Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jayajayadevam

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevanam
ఆముక్తమాల్యద

(గతసంచిక తరువాయి)

స్థానికులు తన్ముని దిద్రు
క్షా నందితు లగుచుఁ బురముఁ గైసేసి ప్రజ
ల్తో నరుగ నాగవాసము 
తో నెదురుగ నేఁగి రంత తూర్యములులియన్

విల్లిపుత్తూరు పట్టణ స్థానికులు ఆ ముని(తుల్యుడైన) విష్ణుచిత్తుల దర్శనము చేత ఆనందపడ్డారు. స్థానికులు అంటే దేవస్థాన అధికారులు అని ఒక విశేష అర్ధము కనుక విల్లిపుత్తూరు దేవాలయ  అధికారులు, ఆ పట్టణ సామాన్య ప్రజలు కూడా ఆయనను దర్శించుకుని ఆనందపడ్డారు, తమ  దేవాలయానికి, తమ పట్టణానికి అంతటి కీర్తిని తెచ్చిన మహాభక్తుడు తమ ఊరి వాడైనందుకు. కైసేసి అంటే అలంకరించి అని. ఆయనకు స్వాగత సత్కారాలు చేయడం కోసం పట్టణాన్ని చక్కగా  అలంకరించారు. దేవాలయ అధికారులు పౌరులను వెంటబెట్టుకుని, బోగమువారి మేళముతో  (నాగవాసము) ఎదురేగి, మంగళ వాయిద్యములు మ్రోగుతుండగా స్వాగతం పలికారు.ఇక్కడ పదిహేను వాక్యముల సమ్మిళితమైన ఒక మహా వచనములో ఆ స్వాగతము పలికిన తీరును, ఊరేగింపును గొప్పగా వర్ణన చేశాడురాయలు. రాయల వర్ణనా వైచిత్రికి గొప్ప ఉదాహరణ యిది.

ఎదురేగి, పరివట్టం, పవిత్రమైన తీర్థము, భగవత్ప్రసాదములను కానుకలుగా విష్ణుచిత్తులకు  సమర్పించి సాష్టాంగ దండప్రణామములు చేసి, లేచి, బంగారంతో చేసిన బ్రహ్మరథం పట్టారు. బ్రాహ్మణులచేత లాగబడే రథము బ్రహ్మరథము! ఆ బ్రహ్మరథములో కూర్చోబెట్టి ఊరేగింపుగా తీసుకువెళ్తుంటే ఆ పట్టణవాసులు, చుట్టుప్రక్కల పల్లెలవాళ్ళు వెంట నడిచారు.మృదంగము, తోలుతిత్తి వంటి వాయిద్యము, రుంజ, తంబుర, కంచు తాళాలు, ఉరుమ, కిన్నెర అనబడే తంత్రీ వాయిద్యము, సన్నగాళె, వీణ, ముఖవీణ(మోర్సింగు)పిల్లనగ్రోవి, డోలు, నాగసరం,భేరి, కాహళి,తుడుము, తప్పెట్లు, తాళములు, మొదలైన వాయిద్యములు లెక్కలేనన్ని గొప్పగా మ్రోగుతుండగా నృత్తగీతములు, వాయిద్యములు, నాట్యము అనే మూడువిధములైన మంగళ సూచకములైన కళారూపాలతో ఊరేగింపు జరిగింది. మధ్య మధ్య నాట్యగత్తెలు ఎదురెదురు తిరుగుతూ నాట్యం చేస్తుండగా, దూరపట్టణాలనుండి తెచ్చిన  ఏనుగులు, గుర్రముల కంఠములలోని ఘంటల మ్రోతకు జోడువాయిద్యాల్లాగా సుందరీమణుల అందెలు ధ్వనులు చేస్తుండగా మెల్ల మెల్లగా ఊరేగింపు సాగింది.||

రంగురంగుల కంబళ్ళు కప్పి అలంకరించిన ఆడ మగ ఏనుగులు, బంగారు అంకుశములను ధరించిన మావటివాళ్ళు, దేశ దేశాల రాజులూ, సామంతుల గుంపులను చూసి ఒకరిని ఒకరు అతిక్రమించి  దండాలు పెడుతూ, కండ్లు మెరిసిపోతుండగా ఎదురు తిరిగి తిరిగి పొగడ్తలు చేయడానికి పోటీ  పడుతూండగా బ్రహ్మాండమైన ఊరేగింపు జరిగింది. 

ఆ రాజకుమారులు తమకు, అక్కడి స్త్రీలకు 'పాత పరిచయాలున్నవారు' కావడంచేత పరిహాసంగా బోగం మేళం లోని వేశ్యా స్త్రీలపై వేస్తున్న నెపంతో తమకు గ్రామ గ్రామాల అధికారులు తెచ్చి ఇచ్చిన  నారింజలు, మాదీఫలాలు, నిమ్మపండ్లు, మొల్లల బంతులను అంతకుముందే తాము అనుభవించి  ఆనందించి పరిచయం ఉన్న చంద్రముఖులపై వేస్తూ నడుస్తుండగా సరసంగా ఊరేగింపు జరిగింది.   ఆ పండ్ల, పూల విసురులను తప్పుకుంటూ, సాభిప్రాయమైన, చంచలములైన చూపులను, తొట్రుపాటుతోప్రసరిస్తూ, విశాలమైన కనుల చివరలనుండి చూస్తూ, కొప్పులు తొలిగిపోతుంటే, ఆ సమూహంలో మద్దెలలు వాయిస్తున్న వారి చాటున దాక్కుని మాయమైపోతూ, ఆ పట్టణబోగంమేళంలోని స్త్రీలు,నాగరికులు చూస్తుండగా కోపంవచ్చినట్లు, ఆశ్చర్యాన్ని నటిస్తున్నట్టు, చిత్ర విచిత్ర గతులలో అడుగులేస్తూ మద్దెలలు వాయిస్తున్నవారు వాయించడానికి ముందుకు వంగినప్పుడు ఇక తప్పించుకోలేక కంటబడుతూ,తమమీదికి విసురుతున్న నారింజలు, నిమ్మపండ్లు, పూలు మొదలైనవాటిని వారించడంలో ఆసక్తి లేనట్టు కొప్పులు సవరించుకుంటున్నట్లు నటిస్తూ, చెవులకు ఉన్న ఆభరణాలు కదులుతుండగా,చెక్కిళ్ళపై మల్లెమొగ్గలవంటి నవ్వుల వెన్నెలలు కురిపిస్తున్న కుందనపుబొమ్మల కూర్పుతో ఊరేగింపు సాగింది.ఆ ఊరేగింపులో వస్తున్న వాక్చాతుర్యము గల వ్రుద్ధవేశ్యలను, వారి ప్రక్కన నడుస్తున్న తరుణీమణులను  చూసి, వ్రుద్ధవనితలు నమస్కరిస్తుంటే ఆ యవ్వనవతులు తమకు వీరికి అంతకుముందు కలిగిన సంపర్కాన్ని, పొందును గుర్తు చేసుకుని నమస్కరించకుండా నడవడం చూసి, తమ చుట్టుప్రక్కల తమతమ ప్రభువులు లేకపోవడం వలన సామాన్యజనులను లక్ష్యపెట్టకుండా ' నృత్య గీత వాద్య గాన కళలలో అనుభవమున్నవాళ్ళువయసులో పెద్దవాళ్ళు మీరు నమస్కరిస్తుంటే ఈ లేతజవరాళ్ళు నమస్కరించరేమిటి? వాళ్ళతో నమస్సులు చేయించండి' అని బింకపు సరసాలాడుతూ నడుస్తున్న సరదారాయుళ్ళతోకూడిన సరసపు ఊరేగింపు జరిగింది. చప్పున లేత నవ్వులు మొలుస్తుండగా, ఆ నవ్వును అందంగా అదిమిపడుతూ, ఆ రాకుమారులకు - తమకు చనువు, పరిచయం, సంబంధం ఉన్న కారణంగా తమ తమ గొప్పదనాన్ని ప్రక్కల నడుస్తున్న ఇతర సుందరీమణులకు తెలిసేట్లుగా నిర్లక్ష్యంగా, కొంత ఆశ్చర్యంగా చూస్తూ, ' ఏ .. పో ' అన్నట్లు మూతులు ముడిచి, పెదాలు బిగించి ఈసడింపుగా ధ్వనులు చేస్తున్న యవ్వనవతులైన వారకాంతలను ఆ వృద్ధవేశ్యాస్త్రీలు ' అర్రర్రే! సంపద దొరుకుతున్నది! మన పంట పండబోతున్నది అనే ఉద్దేశంతో 'మన పాలిటి పెన్నిధులు, మన ప్రభువులు, హన్నా! ఏంటానిర్లక్ష్యం? మొక్కండి, మొక్కండి ' అని  ముందుకు నెడుతుండగా ముచ్చటైన ఊరేగింపు సాగింది.  |||

సిగ్గుతో కనులు చలించిపోతుండగా, ఆ వ్రుద్ధస్త్రీలు బలవంతంగా దండాలు పెట్టిస్తుంటే, విరసంగా వ్రేళ్ళు ఎడంగా,ఎడమొగం పెడమొగంగా మొక్కి, ఆ వ్రుద్ధస్త్రీల సల్లాపాలు ఎంతకూ తెగకుండా జిగురుకండెల్లాసాగుతుంటే,గొల్లుమని నవ్వుతున్న ఆ ముసలి స్త్రీలను కపటకోపంతో కొడుతూ, దొంగకోపంతో ఆరాజకుమారులను కడగంటి చూపులు చూస్తూ మాయమవుతున్న ఆ జింకకన్నుల వన్నెలాడుల కరభూషణధ్వనులు  చేస్తున్న క్రేంకారములు ఆ పద్మముఖుల ముఖపరిమళములకు వచ్చి చేరినతుమ్మెదలు చేస్తున్న ఝంకారములను ధిక్కరిస్తుండగా సరసశ్రీకారమైన ఊరేగింపు సాగింది.

చెవులకు సంకుపూసలు, లోపలి వంచుకున్న భుజాలకు  కావిపట్టిన దుప్పట్లు కలిగి, వంకర సిగలతో, వృద్ధాప్యములో స్వస్థలాలను వదిలి, ఆ విల్లిపుత్తూరు చేరుకొని, అక్కడి సజ్జనుల స్నేహము వలన బంధువులను, మిత్రులను మరిచిపోయి, బుక్కాయి చేయడం, పుష్పమాలికలను చేయడం శ్రద్ధగానేర్చుకుని చేస్తున్న, ఆంధ్ర దేశమునుండి వచ్చిన బుక్కాయివాళ్ళు చిన్నిచిన్నపద్యాలతో, స్తోత్రాలతోచేతులుసాచి చేస్తున్న దండాలతో, ఏనుగులు గుర్రాలమీద వస్తున్న రాకుమరులమీద, యువతీమణులమీద కురిపిస్తున్న బుక్కాయి ఆకాశాన్ని కప్పేస్తుండగా, పన్నీటి తిత్తులతో ధారలుగా కురిపిస్తున్నపన్నీటికి వాయిద్యాలు తడిసిపోయి వాటిని వెచ్చన చేయడానికి నిప్పుకోసం వెదుకుతున్న వాద్యగాళ్ళతోకూడిన విశిష్టమైన ఊరేగింపు కొనసాగింది.ఆ సమయంలో సాగుతున్న నాట్యమును చూడడానికి వచ్చి మెల్లమెల్లగా అడుగులేస్తున్న యువతీమణులు తాము, ఆ విటులు సమయాన్ని చూసి, మార్గ మధ్యంలో ఉన్న ఉద్యానవనములలోనివృక్షములను ఒరుసుకుంటూ పారుతున్న కాలువలలోకి దిగారు. ఆ కాలువలలో చెంగలువలు విరబూసి ఉన్నాయి.ఒడ్డున విరగబూసిన రెల్లుపూల తెల్లదనం ప్రతిబింబించి తెల్లగా మనోహరంగా ఉన్నది ఆ కాలువలలోని నీరు.గేదె పెరుగు, మీగడతో దట్టంగా కలిపి, ఉప్పుతో ఎండబెట్టిన నారింజలు, అల్లపు ముక్కలతో కలిపినచద్దిని పోకపొత్తులలో పెట్టుకుని తినడానికి కూర్చున్నారు.|

ఆ తినడానికి కూర్చున్నవారిని తిండి కోసం తిరిగి తిరిగి యాచించే దాసరివాళ్ళ గుంపు 'గోపాల భిక్ష' వేయండి అని అడిగి, ఒడ్డున ఉన్న దీపపు స్తంభాల వద్దకు చేరి తింటున్నారు. ఆ దీపపు స్థంభాలకు ఉన్న కుండీలనుండి పడుతున్న ధగ ధగలాడే దీప జ్వాలల వేడిమికి, కుండీలలో ఉంచిన సాంబ్రాణి కోసం ఉన్న నిప్పులకు వాయిద్యాలు తడిసిపోయిన వాళ్ళు తమ తమ వాయిద్యాలను వేడి చేసుకుని నాదాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆ ధిమి ధిమి ధ్వనులకు కాలువకు ఇవతలివైపు, అవతలివైపు ఉన్నఉద్యానవనములలోని చిలుకలు బెదిరి అటునుండి యిటు, యిటు నుండి అటు అదేపనిగా ఎగురుతూ ఉంటే పచ్చని తోరణాలలాగా కనిపిస్తున్నాయి. వాయిద్యాల సంగీత ధ్వనులకు తలలూపుతూ, చప్పట్లు కొడుతూన్న ధ్వనులుతప్ప పాటలు ఎంతమాత్రమూ వినబడకుండా పోతున్నాయి. ఆ ఊరేగింపును అనుసరించి భాగవతులు మైమరచి వస్తున్నారు.గ్రామాలలో జరిగే సంతలకు వెళ్ళడంకోసం గొప్పింటి వాళ్ళు కొన్న ఆడ గుర్రాలు ప్రసవించిన గుర్రపు పిల్లలు, పొడవాటి త్రాళ్ళచే కట్టబడి, చవిటి నేలలలో పచ్చికను కొరుకుతూ నీడను చూసినా బెదిరిరిపోయే గుర్రపు పిల్లలు చక్కని జీనులచే, గజ్జేలచే అలంకరింపబడి ఉన్నాయి. చలువచేసిన అందమైన తెల్లని వస్త్రాలతో అలంకరించుకున్న సాలెవాళ్ళు, అగసాలేవాళ్ళు(స్వర్ణకారులు)పట్నూలు సాలెవాళ్ళు, పల్లె కోమట్లు,గోనెలు నేసేవాళ్ళు, చాపలు నేసేవాళ్ళు, వారి వారి స్త్రీలు ఆ ఊరేగింపులో గుంపులు గుంపులుగా వస్తున్న ఏనుగులు, గుర్రాలను చూసి బెదిరి ఎత్తి పడేస్తూ, అడ్డు వచ్చిన వాళ్ళను తొక్కుతూ పారిపోతున్న పిల్లగుర్రాల వలన, పల్లీయులు తొక్కిసలాడుతూ ఊరేగింపును ఉత్సవాన్ని చూడకుండానే పారిపోతున్నారు.ఆ తొక్కిసలాటకు ముసలి స్త్రీలు, యువతులు, రోగపీడితులు, బలహీనులు ఇబ్బందిపడుతూ తిట్లు లంకించుకుంటుంటే కిమ్మనకుండా ప్రాణాలు అరచేతులలో పట్టుకుని పారిపోతూ, సమీపంలో ఉన్న దమ్ము చేసిన వరిమళ్లలో దిగబడి, పైకి రాలేక, లోపలి పోలేక సతమతమై పోతున్న వాళ్ళను చూస్తూ చప్పట్లు కొడుతూ పరిహాసం చేస్తూన్న ధ్వనులు చుట్టుప్రక్కలనున్న వనాలలో, ఉపవనాలలో ఉన్న చెట్లలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ విధముగా కొనసాగిన ఊరేగింపులో విష్ణుచిత్తముని వైభోగముగా, దేవాలయ అధికారులు తెచ్చిన స్వర్ణమయమైన రథంలో, పురప్రజలందరూ తోడురాగా గొప్ప ఊరేగింపుగా పట్టణానికి చేరుకొని, దేవాలయము ముందు రథమును దిగి, దేవదేవుడిని సేవించి, స్వర్ణమయమైన తన గృహమును చేరుకొని, పూర్వముకన్నా అధికంగా భగవద్భాగవతపూజా దురంధరుడై కాలాన్ని వెళ్ళబుచ్చసాగాడు. ఆయన వెంట పాండ్యమహారాజు పంపిన రాజులూ, రాజకుమారులు కూడా ఉన్నారు కదా, ఇంతకుముందు కథలో చెప్పిన ప్రకారము. వారు..

ఉలుపా ల్పట్టిన యిండ్ల మజ్జన నృపార్హోదారభుక్తి క్రియో
జ్జ్వలులై రే హరికొల్వునన్ వివిధ లాస్యస్పర్ధి సుభ్రూభ్రుకుం
సులవాదు ల్సరి దీర్చి పుచ్చి మణివాసోభూషణ గ్రామముల్
జలజాతాక్షునకున్ సమర్పణము నిష్ఠం జేసి యవ్వేకువన్

ఉలుపాలు అంటే కానుకలు. కానుకలు తెచ్చినవారి ఇళ్ళలో స్నానము, రాజులకు తగిన భోజనాలను ఆరగించి, వెలిగిపోతూ, రాత్రివేళలో దేవాలయమునందు(హరికొల్వునన్) వివిధ లాస్యములయందు అంటే వివిధ నృత్యరీతులయందు స్పర్ధ పడుతున్న అంటే పోటీపడి, వాదోపవాదాలు చేస్తున్న చక్కని  కనుబొమలు కలిగిన సుందరీమణుల నర్తకీమణుల(సుభ్రూ) నర్తకుల (భ్రుకుంసుల) వివాదాలను చక్కబెట్టి,వారిని శాంతపరచి, ఒప్పించి బహుమతులు ఇచ్చి పంపారు. ఆ తర్వాత జలజాతాక్షుడైన ఆ విల్లిపుత్తూరు మన్ననారు దేవుడికి మణులు, వస్త్రములు, ఆభరణములు, అనేక గ్రామములు నిష్ఠగా, భక్తితోసమర్పించుకుని, ఆ వేకువజాములో ...
ప్రభువు లరిగిరి క్రమ్మఱఁ బాండ్య
నగరికమ్మునియు నట్లు వైష్ణవాభ్యర్చనంబుఁ
దనచిరంతనతులసికాదామకరణ
దాస్యమును జేసికొనుచుఁ దత్పరతనుండె

ఆ ప్రభువులు తిరిగి పాండ్య నగరికి వెళ్ళిపోయారు. ఆ ముని (విష్ణుచిత్తముని) ఆ విధముగా తనకు ఎంతోకాలముగా అలవాటైన తులసీమాలికలు అల్లడం, స్వామికి సమర్పించడం, స్వామికి దాస్యము(కైంకర్యము) చేసుకుంటూ ఆ భగవానునిమీద లగ్నము చేసిన మనసుతో కాలము వెళ్ళబుచ్చుతున్నాడు.                    

**వనం వేంకట వరప్రసాదరావు
మరిన్ని శీర్షికలు
weekly horoscope march 27th to april 2nd