Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> అవార్డు

award

ఉదయం పదకొండు గంటల సమయం. ఇంటర్వెల్ బెల్ ముగిసి పిల్లలంతా క్లాసులోకి తిరిగి వెళ్ళిపోవటంతో , అప్పటిదాకా రణగొణ ధ్వణిగా వున్న స్కూల్ ప్రాంగణమంతా నిశ్శబ్ధం గా మారిపోయింది. థర్డ్ పీరియడ్ తనకి లీజరు కావడం తో స్టాఫ్ రూం లోకూర్చుని సెవెంత్ క్లాస్ పిల్లల సైన్సు క్లాస్వర్క్స్ కరెక్షను చేసుకుంటుంది పావని.తనతో పాటు అదే పీరియడ్ లో లీజరు వున్న మిగతా టీచర్సు కూడా ఎవరి వర్కు వాళ్ళు చేసుకుంటూనే సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు. నిజానికి టీచర్సందరూ ఎంతో అశగా ఎదురుచూసేది రోజు మొత్తం మీద ఒకటో రెండో వచ్చే ఆ లీజర్స్ కోసమే. పొద్దస్తమానం చాలా మంది పిల్లలతో అరచి అరచి విసుగొచ్చినందువల్ల లీజరు పీరియడ్ లోనే కాస్త తీసుకుంటారు., వారంతా.

'ఏమిటి పావనీ! అంత సీరియస్ గా కరెక్షన్స్ చేస్తున్నావు?' నవ్వుతూ అడిగింది తెలుగు టీచర్ జ్యోతి. రేపు ఉదయమే పిల్లలకు క్లాస్వర్క్స్ ఇచ్చేయాలి జ్యోతి మేడం, యూనిట్ టెస్ట్ దగ్గర్లోనే వుందిగా!' తల ఎత్తకుండా చక చకా టిక్స్ కొడుతూనే అంది పావని. ఇంతలో అటెండరు సైదులు వచ్చాడు స్టాఫ్ రూం కి.

"...పావనీ మేడం, మిమ్మల్ని ప్రినిస్పాల్ సారు రమ్మంటున్నారు" కబురందించాడు సైదులు. ఒక్క కంగారనిపించింది పావనికి. ఈ టైం లో ఎందుకు పిలిచినట్టో ' అని మనసులో అనుకుంటూ పెన్ను అక్కడే పడేసి గబ గబా బయల్దేరింది. ' మే ఐ కమిన్ సార్ ' వినయం గా అదిగి ప్రినిస్పాల్ రూ లోకి అడుగుపెట్టింది పావని. ' ప్లీజ్ కం ' అని మర్యాదగా లోపలికి ఆహ్వానించారు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ శరత్ గారు. మళ్ళీ టెన్షన్ మొదలైంది పావనికి, ఎంతో అనవసరమైతే తప్ప లేడీ టీచర్స్ ని పర్సనల్ గా పిలవరు ఆయన, చాలా స్ట్రిక్ట్ మనిషి. కొంపదీసి పేరంట్స్ దగ్గర్నుంచి ఏమైనా కంప్లైంటా .. అనుముంది.

"మిసెస్ పావని, కంగ్రాట్స్" అని ప్రిన్స్పాల్ అనగానే ఎంతో రిలీఫ్ కలిగింది. హమ్మయ్య అని తేలిగ్గా ఊపిరి తీసుకుని, ఆయన చెప్పబోయే విషయాన్ని ఆసక్తిగా వినేందుకు రెడీ అయ్యింది.

"మీరు ఈ సంవత్సరం ' ఉత్తమ ఉపాధ్యాయురాలిగా' ఎన్నికయ్యారు, టీచర్స్ డే నాడు మీకు అవార్డు ఇవ్వబడుతుంది., ఇందాకే నాకు మెయిన్ బ్రాంచి నుంచి ఫ్యాక్స్ అందింది" అని ప్రిన్సిపాల్ సార్ చెప్పగానే ఎంతో సంతోషం కలిగింది పావనికి. "థాంక్యూ వెరీమచ్ సార్ అని చిరునవ్వుతో ఆయనకు కృతజ్ఞతలు చెప్పి తిరిగి స్టాఫ్ రూం కి చేరుకుంది. ఆమె చెప్పిన విషయం విన్న స్నేహితులు, కొలీగ్స్ అందరూ ఆమెను మనస్పూర్తిగా అభినందించారు. ఆమెకు మాటల్లో చెప్పలేనంత ఆనందం గా వుంది. ఈ విషయం భర్తకు చెప్పాలని మొబైల్ ఫోన్ తీసింది. కానీ ఫోన్ చేయలేదు. పర్సనల్ గా చెప్పి భర్త నుంచి అభినందనలు అందుకోవాలని ఆశించింది.

ఆమెకు గాల్లో తేలినట్టుగా వుంది. తన కృషికి గుర్తింపు, తను పడిన కష్టానికి ప్రతిఫలం లభించిందన్న ఉద్వేగం ఆమెను నిలువనీయటం లేదు.

సాయంత్రం ఐదింటికల్లా ఇంటికి చేరుకుని, భర్త కార్తీక్ కోసం ఎదురుచూస్తూ పనులు మొదలుపెట్టింది.     నిజానికి పావని కంటే సీనియర్ టీచర్స్ ఎంతోమంది వున్నారు ఆ స్కూల్లో. వారందరికీ కాకుండా ఆమెకే ఈ అవార్డు ముందుగా రావటానికి కారణం కేవలం ఆమె సిన్సియారిటీ హార్డు వర్కు మాత్రమే కాదు... పావని చేసింది మామూలు బి.యి డి ట్రైనింగే అయినా మిగతా అందరి టీచర్స్ లా కాకుండా, ఆ స్కూల్లో జాయినయ్యే కొంతమంది మెంటల్లీ చాలెంజ్డ్ స్టూడెంట్స్ కి కూడా ఎంతో ఓర్పుగా, శ్రద్ధతో పాథాలు చెబుతుంది. క్లాసులో వున్న మామూలు పిల్లలతో పాటుగా, మానసిక పరిస్థితి సరిగా లేని పిల్లలకు కూడా చదువు చెప్పటం తన వృత్తిలో భాగమే అని ఆమె భావిస్తుంది. అందుకే మానసిక వైకల్యం వున్న పిల్లలకు  ప్రేమలో దగ్గరకు తీసి, వారి మీద ప్రత్యేక దృష్టి పెట్టి వారిలో ఆశించిన మార్పు తీసుకువచ్చేందుకు ఎంతో కష్టపడేది.

తన కొలీగ్స్ పావనిని ఎద్దేవా చేసేవారు. "నీకెందుకొచ్చిన తలనొప్పి, వాళ్ళని మార్చినా మార్చకపోయినా నీ శాలరీ నీకు వస్తుంది, ఎందుకు అనవసరం గా టం వేస్ట్ చేస్తావు అని అదేమీ పట్టించుకునేది కాదు పావని. తాను చెప్పే పాఠాలు అందరికీ అర్ధం అవ్వాలంటే.... మానసిక ఆరోజ్యం బాగోలేని పిల్లలలో మార్పు రావాలి. అందుకే, ఎవరేమనుకున్నా, శ్రమ ఎక్కువైనా, వారిని లాలించి, ప్రేమించి తన మాట వినేలా చేసుఓవటం లో సఫలీకృతురాలయ్యేది. అదే, ఆమెకు చిన్న వయసులోనే 'బెస్ట్ టీచఋ అవార్డు అందుకునేలా చేసింది.

మేనేజ్మెంట్ వాళ్ళు తనని గుర్తించినందుకు పొంగిపోయింది పావని. అంతేకాదు అందరూ చిన్న చూపు చూసి నవ్వుకునే తమ పిల్లల్ని చేరదీసి, వాళ్ళల్లో నుంచి మార్పు తీసుకువచ్చినందుకు ఆ పిల్లల తల్లితండ్రులు ఇంటికి వచ్చి మరీ పావనికి కృతజ్ఞతలు చెప్పేవారు.  అన్నీ గుర్తుచేసుకుంటూ, పనులు ముగించుకుని స్నానం చేసింది. ఎందుకో హాల్లో కూర్చుని షోకేసులో వున్న వరున్ ఫోటో వైపు యధాలాపం గా దృష్టి సారించిన ఆమెకు చిన్నగా కలవరం గా అనిపించింది. వరుణ్ గుర్తురాగానే ఆమెలో 'అంతర్మధనం ' మొదలయ్యింది.నిజం గా తను ఈ అవార్డు అందుకోవడానికి అర్హులేనా? అనిపించింది ఆమెకు. కొన్నాళ్ళ క్రితం జరిగిన సంఘటన జ్ఞాపకం వచ్చింది పావనికి.

కార్తీక్ కి ఒక్కగానొక్క అన్నయ్య శ్రీకాంత్, అతని భార్య శ్రావణి. వాళ్ళిద్దరికీ కలిగిన సంతానం వరున్. కార్తీక్, పావనిల పెళ్ళినాటికి వాడికి నాలుగేళ్ళు వుంటాయి.  ముద్దులు మూటగట్టేలా వుంటాడు. వాడంటే అందరికీ ఎంతో ఇష్టం. తమ పెళ్ళయిన ఈ రెండేళ్ళలో వరున్ బాగా దగ్గరయ్యాడు. వాళ్ళుండేది వేరే ఓర్లోనే అయినా తరచూ అన్నదమ్ముళ్ళిద్దరూ కలుసుకుంటూనే వుంటారు. వరుణ్ కూడా వచ్చీరానీ ముద్దు మాటలతో పావనిని పిన్నీ పిన్నీ అని పిలుస్తూ ఆమె వెనకాల తిరుగుతాడు. కార్తీక్, పావని అప్పుడే పిల్లలు వద్దనుకుని ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నారు.

ఇంతలో ఉన్నట్టుండీ ఘోరం జరిగిపోయింది. బైక్ మీద వస్తుండగా జరిగిన యాక్సిడెంట్ లో శ్రీకాంత్, శ్రావణి అక్కడికక్కడే మరణించారు. అదృష్టం కొద్దీ అమ్మాన్నాన్నలతో పోటీ వున్న వరున్ మాత్రం ప్రాణాలతో బైటపడ్డాడు. కానీ.... ఏం లాభం, పాపం తలకి తగిలిన తీవ్రమైన దెబ్బ వల్లో, లేక తల్లితండ్రుల మరణం చూసి తట్టుకోలేకపోవటం వలనో, వరుణ్ కి మతిస్థిమితం తప్పింది.

అప్పట్నుంచీ పిచ్చివాడయిపోయాడు. తనలో తనే నవ్వుకోవటం, బట్టలు చింపుకోవటం, అందర్నీ కొరకటం .. ఇలా రకరకాలుగా ప్రవర్తిస్తుండడం తో వెంటనే కార్తీక్ ట్రీట్మెంట్ ఇప్పించాడు, వరుణ్ కి....

తల్లితండ్రుల్ని మరిపించేలా మరెవరైనా ఎంతో ఓపిగ్గా ఆ పిల్లవాడ్ని ప్రేమించి లాలిస్తే త్వరలోనే కోలుకుంటాడు అని డాక్టర్సు చెప్పటం తో పావనిని అర్ధించాడు కార్తీక్ "ప్లీజ్ పావనీ, మనం వరుణ్ని మన బిడ్డగా పెంచుకుందాం, మనకి పిల్లలు వద్దు" అని

ససేమిరా ఒప్పుకోలేదు పావని. " మతి స్థిమితం లేని పిల్లోడ్ని పూర్తి బాధ్యతగా చూసుకోవడం నా వల్ల కాదు, నాకూ ఒక లైఫ్ వుంది. నాకూ పిల్లలు కావాలి.... నాకేమాత్రం సంబంధం లేదు వరుణ్ విషయం " అని ఖరాకండిగా భర్తతో చెప్పేసింది. చేసేదేమీ లేక వరుణ్ ని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ సమ్రక్షణలో వదిలి వచ్చాడు కార్తీక్. అప్పట్నుంచీ ముభావంగానే వుంటున్నాడు పావనితో. అది గమనించినా, తర్వాత, ఆయనే మళ్ళీ మామూలుగా మారుతారులే అని సరిపెట్టుకుంది పావని. కానీ, ఈ రోజు తనకి అవార్డు ఇవ్వబోతున్నారని తెల్సి ఆనందించినా మనసులో మాత్రం చాలా గిల్టీగా వుంది పావనికి.

చాలాసేపు ఆలోచించిన మీదట ఒక స్థిర నిర్ణయానికి వచ్చింది పావని. తను స్కూల్లో అవార్డు అందుకోవాలంటే వరుణ్ కి తల్లిగా మారాలని దృడం గా అనుకుంది. తన వృత్తి లో ఎంత అంకిత భావం గా పనిచేసి మంచి టీచరు అనిపించికుందో, అలాగే నిజ జీవితం లో కూడా బాధ్యత సక్రమం గా నిర్వర్తించి, భర్తకు అనుకూలవతి అయిన భార్య గా కూడా తన స్థానం పదిలపరుచుకోవడం ఉత్తమమని పావని భావించింది. అంతేకాదు, పల్లెటూరులో తమకు దూరం గా వుంటున్న అత్తగార్ని, మామగార్ని కూడా ఇక్కడికే తీసుకువచ్చి వారి సహకారం తో, తమ ప్రేమతో వరుణ్ ని మామూలుగా చేయాలనీ, ఆ తర్వాతే  తను పిల్లల్ని కనాలా? వద్దా అని విషయం లో భర్త తో సంప్రదించి ఒక నిర్ణయానికి రావాలనీ అనుకున్నాక ఆమె మనసెం తో తేలికైనట్టు ఫీల్ అయ్యింది.

ఆలస్యంగా ఇంటికి వచ్చాడి కార్తీక్, మౌనం గా స్నానం ముగించి, టీవీ ముందు కూర్చున్న భర్త దగ్గరకు వచ్చి తనకు వచ్చిన అవార్డు గురించి చెప్పింది పావని.

"కంగ్రాట్స్" అని పొడిగా అన్నాడు కార్తీక్. భర్త మనసులో బాధ ఆమెకు తెలుసు. తను తీసుకున్న నిర్ణయం గురించి చెప్పింది పావని. ఆనందం తో పావనిని గిరగిరా తిప్పేసి ఆమెను ముద్దులతో ముచెత్తాడు కార్తీక్. వరుణ్ చాలా మొండిగా ప్రవర్తిస్తున్నాడు అని ఇంతక్రితమే ఫోన్ చేశారు వరుణ్ అమ్మమ్మ, తాతయ్య.

పెద్దవాళ్ళయిపోయిన వాళ్ళకు వరుణ్ సమస్యలా మారాడు. ఎలా? అని ఆలోచిస్తూ బయటే తిరుగుతూ ఆలస్యం గా ఇంటికి చేరుకున్న అతడికి పావని చెప్పిన మాట శుభపరిణామం లా తోచింది. అనుకున్నట్టుగానే వరుణ్ ని ఇంటికి తీసుకువచ్చి కన్నతల్లిలా ఆదరించింది. ఓర్పుతో ప్రేమతో అతడి లోని మనోవేదనని దూరం చేసింది. కేవలం రెండు సంవత్సరాల్లోనే పూర్తి ఆరోజ్యవంతుడైనాడు వరుణ్. ఆ తరువాత సంవత్సరం తిరిగే సరికల్లా ముద్దులొలికే ఆడపిల్లకి జన్మనిచ్చింది పావని.

మనకు ఒక బాబు, ఒక పాప... చాలు అని తృప్తిగా చెప్పింది భర్తతో, పాప పుట్టగానే ఇక పిల్లలు వద్దనుకుని ఆపరేషన్ కూడా చేయించేసుకుంది. తను చేస్తున్న వృత్తిలో అంకిత భావం తో పనిచేసి 'మంచి టీచరు" గా అవార్డు అందుకోవటమే కాకుండా, కుటుంబం లో కూడా తన ధర్మం సక్రమం గా నిర్వర్తించి మంచి కోడలిగా, అనుకూలవతి అయిన అర్ధాంగిగా, ఆధర్మ తల్లిలా, మిగతా కుటుంబ సభ్యులందరి మన్ననలను అందుకుంది పావని. అదే ఆమెకు నిజమైన "అవార్డు"

మరిన్ని కథలు
maalaavu yuddham