ప్రముఖ రచయిత రావూరి భరద్వాజకు ఇటీవల ప్రతిష్టాత్మక జ్ఞాన్పీఠ్ అవార్డు దక్కింది. ఆయన రాసిన ‘పాకుడురాళ్ళు’ నవలకు ఈ అవార్డు దక్కగా, అప్పటివరకూ రావూరి భరద్వాజ అంటే ఎవరో తెలియనివారు కూడా ఆయన గురించి గొప్పగా మాట్లాడుకున్నారు. ఎప్పుడో రాసిన ఆ నవలకు చాలా లేటుగా అరుదైన గుర్తింపు దక్కింది. అతని పేరును వార్తల్లో చేర్చింది.
తనకు దక్కిన ఈ అరుదైన గౌరవం గురించి చాలా ఇంటర్వ్యూల్లో చాలా రకాలుగా మాట్లాడుతూ ఆనందం వెలిబుచ్చారు రావూరి భరద్వాజ. ఇంకా జీవితంలో సాధించాల్సింది ఏమైనా ఉందా? అన్న ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ‘టార్గెట్ నోబెల్’. సాహిత్యంలో నోబెల్ బహుమతి మన తెలుగువాడికి దక్కితే అంతకన్నా గర్వకారణం ఏముంటుంది?
కాని, తెలుగు రచనకు నోబెల్ బహుమతి దక్కడం చాలా కష్టం. బెంగాలీ రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ బహుమతి దక్కగా, అప్పట్లో బెంగాలీ జాతీయ భాష కాకపోయినా అంతలా ప్రాచుర్యం పొందేది. దాంతో రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ బహుమతి దక్కిందని చెప్పవచ్చును. ఓ దేశంలోని ఓ ప్రాంతీయ భాషలో రచనకు నోబెల్ బహుమతి దక్కితే అద్భుతం.
ఆ అద్భుతం మన తెలుగువాడు సాధిస్తే అంతకన్నా అద్భుతం. ఆ అద్భుతాన్ని రావూరి భరద్వాజ సాధిస్తే అది మహాద్భుతం అవుతుంది. అసాధ్యం అని కొందరు అభిప్రాయపడుతున్నా, రావూరి ఆ ఘనతను సాధించాలంటున్నారు అతని రచనలకు ముగ్ధులవుతున్నవారు.
|