నాగార్జున ప్రధాన పాత్రలో 'మన్మధుడు 2' మూవీ పట్టాలెక్కేసింది. ఇటీవలే లాంఛనంగా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయిన ఈ సినిమాకి యంగ్ హీరో కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. 'చిలసౌ' సినిమాతో డైరెక్టర్గా పరిచయమైన రాహుల్ రవీంద్రన్ ఆ సినిమా టైంలోనే నాగార్జునతో సినిమా చేస్తానని మాట తీసుకున్నాడట. ఆ మాట ప్రకారం 'మన్మధుడు 2'ని టేకప్ చేశాడు. గతంలో వచ్చిన 'మన్మధుడు' సినిమా ఇప్పటికీ ఎంతో ఫ్రెష్గా హెల్దీ కామెడీతో అందర్నీ ఆకట్టుకుంటుంది. విజయ్భాస్కర్ టేకింగ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు గుక్క తిప్పుకోకుండా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేశాయి. అలాంటి ఓ క్లాసిక్ హిట్ని టచ్ చేయాలంటే చాలా డేరింగ్ ఉండాలి. ఎంత నమ్మకం లేకపోతే నాగార్జున అంత క్రిటికల్ ప్రాజెక్ట్ని రాహుల్ చేతిలో పెట్టి ఉంటాడు.
అందుకే తనకి అప్పగించిన ఈ బాధ్యతను సద్వినియోగం చేసుకునే దిశగా రాహుల్ కష్టపడుతున్నాడు. ఒరిజినల్ ఫ్లేవర్కి ఎంతమాత్రమూ డ్యామేజ్ కాకుండా ఈ సీక్వెల్కి స్క్రిప్టు సిద్ధం చేశాడట రాహుల్ రవీంద్రన్. స్క్రిప్టులోని ప్రతీ పార్ట్ బాగా నచ్చడంతోనే నాగార్జున వెంటనే ఈ సినిమాని పట్టాలెక్కించేశాడు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, నాగ్కి జోడీగా నటిస్తోంది. ఇదిలా ఉంటే, తొలి పార్ట్లో హీరోయిన్గా నటించిన సోనాలీ బింద్రేని ఈ సినిమాలో కూడా ఓ గెస్ట్ రోల్ కోసం తీసుకొచ్చేందుకు నాగార్జున ఆలోచిస్తున్నాడనీ తెలుస్తోంది.
|