Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

శ్రీ గోపీచంద్ గారికి నివాళి - టీవీయస్. శాస్త్రి

Sri Tripuraneni Gopichand

ఆధునిక తెలుగు సాహిత్యములో నన్ను ఉత్తేజపరచిన రచయితలలో మొదటివాడు చలం, ఆ తర్వాత కోవలోని వారు శ్రీ శ్రీ, త్రిపురనేని గోపీచంద్. గోపీచంద్ రచనలన్న, వ్యక్తిత్వమన్న నాకు చాలా ఇష్టం. అతని భావాల లాగానే అతడు కూడా చాలా అందగాడు. కరుడు గట్టిన నాస్తికవాది రామస్వామిచౌదరి గారి అబ్బాయి. చిన్నతనములోనే తల్లిని పోగొట్టుకున్నాడు. ఇంటి పనులతోపాటు, తండ్రి గారి నాస్తికోద్యమునకు సహాయము చేయటం లాంటి పనులతో అతని బాల్యం చాల గడచి పోయింది. అటు తర్వాత, మద్రాస్ లో లా చదువుకున్నారు. అతని మీద చాలా కాలము వారి నాన్న గారి ప్రభావం ఉండేది. వారు మొదట  వ్రాసిన చాలా నవలలో Marxist భావాలు మనకు పూర్తిగా కనిపిస్తాయి.

వారు వ్రాసిన "మెరుపుల మరకలు" అనే గ్రంధంలో గాంధీరామయ్య అనే ఒక పాత్ర ఉంది. ఆ పాత్ర ఒక సజీవ పాత్రగా నాకు అనిపించింది. నేను తెనాలిలో పనిచేసే రోజుల్లో గోపీచంద్ గారి సహచరులలో కొంతమందిని ఆ విషయము గురించి వివరణ అడిగాను. వారిలో, ఒక పెద్దాయన నాకు చెప్పింది ఏమంటే,  ఆ పాత్ర శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు గారిది అని. రామస్వామిచౌదరి గారు, పంతులుగారు మంచి స్నేహితులు. రెండు భిన్న ధ్రువాలు. ఒకరు కరుడుగట్టిన నాస్తిక వాది, మరి ఒకరు పూర్తి ఆస్తికులు. అయితే, ఇద్దరు గాంధేయవాదులు. రామస్వామిచౌదరి గారికి యవ్వనంలోనే భార్య గతించింది. పునర్వివాహం చేసుకోలేదు. ఒక రోజు పంతులుగారు రామస్వామిచౌదరి గారిని కలవటానికి తెనాలి వెళ్ళారు. స్నేహితులిద్దరికి గోపీచంద్ గారు భోజనం వడ్డిస్తున్నారు. ఆ సందర్భములో, పంతులు గారు "ఏమయ్యా! రామస్వామి నీవు ఉద్యమాలలో పూర్తిగా మునిగి, కుమారుడి వివాహము సంగతే మర్చిపోయావు"  అని అన్నారు. అప్పుడు, చౌదరి గారు, నిజమే పంతులు గారు, ఆ విషయము పూర్తిగా మరచిపోయాను. మీరే ఏదైనా మంచి అమ్మాయిని చూసి వాడికి పెళ్లి చెయ్యండి అని అన్నారట. అప్పుడు.పంతులు గారు, గోపీచంద్ తో, "నీవు మద్రాస్ వెళ్ళే లోపు ఒక పది రోజుల ముందు, గుంటూరు రా.." అని అన్నారు. గోపీచంద్, సరే అంటం... అలాగే గుంటూరికి వెళ్ళటం జరిగింది.

ఆ రోజుల్లో గుంటూరులో "శారదా నికేతన్" అనే వితంతు శరణాలయం ఉండేది. ఇప్పుడు కూడా ఉంది. దాని నిర్వహణ భాద్యత అంత ఆ రోజుల్లో పంతులు గారే చూసుకునే వారు. ఆ రోజుల్లో అన్నీ బాల్యవివాహాలు కావటం చేత, వదూవరులకు వయోబేధం ఉండటం చేత అక్కడ ఉన్నవారిలో కూడా చాలామంది బాలవితంతులే! గోపీచంద్ వచ్చి పంతులు గారిని కలసి, ఎందుకు రమ్మన్నారో చెప్పమని అడిగారు. పంతులు గారు ఏ విషయము చెప్పకుండా, నీకు నచ్చిన ఒక క్లాసుకు వెళ్లి ఒక పది రోజులు పాఠాలు చెప్పమన్నారు. ఆ వితంతు శరణాలయాన్ని పంతులుగారు నడుపుతున్న తీరు, బాలవితంతుల దీన పరిస్థితి గోపీచంద్ పై తీవ్ర ప్రభావం చూపాయి. ఆయన రచనలలో కొన్నింటిలో వాటి ప్రభావం కనపడుతుంది. కాలక్రమంలో గోపీచంద్ గారి మీద వారి నాన్నగారి ప్రభావం తగ్గ నారంభించింది. స్వతంత్ర భావాలను పెంచుకున్నారు. జీవితములో పెంచి పెద్ద చేసిన నాన్నగారి కంటే పంతులుగారి ప్రభావం అతని మీద చాలావరకు ఉంది. అందుకే, గాంధీరామయ్య పాత్ర సజీవంగా నిలిచిపోయింది.

గోపీచంద్ గారు నెమ్మదిగా Marxist philosophy నుండి బయటపడి, చివరి రోజులలో తత్వవేత్తలు అనే తాత్విక గ్రంధాన్ని వ్రాయటం జరిగింది. పోస్ట్ చెయ్యని ఉత్తరాలు, అసమర్ధుని జీవయాత్ర, మెరుపుల మరకలు.. ఈ గ్రంధాలలో కూడా చాలావరకు తాత్విక చింతన కనపడుతుంది. ఆయనే, ఒక చోట ఇలా అంటారు, "మానవులు జీవనదుల లాగా ఉండాలి కానీ, చైతన్యంలేని చెట్లు, పర్వతాల లాగా ఉండకూడదు". మానవ జీవితం ఒక చైతన్య స్రవంతి. ఎన్నో మలుపులు తిరుగుంది. అలాగే  మనం కూడా నిరంతర అన్వేషణలో ఉండాలి. అప్పుడే మనకు సత్యమంటే ఏమిటో తెలుస్తుంది. నిన్న మనం నమ్మింది ఈ రోజు సత్యం కాదని తెలిసిన వెంటనే దాన్నివదలి మళ్ళీ అన్వేషణ సాగించాలి. ఇదే విషయాన్ని  జిడ్డు కృష్ణమూర్తి గారు, చలం గారు కూడా చెప్పారు. జీవితం అంటే నిరంతర అన్వేషణ. నిరంతర సంచారి కాని వాడు, ఎంత ధనవంతుడైనప్పటికీ, నా దృష్టిలో అతను ఒక 'బికారి' మాత్రమే. దీనికి ఆయన జీవితమే ఒక గొప్ప ఉదాహరణ. ఒక పుస్తకాన్ని వారి తండ్రిగారికి అంకితం ఇస్తూ- 'ఎందుకు' అని అడగటం నేర్పిన నాన్నగారికి అని వ్రాసారు. అలా నేర్చుకోబట్టే స్వతంత్ర భావాలు గల ఒక గొప్ప రచయిత స్థాయికెదిగారు. అటువంటి మహనీయుని జీవిత విశేషాలను గురించి క్లుప్తంగా వివరిస్తాను.

గోపీచంద్ 1910, సెప్టెంబర్ 8 న కృష్ణా జిల్లా  అంగలూరు గ్రామములో జన్మించాడు. సుప్రసిద్ధ రచయిత, హేతువాది, సంస్కరణవాది అయిన త్రిపురనేని రామస్వామి చౌదరి ఆయన తండ్రి, తల్లి పున్నమాంబ.1932 లో వివాహం జరిగింది. 1933లో బి. ఏ పట్టా, ఆ తర్వాత లా డిగ్రీ కూడా పొందారు. కొంతకాలం పాటు న్యాయవాదిగా పనిచేసినా, ఆ వృత్తి ఆయన ప్రవృత్తికి సరిపోలేదు. నెమ్మదిగా, ఆయన కమ్యూనిజం(మార్క్సిజం)పట్ల ఆకర్షితుడయ్యాడు. కాలగతిలో అదీ ఆయనకు నచ్చలేదు. ఎమ్.ఎన్.రాయ్ 'మానవతావాదం' వారిపై గొప్ప ప్రభావాన్ని చూపింది. ఈ కాలంలో ఆయన ఆంధ్రా రాడికల్ డెమొక్రటిక్ పార్టీ కార్యదర్శిగా పనిచేసాడు. ఆయన తొలి నవల పరివర్తనం(1943). ఆయన రాసిన అసమర్థుని జీవయాత్ర తెలుగులో మొదటి మనో వైజ్ఞానిక నవల. 1963లో 'పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా' కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 1939లో చలనచిత్ర రంగంలోకి ప్రవేశించిన గోపీచంద్ దర్శకనిర్మాతగా కొన్ని చిత్రాలను నిర్మించాడు. అయితే వాటివల్ల ఆర్థికంగా చాలా నష్టపోయాడు. 1953లో ఆంధ్రరాష్ట్ర సమాచార శాఖ డైరెక్టర్ గా, 1956లో ఆంధ్ర ప్రదేశ్ సమాచార శాఖ సహాయ డైరెక్టర్ గా పనిచేసాడు. 1957-62 వరకు ఆకాశవాణిలో పనిచేసాడు. తర్వాత అరవిందుని భావాలపట్ల ఆకర్షితుడై ఆధ్యాత్మికవాదం వైపుకి మళ్లాడు. 1962 నవంబర్ 2న, గోపీచంద్ మరణించాడు. భారత ప్రభుత్వము సెప్టెంబరు 8, 2011న గోపీచంద్ శతజయంతి సందర్భమున తపాలా బిళ్ళ విడుదల చేసింది.

ఆయన జీవితమే ఒక చైతన్య స్రవంతి. ఆయన లాగా, ఆలోచించటమే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి!!!

మరిన్ని శీర్షికలు
target 8