'ఈ రోజుల్లో', 'బస్టాప్' లాంటి చిన్న సినిమాలతో చిలిపి సినిమాలతో హిట్స్ కొట్టిన డైరెక్టర్ మారుతి, 'ప్రేమకథా చిత్రమ్', 'భలే భలే మగాడివోయ్' చిత్రాలతో ట్రెండ్ మార్చాడు. ఈ డైరెక్టర్ తొలిసారిగా ఓ స్టార్ హీరోతో సినిమా చేస్తున్నాడనగానే ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది. అయితే కొన్ని కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది. అదే హీరోతో మారుతి మళ్ళీ ఇంకో సినిమా స్టార్ట్ చేశాడు. ఆ హీరో ఎవరో కాదు, విక్టరీ వెంకటేష్. మొదట ఈ కాంబినేషన్లో 'రాధ' అనే సినిమా వార్తల్లోకెక్కింది. అందులో వెంకటేష్ పొలిటికల్ లీడర్లా కనిపించాల్సి ఉంది.
అయితే ఆ కథ పక్కన పెట్టి ఇంకో ఫ్యామిలీ ఎంటర్టైనర్ని మారుతి టేకప్ చేశాడు. ఫ్యామిలీ ఆడియన్స్లో వెంకటేష్కి చాలా ఫాలోయింగ్ ఉంది. దానికి తగ్గట్టే వెంకటేష్తో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ని మారుతి తెరకెక్కిస్తున్నాడట. ఈ సినిమా ప్రారంభోత్సవంలోనే, సినిమాకి హిట్ కళ కనిపిస్తుందని సినీ రంగంలోని ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార ఎంపికైంది. చాలా రోజుల తర్వాత నయనతార తెలుగులో సైన్ చేసిన సినిమా ఇదే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'లక్ష్మి', 'తులసి' సినిమాలు ఘనవిజయం సాధించాయి. ఆ సెంటిమెంట్ కూడా ఇప్పుడు కలిసొచ్చేలా ఉంది. సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రధమార్ధంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని డైరెక్టర్ మారుతి చెప్పారు. ఈ సినిమాలో వెంకటేష్ న్యూలుక్లో కనిపించనున్నారట.
|