బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోకి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న మెగా బ్రదర్ నాగబాబు, ఎమ్యెల్యే రోజా ఆఫ్ స్క్రీన్ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీకి దిగనున్నారు. నగిరి నియోజకవర్గం నుండి వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు రోజా. సో ఆమె గెలుపుపై ఎలాంటి అనుమానాలూ లేవు. కానీ నాగబాబు ప్రత్యక్ష రాజకీయాలకు కొత్త. ఇటీవలే తమ్ముడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన కండువా కప్పుకున్నారు నాగబాబు. నర్సాపురం నుండి లోక్సభకు ఎంపీగా పోటీ చేస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ టైంలో ప్రచారంలో పాల్గొన్న నాగబాబు, తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
మళ్లీ ఇన్నాళ్ల తర్వాత రాజకీయ తీర్ధం పుచ్చుకున్నారు. ఏది ఏమైతేనేం చెరో పార్టీ నుండి ఎన్నికల బరిలో దిగుతున్న ఈ ఇద్దరూ గెలిచి, మళ్లీ జబర్దస్త్ వేదికపై కూర్చుంటే, ఆ కాంబినేషన్కి వచ్చే కిక్కే వేరప్పా. ఒకరు ఎమ్యెల్యే, ఇంకొకరు ఎంపీ ఈ షో వేల్యూనే మారిపోతుంది. నవ్వుల నవాబు నాగబాబు కాస్తా ఎంపీ నాగబాబుగా అభివర్ణించబడతారు. పాలిటిక్స్ నిమిత్తం ప్రత్యర్ధులుగా ఉన్న వీరిద్దరూ జబర్దస్త్ వేదికపై మాత్రం నవ్వుల రాజు, నవ్వుల రాణిగా ఎంటర్టైన్ చేయడం విశేషం. అయితే ఓ పక్క సినిమాలూ, ఇంకో పక్క రాజకీయాలూ ఇలా ఎంత బిజీగా ఉన్నా కానీ జబర్దస్త్ షోని మాత్రం వీడనని ఈ ఇద్దరూ చెప్పడం కొసమెరుపు.
|