టాలీవుడ్ హీరో రామ్చరణ్కి గుర్రాలంటే ఇష్టం. ‘మగధీర’ సినిమాలో గుర్రపు స్వారీ అదరగొట్టిన చెర్రీ, ఇప్పుడు విమానమెక్కాడు. అనగా విమానయాన రంగంలోకి అడుగుపెట్టాడని అర్థం. టర్బో మేగా అనే సంస్థ ద్వారా పౌర విమాన యాన రంగంలోకి అడుగు పెడ్తున్నాడు రామ్చరణ్. ఈ సంస్థ అతి త్వరలో తమ కార్యకలాపాలు ముమ్మరం చేయనుంది.
ఇదివరకు సినిమా వాళ్ళంటే తమ వ్యాపార కార్యకలాపాలు సినీ పరిశ్రమకి దగ్గరగా ఉండేలానే చూసుకునేవారు. కానీ ఇప్పటితరం సినిమా వారి ఆలోచనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. కొన్నాళ్ళ నుంచి సినీ పరిశ్రమకు చెందినవారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా రాణించారు. ఇతర వ్యాపారాల వైపు కూడా చూసినవారున్నారు.
రామ్చరణ్ కూడా సినిమాతోపాటు విమానయాన రంగాన్ని ఇంకో వ్యాపకంగా ఎంచుకున్నాడని అనుకోవచ్చు. ఇటీవలే చరణ్ భాగస్వామిగా వ్యవహరిస్తున్న టర్బో మేగా సంస్థకు పౌర విమానయాన శాఖ నుంచి అనుమతి వచ్చింది. దేశీయంగా విమాన ప్రయాణీకుల సంఖ్య పెరగడానికి కొత్త విమానయాన సంస్థల కార్యకలాపాలు ఉపకరిస్తున్నాయి. ఈ రంగంలోనూ చరణ్ రాణించాలని కోరుకుందాం.
|