Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vaara phalam

ఈ సంచికలో >> శీర్షికలు >>

పంచారామాలు - జయలక్ష్మి జంపని

Pancharaamalu by Jayalakshmi Jampani

పంచారామాలు ఐదు. ఇవి అన్ని ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాయి.

దితీ దేవి కుమారుడు వజ్రాంగుడు. వజ్రాంగ, వరాంగి దంపతులకు బ్రహ్మ వరము వలన తారకుడు జన్మించాడు. పెరిగి పెద్దవాడయిన తారకుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి శివ వీర్య సంభూతి చే తప్ప అన్యులచే తనకు మృత్యువు లేకుండా వరము పొందెను. అంతటి తో ఆగక శివుని గూర్చి తపస్సు చేసి శివ సాక్షాత్కారము పొందాడు. స్వరక్షణకు పార్ధివ లింగమును ప్రసాదించమని ప్రార్ధించిన, శివుడు పార్ధివ లింగమును ప్రసాదిస్తు గొంతులో ధరించమని ఆనతి ఇచ్చాడు.

తారకుడు వరగర్వముతో దేవతలను, సాధువులను బాధించు చుండెను. దుష్ట తారకుని సంహారార్ధము శివపార్వతుల వివాహము జరిగింది. వారికి కుమారస్వామి జన్మించెను. దేవసేనాని అయిన కుమారస్వామి ఆగ్నేయాస్త్రము తో తారకాసురుని మెడలోని పార్ధివ లింగాన్ని ఇదు ఖండాలుగా చేసెను. ఈ పార్ధివ లింగ భాగములు పడిన ఐదు చోట్ల ఓంకారనాదము తో ప్రతిష్టింపబడెను. ఈ లింగ భాగముల మీద ఆగ్నేయాస్త్రము ఘాతములచే ఏర్పడిన గుర్తులు నేటికీ కనబడుతాయి.

కొన్ని లింగములు పడిన వెంటనే పెరుగుచుండగా చీలలు బిగించి పెరుగుదల ఆపడం జరిగింది. ఈ ఇదు లింగాలను పంచారామాలని పిలుస్తారు. ఇంద్రునిచే ప్రతిష్టించిన లింగ భాగాలను అమరారామమని, దక్షప్రజాపతి చే ప్రతిష్టించిన లింగ భాగాన్ని ద్రాక్షారామమని, కుమారస్వామిచే ప్రతిష్టించిన లింగ భాగాన్ని కుమారారామమని, శ్రీరామునిచే క్షీరకొలను పక్కన ప్రతిష్టించబడిన లింగ భాగాన్ని క్షీరారామమని, చంద్రునిచే ప్రతిష్టించబడిన లింగ భాగాన్ని సోమారామమని  పిలవబడుచున్నవి.

ద్రాక్షారామము
తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకు 32కి. మీ . దూరములో, రాజమండ్రికి 60కి. మీ . దూరములో కలదు . దక్షప్రజాపతి యజ్ఞము గావించుటచే ద్రాక్షారామమని పేరు కలదు.

లింగ రూపములో ఉన్న స్వామివారి పేరు భీమేశ్వరుడు. ఇది స్పటిక లింగము. చాల ఎత్తులో ఉంటుంది. మూల పీఠము నుండి ఎనిమిది అడుగుల పొడవుండును. దక్షప్రజాపతిచే ప్రతిష్టింపబడిన ఈ పుణ్య క్షేత్రము సతీదేవి దేహము చాలించినది. అమ్మవారి పేరు మాణిక్యాంబ ఇచ్చట అమ్మవారి కణితి భాగము పడినది. అష్టాదశ పీఠములలో ఒకటి. భీమేశ్వర లింగము పంచారామాలలో ఒకటి. సప్త గోదావరుల నీరు ఈ దేవాలయము పక్కన అంతర్వాహినిగ ప్రవహిస్తుందని పురాణం గాధ. దీనిని దక్షిణ కాశి అని పిలుస్తారు. దేవాలయము యొక్క రెండవ అంతస్థు నుండి అభిషేకములు, పూజలు జరుగుతాయి. ద్రాక్షారామ భీమేశ్వరుని అనుగ్రహముచే వేములవాడ భీమకవి వాక్సుద్ధి కలవాడయ్యెను. ఈ దేవాలయము దేవతలు నిర్మించారని తెల్లవారిపోయేసరికి ప్రహరీగోడ లోని ఒక మూల పూర్తి కాకుండా నిలిచి పోయిందని చెప్పుదురు. దీనిని ఎన్ని సార్లు కట్టిననూ పడిపోవుచున్నదట. ద్రాక్షారామము భోగానికి, మోక్షానికి, పావనానికి ప్రసిద్ధ పుణ్య క్షేత్రము.
ఆకాశయానం: ద్రాక్షారామానికి దగ్గరగా ఉన్న విమానాశ్రమాలు - హైదరాబాదు, విశాఖపట్టణం, రాజమండ్రి. అక్కడ నుండి బస్సు సౌకర్యం ఉంది.
ట్రైన్ సౌకర్యం: ఇక్కడికి దగ్గర ఉన్న రైల్వే స్టేషన్లు - కాకినాడ, రాజమండ్రి, సామర్లకోట ఇంకా అన్నవరం. అక్కడ నుండి బస్సు సౌకర్యం ఉంది.
రోడ్డు ప్రయాణం: కాకినాడ, రామచంద్రా పురం నుండి నిత్యం తిరుగే బస్సు సౌకర్యం ఉంది, కోటిపల్లి నుండి 28 కీ.మీ. దూరంలో వుండడం వలన, ఇక్కడ నుండి కూడా బస్సు సౌకర్యం బాగుంటుంది.

క్షీరారామము
స్వామి వారు క్షీరా రామలింగేశ్వరుడు. ఈ ఆలయము పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు పట్టణమున కలదు. ఈ పట్టణము నరసాపురానికి 11కి. మీ . దూరములో ఉన్నది. భీమవరానికి 21కి. మీ. దూరములో ఉన్నది. శ్రీ రామునిచే ప్రతిష్టించబడిన లింగము. దేవాలయమునకు ముందు ఉన్న గోపురము చాలా ఎత్తు లో కనుల పండువగా ఉంటుంది. దగ్గరలో రామగుండము అను కొలను లో నీరు తెల్లగా ఉండుటచే ఈ పురమునకు పాల కొలను అను పేరు కలిగి కాలక్రమములో  పాలకొల్లు గా స్థిరపడింది.

పార్వతి పరమేశ్వరులు, లక్ష్మి జనార్దనులు, సరస్వతి బ్రాహ్మలు ఉన్నందున ఈ దేవాలయమునకు త్రిమూర్త్యాలయము అని పేరు. దీనిని హరిహర క్షేత్రమని పిలుస్తారు. లింగము శిరస్సున చిన్న ముడి ఉన్నట్లుగాను, కొమ్ము ఉన్నట్లు గాను కనిపిస్తుంది. లింగము తెలుపు రంగులో ఉంటుంది. ఇచట లింగమును దర్శించిన వారికి దారిద్ర్య బాధ కలుగదని ప్రతీతి.
ఆకాశయానం: పాలకొల్లుకి దగ్గరలో ఉన్న విమానాశ్రయం రాజమండ్రి - ఇది 67 కీ.మీ. దూరంలో ఉంది. అక్కడ నుండి బస్సు సౌకర్యం ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖపట్టణం - 260 కీ.మీ.
ట్రైన్ సౌకర్యం: నర్సాపూర్ - విజయవాడ లైనులో వెళ్ళే రైళ్ళన్నీ పాలకొల్లు మీదుగా వెళతాయి.
రోడ్డు ప్రయాణం: ఎన్-హెచ్- 214 పాలకొల్లు దగ్గరగా వెళుతుంది. ఆంధ్రాలో అన్ని ముఖ్యమైన ఊళ్ళు హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి నుండి ఇక్కడికి బస్సు సౌకర్యం ఉంది.

అమరారామము
అమరావతి గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూక. గుంటూరు నుండి 30 కి. మీ. దూరము. విజయవాడ నుండి కృష్ణా నదిఫై లాంచి మీద చేరవచ్చు. శాతవాహనులు పరిపాలించిన కాలములో అమరావతి రాజధాని ధాన్య కటకము, ధరణికోట అని పేర్లు ఉండేవి. అమరేశ్వర లింగము దేవేంద్రునిచే ప్రతిష్టించబడింది. లింగము పెరుగుటచే చీల కొట్టారని అంతట పెరుగుదల ఆగిపోయిందని చెప్పుదురు. చీల కొట్టినపుడు రక్తము ధారగా కారినట్లు లింగముఫై  కన్పించుచుండును.

చాలా పొడవయిన లింగము. ఫై అంతస్తు ఎక్కి అభిషేకము పూజలు చేయాలి. దేవాలయ ప్రాంగణములో 108 శివలింగములు కలవు అమ్మవారు రాజ్యలక్ష్మి. బాల చాముండిక అను పేరు కూడా కలదు. ఇక్కడ ఏకాదశ రుద్రాభిషేకము ప్రత్యేకత. అమరావతి స్థూపము దగ్గరలో కలదు. మ్యూజియం కలదు. ఇది బౌద్ధ క్షేత్రము.
ఆకాశయానం: గన్నవరం విమానాశ్రమం 75 కీ.మీ. దూరంలో ఉంది - ఇది విజయవాడ - హైదరాబాద్, విజయవాడ - విశాఖపట్టణం ప్రయాణానికి సౌకర్యంగా ఉంటుంది.
ట్రైన్ సౌకర్యం: గుంటూరు దక్షిణ-మధ్య రైల్వే వారి అతిముఖ్యమైన రైల్వే జంక్షన్ ఇది. దేశం పలుమూలల నుండి ఇక్కడకు రైళ్ళు నడుస్తాయి.
రోడ్డు ప్రయాణం: రాష్ట్రం పలుమూలల నుండి అన్ని విధాల బస్సు సౌకర్యం ఉండడమే కాకుండా, బెంగళూరు, చెన్నై వంటి పొరుగు రాష్ట్రరాజధానుల నుండి కూడా బస్సు సౌకర్యం ఉంది.

కుమారారామము
లింగము కుమారస్వామి లేక భీమేశ్వరుడు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు 13కి . మీ . దూరములో సామర్ల కోట నందు కలదు. చాళుక్య రాజులలో ఒకడగు భీమునికి రాజధానిగా ఉండుటచే ఈ ప్రాంతమును భీమవరమని పేరు. శివుడు చాళుక్య భీమేశ్వరుడు, శివ కుమారుడయిన కుమారస్వామిచే పూజలందుకున్నది కావున కుమారారమమని పేరు వచ్చింది. దీనిని స్కంధరామమని కూడా అంటారు. ఇక్కడ కూడా లింగము చాల పెద్దది. అమ్మవారు శ్యామల దేవి.
ఆకాశయానం: సామర్లకోటకి దగ్గరలో ఉన్న విమానాశ్రయం రాజమండ్రి - ఇది 60 కీ.మీ. దూరంలో ఉంది. అక్కడ నుండి బస్సు సౌకర్యం ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖపట్టణం - 192 కీ.మీ.
ట్రైన్ సౌకర్యం: చెన్నయ్-హౌరా రైల్వే లైనులో సామర్లకోట ముఖ్యమైన జంక్షను. కాకినాడకు వెళ్ళవలసిన వారికి ఇది ముఖ్యమైన రైల్వే స్టేషను అని చెప్పవచ్చు.
రోడ్డు ప్రయాణం: ఆంధ్రప్రదేశం నుండి అన్ని ముఖ్యమైన పట్టణాలనుండి కూడా సామర్లకోటకి బస్సు సౌకర్యం ఉంది. కాకినాడ నుండి ప్రతి గంటకు ఒక బస్సు లభ్యం.

సోమారామము
ఈ క్షేత్రము భీమవరము పట్టణములోని గునిపూడి గ్రామములో కలదు. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరస్సపురానికి 32 కి . మీ . దూరములో కలదు . ఇచట లింగము చంద్రునిచే ప్రతిష్టించబడింది కావున సోమేశ్వర లింగమని పేరు. లింగము ఫై అన్ని కళలు కనిపించును అమావాస్య రోజున నలుపు రంగు గాను, పౌర్ణమి రోజున తెలుపు రంగుగాను కనిపించును. ఈ లింగమును ప్రార్ధించిన వారికి సర్వ వ్యాధులు తోలగునని పంచ మహా పాపములు హరిన్చునాని నమ్మిక.
ఆకాశయానం: భీమవరానికి దగ్గరలో ఉన్న విమానాశ్రయం రాజమండ్రి - ఇది 110 కీ.మీ. దూరంలో ఉంది. అక్కడ నుండి బస్సు సౌకర్యం ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖపట్టణం - 270 కీ.మీ.
ట్రైన్ సౌకర్యం: నర్సాపూర్ - నిడదవోలు లైను, నర్శాపూర్ - విజయవాడ రైల్వే లైనులో వెళ్ళే రైళ్ళన్నీ భీమవరం మీదుగా వెళ్ళతాయి.
రోడ్డు ప్రయాణం: ఎన్-హెచ్- 214 (కత్తిపాడు-పామర్రు) భీమవరం పట్టణంమీదుగా వెళుతుంది. ఆంధ్రాలో అన్ని ముఖ్యమైన ఊళ్ళ నుండే కాకుండా, చెన్నై, బెంగుళూరు, పూరి, ముంబై, హౌరా, నగర్సోల్ నగరాల నుండి కూడా భీమవరానికి బస్సు సౌకర్యం ఉన్నది.

మరిన్ని శీర్షికలు
Senior Citizens and Internet by Bhamidipati