Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> యువతరం >>

స్పీడ్‌ థ్రిల్స్‌.. బట్‌ కిల్స్‌.!

speed trils..but kills

వేల కిలోమీటర్లు కాదు.. లక్షల కిలోమీటర్ల అనుభవం వున్నాసరే, రోడ్డు మీద ఒక్క క్షణం.. ఒకే ఒక్క క్షణం చిన్నపాటి నిర్లక్ష్యం ప్రదర్శిస్తే అంతే సంగతి. డ్రైవింగ్‌ అంటే అదే మరి. స్పీడ్‌ థ్రిల్స్‌.. బట్‌ కిల్స్‌.! ఈ మాట ఎప్పుడూ చెప్పుకుంటున్నదే. రోడ్డు మీద వెళుతున్నప్పుడు అక్కడక్కడా ఈ మాటలు హెచ్చరికల బోర్డుల రూపంలో దర్శనమిస్తూనే వుంటాయి. కానీ, నిర్లక్ష్యం. వేగంలో వున్న మజా ఆస్వాదించడానికే ఇష్టపడతారు తప్ప, జరగబోయే ప్రమాదం గురించి ఏమాత్రం ఆలోచించరు. అదే అన్ని ప్రమాదాలకూ కారణం. మెజార్టీ రోడ్డు ప్రమాదాల్లో మానవ తప్పిదాలే ప్రధాన కారణమని సర్వేలు చెబుతున్నాయి. రోడ్డు డిజైనింగ్‌, ఇతరత్రా అంశాలు అదనపు కారణాలు మాత్రమే. ఎంతలా హెచ్చరికలు జారీ అవుతున్నా, చలానాలు హోరెత్తిపోతున్నా డోన్ట్‌ కేర్‌.. ప్రాణాలు పోతూనే వున్నాయంతే.

సినీ నటుడు, టీడీపీ నేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, సినీ నిర్మాత నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు పెద్ద షాక్‌. హరికృష్ణ అనగానే, స్వర్గీయ నందమూరి తారకరామారావు పుత్రుడిగానే కాదు.. ఆ స్వర్గీయ ఎన్టీఆర్‌ ఎన్నికల ప్రచారం కోసం వినియోగించిన చైతన్య రధానికి సారధి కూడా గుర్తుకొస్తారు. హరికృష్ణకి డ్రైవింగ్‌ అంటే చాలా ఇష్టం. ఏకధాటిగా ఒక్కరే 2 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించేయగలరట. ఆయన గురించి తెలిసినవారు చెప్పే మాట ఇది. రోడ్డు మీద అనుకోని ప్రమాదాలు ఎదురైనాసరే, చాకచక్యంతో ఆ ప్రమాదాల నుంచి తన వాహనాన్ని తప్పించగల దిట్ట అని హరికృష్ణతో సుదూర ప్రాంతాలకు రోడ్‌ జర్నీ చేసినవారు చెబుతుంటారు. హరికృష్ణ మరణం తర్వాత కూడా చాలామంది ఆయన గురించి, ఆయన డ్రైవింగ్‌ గురించి కథలు కథలుగా చెబుతున్నారు. కానీ, ఒక్క క్షణం.. ఒకే ఒక్క క్షణం.. ఆ క్షణం హరికృష్ణను తిరిగిరాని లోకాలకు పంపేసింది.

డ్రైవింగ్‌ అంటేనే అంత. సీనియర్‌ నటులు బాబూమోహన్‌, కోట శ్రీనివాసరావులకు పుత్ర వియోగం కలిగిందీ రోడ్డు ప్రమాదాల కారణంగానే. క్రికెటర్‌ అజారుద్దీన్‌, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ కుమారుల్ని రోడ్డు ప్రమాదాల్లోనే కోల్పోయారు. ఖరీదైన బైక్‌లు, లగ్జరీ కార్లు.. ఇవేవీ అతి వేగం నుంచి వాహనాన్ని నడిపేవారి ప్రాణాల్ని కాపాడలేవు. ఏపీ మంత్రి నారాయణ కుమారుడి పరిస్థితి ఏమయ్యింది.? యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తన అభిమానుల్ని ఉద్దేశించి 'వాహనాల్ని జాగ్రత్తగా నడపండి..' అంటూ సూచనలు చేస్తుంటాడు. ఎందుకంటే, అతి వేగం కారణంగా ఆయన ఓ సారి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. మరో ప్రమాదంలో ఎన్టీయార్‌ తన సోదరుడ్ని (జానకిరామ్‌) పోగొట్టుకున్నారు. ఇప్పుడాయన తన తండ్రినీ రోడ్డు ప్రమాదంలో కోల్పోవాల్సి వచ్చింది. రోడ్డు ప్రమాదాలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగుల్చుతాయి. అతి వేగం ప్రాణాల్ని తీస్తుంది. కుర్రకారూ కాస్తంత ఒళ్ళు దగ్గరపెట్టుకోండి.!

మరిన్ని యువతరం
How to get success