‘లక్ష్మక్క’గా పిలవబడే అమెరికాలోని తానా ఇమ్మిగ్రేషన్ విభాగ చైర్పర్సన్ దేవినేని లక్ష్మి న్యూజెర్సీలోని ఆల్బర్ట్ ప్యాలెస్ హాలులో లేడీస్ నైట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సినీ గాయని సునీత, తెలుగు టీవీ స్టార్ యాంకర్ ఉదయభాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా, సంస్కృతీ సంప్రదాయాలు కాపాడాల్సిన బాధ్యత మహిళలపైనే ఎక్కువగా వుంటుందన్నారు దేవినేని లక్ష్మి. అది గొప్ప బాధ్యతగా మహిళలు భావించాలని ఆమె అభిలషించారు. ఉదయభాను, సునీతలను డాన్సింగ్ దివా, క్వీన్ ఆఫ్ మెలోడీ పురస్కారాలతో ఈ కార్యక్రమంలో ఘనంగా సత్కరించారు. ఓ మహిళ సంతోషంగా వుంటే, ఆమెతోపాటు కుటుంబమంతా సంతోషంగా వుంటుందని దేవినేని లక్ష్మి చెప్పారు.
వేదికా క్రియేషన్స్ సీఈఓ దుర్గా బలుసు వేదికను అందంగా అలంకరించడంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఉదయభాను యాంకరింగ్, నటనతో ఆహూతులను ఆకట్టుకున్నారు. సింగర్ సునీత మధురమైన పాటల్ని ఇంకా మధురంగా ఆలపిస్తూ శ్రోతలను అలరించారు. వసంత గాదంశెట్టి, దుర్గా బలుసు, శిలాప, పారుల్ సింగ్, శైలజా, సుగుణ తదితరులు ఈ కార్యక్రమం ఆద్యంతం ఘనంగా జరగడానికి తోడ్పడ్డారు.
కళామందిర్, కోరల్స్ అండ్ మీడ్స్ గ్యాలరీ, వేదిక క్రియేషన్స్ ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్గా వ్యవహరించారు. హియా జ్యుయెలర్స్, వర్ణమ్ డిజైనర్స్ కోస్పాన్సరర్స్. కార్యక్రమంలో 14 రకాల స్టాల్స్ ఆహూతుల మెప్పు పొందాయి.
|