Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

పర్యాటకం - కర్రా నాగలక్ష్మి

paryatakam

( అమర్ నాధ్ యాత్ర పహల్ గాం మీదుగా )


శ్రీనగరు పట్టణానికి సుమారు 88 కిలో మీటర్లదూరంలో వున్న ప్రముఖ వేసవి విడిది పహల్ గాం . పహల్ గావ్ అనంతనాగ్ జిల్లాలో వుంది . ఈ వూరుకి అమర్ నాథ్ యాత్రలో ప్రముఖ స్థానం వుంది . అమర్ నాథ్ యాత్ర లో ముఖ్యపాత్ర వున్న ' ఛడీముబారక్ ' యీ దారిగుండా అమర్నాధ్ గుహకు తీసుకు వెళతారు . యాత్ర పూర్తయాకా తిరిగి యిదే మార్గం ద్వారా తీసుకొని వస్తారు .

శివ పురాణం ప్రకారం పరమ శివుడు పార్వతీ దేవికి అమరకథ చెప్పేందుకు అమర గుహకు వెళుతూ శివుని వాహనమైన ' నంది ' ని యిక్కడ విడిచి పెట్టడం వల్ల యీ వూరుని  ' బైల్ గావ్ ' గా పిలువ సాగేరు . కాలాంతరాన యిది పహల్ గావ్ గా మారింది .

పహల్ గావ్ వెళ్లే దారంతా కొండ ప్రాంతం , మంచి పంటనేల . కొండ క్రింద ప్రాంతాలలో మామిడి , బత్తాయి మొదలయిన పండ్ల తోటలు పర్వతాల యెత్తుపెరుగు తున్న కొద్ది యాపిల్ , ఛెర్రి పండ్ల తోల మధ్యనుంచి ప్రయాణం అహ్లాదకరంగా వుంటుంది . టాక్సీలో వెళ్లేవారు యీ తోటల దగ్గర ఆగి తోట యజమాని అనుమతితో తోటలు చూడొచ్చు . ఛెర్రీ లు ఆగష్టులో పండి కోతకొస్తాయి . యాపిల్స్ అక్టోబరులో కోత కొస్తాయి . ఇంకా పైకి వెళ్తున్న కొద్దీ అక్రోటు , బాదం తోటలు చూడొచ్చు . దేవదారు , కోనిఫర్ తోటలు రోడ్డుకి యిరువైపులా వుండి మనకి స్వాగతం పలుకుతున్నాయా ? అనే భ్రమ కలిగిస్తాయి . కొండపైన జారుతున్న జలపాతాలు , పేరు తెలియని అడవి పక్షులు మన ప్రయాణపు బడలికను తెలియకుండా చేస్తాయి .

కనుచూపు మేర వరకు పచ్చని పచ్చిక బయలు , గలగల ప్రవహించే సెలయేళ్లు ,  అలా పచ్చికలో దేవదారు వృక్షాల కిందన నడుస్తూ కోనిఫర్ పూలను యేరుకుంటూ యెంతదూరం నడిచినా తనివి తీరదు . పర్యాటకుల సౌకర్యార్థం రోడ్లు వెడల్పు చెయ్యడం , హోటల్స్ అధిక సంఖ్యలో నిర్మించడం వల్ల 2014 లో మేం వెళ్లినప్పుడు పచ్చిక బయళ్ల స్థానంలో ధూళి దుమ్ము , హోటల్స్ కనిపించి నిరుత్సాహాన్ని కలిగించేయి .

అయితే యిక యాత్ర లోకి వస్తే , జమ్ము లో రిజిస్ట్రేషన్ చేసుకొని బస్సులో శ్రీనగరు మీదుగా పహల్గాం చేరుతాం . మేం మద్యాహ్నపు మూడింటికి పహల్గాం చేరేం మాతో బాటు బస్సులో వచ్చిన వారు ఆ రాత్రి అక్కడ బస చెయ్యాలనుకున్నారు . పర్వతాలలో ప్రయాణాలు యెక్కువగా వాతావరణం మీద ఆధారపడి వుంటుంది . ఆ రోజు యెక్కడా మబ్బులు లేవు , మరో నిముషంలో మబ్బులు కమ్మేయొచ్చు . అందుకే మేం పహల్గాం కి సుమారు పదహారు కిలో మీటర్ల దూరంలో వున్న'  చందన వాడి ' లో రాత్రి బస చెయ్యదలచుకున్నాం . 

సుమారు అర కిలో మీటరు నడిచేక చిన్న బస్సులు యాత్రీకులను అక్కడకి 16 కిలో మీటర్ల దూరంలో వున్న ' చందన వాడి ' వరకు తీసుకు వెళుతున్నాయి , మేం కూడా వాటిలో ప్రయాణించి చందన వాడి చేరుకున్నాం . అక్కడ లంగరు నడుపుతున్న వారే యాత్రీకులకోసం  రాత్రి బసకోసం ఉచిత టెంటులు నడుపుతున్నారు . అక్కడకు చేరగానే అడిగి మరీ మాకు కావలసిన ఆహారపదార్ధాలు యిచ్చేరు . బస్సు ప్రయాణానికి అలసిపోయిన మా శరీరాలను టెంటులో పడకల మీద చేర్చి సేదతీరసాగేం . అంతలోనే లంగరు నిర్వాహకులు టెంటులోకి వచ్చి ముందుగా  పేరు నమోదు చేయించుకొని రజ్జాయిలు తీసుకోమని పిలిచేరు . చుట్టూరా చక్కని ప్రకృతి చుట్టూరా కొండలు కనుచూపు మేర వరకు పచ్చిక మైదానాలు చాలా అందంగా వుండడం తో అలా కాసేపు పచ్చిక మీద నడచి వచ్చేం . అప్పటికి బాగా యెండకాస్తూ  వుండడం వల్ల బాగా చెమట పట్టసాగింది యింత వేడిలో రజ్జాయిలు అవుసరమా ? అని అనిపించి మేం వెళ్లలేదు . వాళ్లే వచ్చి రెండేసి రజ్జాయిలు యిచ్చి , సాయంత్రం ఆరింటికి లంగరు మూసేస్తారు కాబట్టి భోజనం ఆరులోపలే చెయ్యాలని , అలా తినలేని వారు భోజనం తీసుకొని తరవాత తినొచ్చునని చెప్పేరు . అయిదున్నర అయేసరికి సూర్యుడు అస్తమించడంతో మొదలయిన చలి అంతకంతకూ పెరగసాగింది . ఆరు తరువాత గుర్రాల వాళ్లు టెంటుకి వచ్చి బేరాలు చెయ్యసాగేరు . నడక మావల్లకాదు కాబట్టి మేం గుర్రాలను శేష నాగ్ వరకు మాట్టాడుకున్నాం . సుమారు పదమూడు పద్నాలుగు కిలో మీటర్ల దూరం ఒకే రోజులో ప్రయాణం అంటే కష్టం అన్న గుర్రపు యజమానిని వొప్పించి పొద్దున్న ఆరు లోపల బయలుదేరుదాం అని చెప్పేం . మా భోజనాలు చేసుకొని యేడుకల్లా నిద్రకివుపకరించేం .

 యాత్ర మరునాడు మొదలు పెట్టబోతున్నాం అనే హుషారులో తొందరగా నిద్రపోయేం . శివుడు పార్వతితో అమర్నాధ్  కి వెళుతూ ఈ ప్రదేశంలో తలపైనున్న చంద్రుణ్ణి విడిచిపెట్టాడని పౌరాణిక కథ .

పొద్దన్న అయిదున్నర కల్లా మేం మాట్లాడుకున్న గుర్రాలవారు వచ్చి మమ్మల్ని లేపేరు . అప్పటికే లేచిన లంగరు వాళ్లు టీ ఫలహారాల తయారీలో వున్నారు .

బాత్రూములేమీ లేవు బయట పళ్లు తోముకొని స్నానం వాయిదా వేసి టీ ఫలహారాలు కానిచ్చి ప్రయాణం మొదలు పెట్టేం .

సుమారు మూడు కిలో మీటర్ల యెగుడూ దిగుడూ దారిలో చందనవాడి నుంచి 2500 అడుగుల యెత్తు యెక్కి ' పిసు శిఖరం ' దాటాలి . చాలా కష్టంగా వుంటుంది . వంకలు తిరిగిన యెగుడు దిగుడు కొండదారి మీద ప్రయాణం చాలా కష్టంగా వుంటుంది . తరచు కురుసే వర్షాలకు జారిపడిన కొండరాళ్లను దాటుకుంటూ ప్రయాణంచాలి . ఈ పిసు శిఖరాన శివుడు తన శరీరంపైన వున్న విషజీవులను విడిచి పెట్టేడు .

సూర్యుడు మబ్బులలోనే వుండిపోవడంతో మా ప్రయాణం మరింత అహ్లాదకరంగా మారింది . అక్కడనుంచి ' ఝాజీబల్ ' వరకు వున్న 5 కిలోమీటర్లూ దారి సాఫీగా యే యెగుడు దిగుబడులు లేక సాగింది . ఝాజీబల్ నుంచి నాగకోటి వరకు వున్న 2 కిలో మీటర్ల దారి కష్టమైనదని కావడంతో గుర్రాలమీంచి దిగి నడవాలి . దారి జారుడుగా వుండడం వల్ల గుర్రాలు కూడా నిభాయించుకోలేవు . అందుకు ప్రతీ వారు యీ రెండు కిలో మీటర్లు నడిచే పూర్తి చెయ్యాలి . నాగకోటి లేక నాగర్ కోటి గా పిలువబడే యీ ప్రదేశంలో శివుడు తన శరీరం పైన వున్న నాగులను విడిచిపెట్టడు . నాగర్ కోటి నుంచి మరో కిలో మీటరు ప్రయాణం తరువాత రెండు కొండల మధ్యనుంచి నీలి రంగు సెలయేరు వస్తున్నట్లుగా శేషనాగు సరస్సు కనిపిస్తుంది .

శేషనాగ్ సరస్సు దగ్గర వున్న యేడు కొండలు శేషుడి పడగలని , శివుడు యిక్కడ శేషుడి విడిచి పెట్టేడని పురాణ కథ . శేషనాగ్ సరస్సుని చూస్తూ  ఆ ప్రాంతం లో గల ప్రకృతికి పులకరించిపోతూ మరో రెండు కిలో మీటర్లు ప్రయాణించి శేషనాగ్ చేరేం . అప్పటికి చీకట్లు ముసురుతున్నాయి . మా గుర్రాలబ్బాయి దింపిన టెంటులో ₹600 ఒక మంచానికి యిచ్చి రెండు మంచాలు తీసుకున్నాం . సన్నగా వాన ప్రారంభించింది , అరకిలో మీటరు దూరంలో వున్న లంగరుకు వెళ్లి రాత్రి భోజనం చేసుకొనే సరికి వాన పెరిగింది . మేం మంచాల మీద రజ్జాయిల కింద పడుక్కున్నాం . వాన అంతకంతకూ పెరిగి కుంభవృష్టిగా కురవ సాగింది . మాతో పాటు టెంటులో వున్న మిగతా ముప్పై మందికి ఆరోజు యాత్ర లేదని తెలియడంతో తిండికి తప్ప మిగతా సమయం రజ్జాయిలోనే గడిపేము . మధ్య మధ్య లో వూసు పోడానికి కుశల ప్రశ్నలు , తరవాత భజనలు చేస్తూ గడిపేం . రాత్రి వాన నీరు టెంటులోకి ప్రవేశించేయి . మూడువందలుయిచ్చి కింద పడుక్కున్నవారి పడకలు తడిసిపోయేయి . కిందన నీరు మీదా టెంటు కారడం వల్ల తడి , చలి వల్ల రాత్రి యెవ్వరికీ నిద్ర లేదు .

మరునాడు కూడా వర్షం పడుతూనే వుంది . అయితే ఉధృతం తగ్గింది . టెంటులో వుండడానికి అద్దె రెండురెట్లు పెంచేరు టెంటు యజమానులు .

మూడో రోజు వాన తగ్గింది కాని దారి బురద అవడం వల్ల గుర్రాలని వెళ్లనివ్వలేదు . నడిచి వెళ్లేవారు టెంటులోంచి వెళ్లిపోయేరు . మేంనాలుగో రోజున ప్రయాణం తిరిగి ప్రారంభించేం . ఆరోజు మేం సుమారు 12 కిలోమీటర్లు ప్రయాణించి గుహ చేరుకొని దర్శనానంతరం సుమారు 18 కిలోమీటర్లు ప్రయాణించి బాల్టాల్ చేరాలన్నది మా ఆశ , అందుకని మేం ఉదయం 5 గంటలకి ప్రయాణం మొదలు పెట్టేం .

శేషనాగ్ నుంచి మా ప్రయాణం మహాగణ శిఖరం లేక గణేష శిఖరం అని పిలువబడే శిఖరం వైపు సాగింది . మొత్తం యాత్రలో యిదే కష్టమైన ప్రయాణం , యిక్కడ పరమశివుడు గణేషుడిని విడిచి పెట్టేడు .

ఈ ప్రాంతం లో మంచుకరిగి ప్రవహించే నీటితో బురదగా వుంటుంది . ఇక్కడ  నడవడం గుర్రాలకి , మనుషులకు కూడా చాలా కష్టంగా వుంటుంది . కొన్ని చోట్ల గడ్డకట్టిన మంచుమీద కూడా ప్రయాణం సాగుతూ వుంటుంది , గడ్డకట్టిన సెలయేళ్లు కావడం వల్ల కొన్ని చోట్ల పలుచని పొరలా గట్టిపడి కాలు పడగానే మంచు విరిగి మనిషి నీళ్లల్లో పడిపోయే ప్రమాదం వుంటుంది అందుకే గుర్రాలవారు నడిచే చోట నడవాలి లేకపోతే మంచునీటిలో పడిపోవడం ఖాయం . గడ్డ కట్టిన మంచుమీద నడక తరువాత గణేషశిఖరానికి ప్రయాణం మొదలవుతుంది . యిక్కడ నుంచి నడక చాలా కష్టంగా మారుతుంది . ఒకటి యెత్తు యెక్కువగా వుండడం , రెండు గాలిలో ఆక్సిజన్ శాతం చాలా తక్కువగా వుండడం . ఇలాంటి సమయాలలో ముద్దకర్పూరం వాసన చూడమని పర్వతారోహకులు సలహా యిస్తారు . నడిచేవారు ట్వంటి- ట్వంటి ఫార్ములాని అనుసరిస్తారు , అంటే యిరవై అడుగులు నడిచిన తరువాత యిరవై దీర్ఘశ్వాసలు తీసుకోడాన్ని పర్వతారోహకులు ట్వంటి - ట్వంటి అని అంటారు . ఈ పర్వత శిఖరం ' పిసు శిఖరం ' అంత యెత్తులేక పోయినా అప్పటికే శరీరం అలసిపోయి పోయి వుండడం , గాలిలో ప్రాణవాయువు లోపించడం , కొండ ప్రాంతాలలో ఆకలి మందగించడం వల్ల సరైన ఆహారం తీసుకోక పోవడం వల్ల యెక్కడం కష్టమౌతుంది . గణేషశిఖరం దాటేక మాప్రయాణం బాబల్ శిఖరం వైపు సాగింది . శేషనాగ్ నుంచి బాబల్ శిఖరానికి సుమారు మూడు కిలో మీటర్లు వుంటుంది . బాబల్ శిఖరాన్ని చేరుకోడానికి సుమారు మూడు గంటలు పడుతుంది . అప్పటికి మనం సుమారు 13800 అడుగుల యెత్తుకి చేరుకుంటాం .

బాబల్ శిఖరం మీంచి అమర్నాధ్ గుహ కనిపిస్తుంది కాని దారిలో మరో శిఖరాన్ని మనం యెక్కాలి . బాబల్ శిఖరం దగ్గర రెండు మూడు లంగరులు , బి.ఎస్.ఎఫ్ వారి మెడికల్ కేంపు వున్నాయి . గుర్రం దిగితే యెక్కడం వో పెద్ద ప్రశ్న గా వుండడంతో  ఆకలిగా వున్నా మేం దిగలేదు . కాని లంగరు వారు మా గుర్రాల దగ్గరకు వేడివేడి పాయసం , గోరు వెచ్చని నీరు అందించడంతో మా ప్రాణాలు లేచి వచ్చి మిగతా ప్రయాణం సుఖంగా చెయ్యగలగేం . గుప్పెడు టాఫీలు యిచ్చి నీరసంగా వున్నప్పుడు నోట్లో వేసుకోమని సలహా యిచ్చేరు . అక్కడనుంచి సుమారు 1.5 కిలోమీటర్లు ప్రయాణానంతరం  ' మహాగణ శిఖరం ' చేరుతాం . సుమారు 14500 అడుగులయెత్తుకి చేరుతాం . శివుడు యిక్కడ మిగతా గణాలను విడిచి పెట్టి పార్వతితో గుహ వైపు సాగిపోయేడు .

మహాగణశిఖరం నుంచి 1.5 కిలోమీటర్లు గడ్డకట్టిన అమరుగంగ నదిపైన ప్రయాణించి  పౌష్ పత్రి చేరుకుంటాం . పోష్ పత్రి నుంచి సుమారు మూడు కిలో మీటర్ల యెగుడు దిగుడు దారిలో మెలికలు తిరిగిన దారిలో ప్రయాణించి పంచతరణి చేరుతాం . దీనిని సంగం అని కూడా అంటారు . యిక్కడ శివుడు తన ఢమురుకాన్ని విడిచి పెట్టినట్టుగా చెప్తారు . యిక్కడ నుండి సుమారు మూడు కిలోమీటర్లు  కొంచం మట్టి కొండలమీద , గడ్డ కట్టిన మంచుమీద నడవాలి . పంచతరణి దగ్గర బాల్టాల్ నుంచి వచ్చే యాత్రీకులు కూడా కలుస్తారు . ఇక్కడ నుంచి యాత్రీకులు కాలినడకన వెళ్లాలి , గుర్రాలని ముందుకి అనుమతించరు .

ఆ మంచులో చలిలో నడుస్తూ  గుహ చేరుకొని బాబా అమర్ నాధ్ ని దర్శించుకున్నాం .

తిరిగి వచ్చేటప్పుడు బాల్టాల్ మీదుగా సోనెమార్గ్ చేరుకొని అక్కడనుంచి శ్రీనగరు అక్కడనుంచి టాక్సీ లో జమ్ము చేరుకున్నాం .

అప్పట్లో బాత్రూములు వుండేవి కావు కాని యిప్పడు టెంట్లలో నే అన్ని సదుపాయాలూ యేర్పాటు చేస్తున్నారు .

2002 లో హెలీకాఫ్టర్ పంచతరణి వరకు వుండేది . ప్రస్తుతం బాబల్ శిఖరం వరకు మాత్రమే నడుపుతున్నారు  .

మరిన్ని శీర్షికలు
achaaram