తైన కంచు విగ్రహాన్ని ప్రతిష్టించేరు . కిందన సుమారు రెండు మీటర్ల యెత్తున్న కంచు ' కాన్ యిన్ ' దేవతల విగ్రహాలున్నాయి . యీ మందిరాన్ని పదివేల బుద్ద విగ్రహాల మందిరం అని కూడా అంటారు . మనకి కోటి లింగేశ్వర మందిరంలాగా వీరికి పదివేల బుద్ద మందిరం అయివుంటుంది . బోధిసత్వుని విగ్రహాలు , బౌద్ద భిక్షువుల కంచు విగ్రహాలు కూడా యిక్కడ వున్నాయి . చైనా జాతకం ప్రకారం వారికి వున్న పన్నెండు రాశులకు సంభందించిన జంతువుల కంచువిగ్రహాలు కూడా వున్నాయి . థాయ్ లాండ్ రాజైన రామ -6 యీ మందిర శంకుస్థాపన  చెయ్యడం వల్ల దీనిని రామ -6 మందిరం అనికూడా అంటారు . థాయ్ లాండికి చెందిన బౌధ్ద భిక్షువులు యిక్కడ యెక్కువగా కనిపిస్తారు .

ప్రతీ యేడాది వందలాది థాయి బౌద్దులు యిక్కడకి వస్తారు . చైనా సంవత్సరాదికి యీ మందిరంలో 30 రోజులు దీపాలంకరణ చేస్తారు . దీనిని దీప సముద్రంగా వ్యవహరిస్తారు . ఆ 30 రోజులు దీపాలంకరణ చూడ ముచ్చటగా వుంటుంది .

ఇక్కడ థాయ్ లాండు , మలేషియ బౌద్దులు గురించి కాస్త తెలుసుకుందాం . ప్రతీ బౌద్ధమతానికి చెందిన మగవారు వివాహానికి ముందు కనీసం 45 రోజులు బౌద్దభిక్షువుగా జీవించాలనే నియమం వుంది , వయసు నియమంలేదు . 45 రోజులు బౌద్దభిక్షువుగా  దీక్ష తీసుకోని వ్యక్తి కి వివాహ అర్హత వుండదు .

అందువల్ల బౌద్దులకి స్కూలు లో , కాలేజీలలో , ఉద్యోగ సంస్థలలో యీ దీక్షకు గాను కావలసిన శలవులు యివ్వాలనే నిబంధన వుంది . ఇది కనీసం అన్నమాట , కొందురు యిలాంటి దీక్ష ప్రతీ సంవత్సరం కూడా పాఠించవచ్చు . మన అయ్యప్పమాల వేసుకున్నట్లన్నమాట . పెళ్లైన వాళ్లు దీక్ష తీసుకోవచ్చో లేదో మాత్రం తెలీదు . అక్కడి వారు పెళ్లైన వాళ్లకి ఆ అర్హత వుండదు అన్నారు .

అక్కడి మాల్స్ లో యీ దీక్షకు కావలసిన వస్తువులు ఓ పేక్ లో లభిస్తాయి . అందులో భిక్షా పాత్ర , వూదొత్తులు పెట్టుకొనే స్టాండు , ఓ విగ్రహం పూజకు ప్లాస్టిక్ పూలనుంచి ముత్యాల వరకు ఖరీదును బట్టి వుంటాయి . అలాగే భిక్షాపాత్ర ఖరీదుని బట్టి వుంటాయి . కాషాయ రంగు పంచలు అవీ వుంటాయి . దీక్ష తీసుకున్న అబ్బాయి దగ్గరగా వున్న బౌద్ద మందిరానికి వెళ్లి , కాషాయం ధరించి , జుత్తుపూర్తిగా తీసివేసి , రోజూ రెండు పూటలా స్నానం చేసి , రోజూ బుద్దుని విగ్రహానికి సేవలుచేసి , మధ్యాహ్నం రాత్రి భిక్షాటన చేసి ఆ భిక్షనే తిని , నేలపైనే పడుక్కొని గడుపుతారు . 45 రోజుల తరువాత తిరిగి యిళ్లకు వచ్చెస్తారు .

ఇలాంటి భిక్షువులు వందలలో యీ మందిరంలో కనిపిస్తారు .

కాన్ యిన్ ' దేవి అంటే కరుణా దేవి అని అర్దం . భూదేవి , సంతాన దేవి  , స్వర్గపురాణి ఇంకా చాలా దేవతా విగ్రహాలు వున్నాయి .

ఈ ప్రదేశాన్ని చూస్తూ వుంటే అధ్బుతాన్ని చూస్తున్నట్లే అనిపించింది .

చైనా సముద్రం లో వున్న ' పొటలాక్ ' ద్వీపంలో వున్న ' కాన్ యిన్ ' దేవి మందిరం ప్రధమస్థానంలో వుండగా యీ మందిరం ఆమందిర నమూనా అని అంటారు .

' కాన్ యిన్ ' దేవి విగ్రహం యెత్తుని పినాంగ్ స్టేట్ మసీదు మీద యీ విగ్రహం నీడ పడకుండా వుండేలా నియంత్రించేరు .

పినాంగ్ లో ' బొటానికల్ గార్డెన్ , బటర్ ఫ్లై గార్డెన్ , ఫ్రూటు గార్డెన్ , స్పైస్ గార్డెన్ వున్నాయి . ఇవి కూడా చూసేం కాని నాకేమీ గొప్పగా అని పించలేదు . ఇంతకంటె మన దేశంలో యింకా బావుంటాయి . చుట్టారా కొండలు అడవులు కాబట్టి తిరగడానికి బాగానే వుంటాయి . మన దేశంలో అక్కడ కన్నా యెక్కువ జాతులు వున్నాయి . ఇక్కడ యీ దేశం నేషనల్ ఫ్రూటు గురించి చెప్పుకోవాలి . మలేషియ దేశం పండు ' డూరియన్ ' చూడ్డానికి మన పనసపండు లాగే వుంటుంది . పనసపండుకన్నా చాలా గుండ్రంగా తీర్చి దిద్దినట్లు వుంటుంది . లోపల తొనలు వుంటాయి . పండిన డూరియన్ పండు వాసన ( కంపు అనాలో వాసన అనాలో తెలీక ) కొన్ని మీటర్ల దూరం వరకు వేస్తూ వుంటుంది . ఆ వాసన భరించడం కష్టం . పచ్చగా వుండే తొనలు ముట్టుకోడానికి చాలా అసహ్యం గా వుంటుంది . తినడం వరకు వెళ్లలేక పోయేను . కొన్ని హోటల్స్ లో డూరియన్ తొనలు లోపలికి తెస్తే ఫైన్ కట్టాలనే బోర్డులు కూడా వుంటాయి . అలాంటి డూరియన్ చెట్లు కొన్ని వేలల్లో వున్నాయి పినాంగ్ లో . యిక్కడ వుండే ప్రతీ గుట్ట మీద పామ్ చెట్లు పెంచుతున్నారు . దాంతో ఆ ప్రదేశాలు అందంగా వుండడమే కాక వాణిజ్యపరంగానూ విదేశీమారకాన్ని తెచ్చిపెడుతున్నాయి . కారన్ వాలిస్ కోట ---- 18 వ శతాబ్దం లో యీస్ట్ యిండియా కంపెనీ వారు నిర్మించిన కోట . మలేషియాలో యిప్పటికీ చెక్కుచెదరక వున్న కోట యిదే . దీని గేటుకు యెదురుగా చేతిలో లాంతరు పట్టుకొని వున్న ఫ్రాన్సిస్ లైటు విగ్రహం వుంది .

ఈ కోటలో పురాతనమైన ఫిరంగులు వున్నాయి అందులో పెద్ద ఫిరంగిని 1606 లో అప్పటి జోహార్ బారును పరిపాలించిన సుల్తానుకి కానుకగా డచ్చ్ వారు యిచ్చినది వుంది . దీనిని ' సేరి రామ్ భాయి ' అంటారు . ఈ కోట వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించేరు .

ఈ కోటలో ఆంగ్లేయుల సమాధులు వున్నాయి .

ఆంగ్లేయులను వీరు ' ఫిరంగి ' లని అంటారు . పినాంగ్ లో పేరు పొందిన బీచ్ ' బతు ఫిరంగి ' . ఇక్కడ విదేశీ పర్యాటకులు యెక్కువగా వుంటారు . స్టార్ హోటల్స్ , విదేశీయులకు కావలసిన అన్ని హంగులు యీ బీచ్ పరిసరప్రాంతాలలో లభిస్తాయి . పూర్వం ఆంగ్లేయుల కాలంలో ఆఫీసర్లు యీ ప్రాంతంలో నివసించే వారట , అప్పటి బంగళాలు అవీ చూడొచ్చు .

మహాత్మగాంధి ఆశ్రమం ( దేవాన్ మహాత్మ ) -----

1935 లో వలస కూలీల సంక్షేమంకొరకు నిర్మించుకున్న ఆశ్రమం , కొత్తగా వచ్చిన కూలీల నివాసం , కూలీల బాగోగులు చర్చించుకోవడం కోసం నిర్మించుకున్న భవనం . ' హిందూ బహుజన సంఘం ' వలస కూలీల కష్టాలను యజమానుల వరకు తీసుకు వెళ్లడానికి యేర్పడ్డ సంఘం . మహాత్మా గాంధీ హత్యానంతరం దీనికి మహాత్మాగాంధీ ఆశ్రమం గా పిలువసాగేరు . 2006 లో నిలువెత్తు గాంధీ విగ్రహాన్ని నిర్మించేరు . పినాంగ్ గుట్టమీద బాల దండాయుధపాణి  కోవెల పక్కగా వుందీ భవనం . ఇప్పుడు థైపూసం కొరకు దూరప్రాంతాలనుంచి వచ్చే భక్తులకు బసగా వుపయోగిస్తున్నారు .

మలేషియన్ల భాష నేర్చుకుంటున్నప్పుడు నాకు అనిపించిందేమిటంటే వీరి భాష సంస్కృత , ఉర్దూ , తమిళ , పాళీ భాషల మిశ్రమం అని . 50 శాతం భాష ఒకటిరెండుసార్లు వినగానే అర్దమయేది . మిగతా 50 శాతం మలయ ఆంగ్ల నిఘంటువు తిరగవెయ్యవలసి వచ్చేది .

వచ్చేవారం ' లంకావి ' గురించి చదువుదాం అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
prize-for-best-comment