త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో మహేష్ హీరోగా వచ్చిన ‘అతడు’ సినిమాలో ఓ పూజారి ఇంటికి వెళ్ళి హీరో, ఆ పూజారికి తెలియకుండా డబ్బు సహాయం చేస్తాడు. రాత్రి వేళ కమెడియన్ సునీల్తో పూజారి ఇంటికి వెళ్ళి పూజారి ఇంట్లోని చెట్టు వద్ద డబ్బులు పెట్టి వస్తాడు మహేష్. ఆ సన్నివేశం గురించి ఆ తర్వాత సునీల్, మహేష్తో చర్చించే సన్నివేశం హృద్యంగా వుంటుంది.
ఆ సన్నివేశం, ఓ తెలుగు నవల నుంచి తీసుకున్నదే. మధుబాబు అనే ప్రముఖ నవలా రచయిత రాసుకున్న ఓ నవలలోనిది ఆ సన్నివేశం. ఆ సన్నివేశం తనను బాగా ఇన్స్పయిర్ చేసిందనీ, అందుకే ఆ సన్నివేశాన్ని తన సినిమాలో పెట్టుకుంటానని నవలా రచయిత మధుబాబుని కోరాడట దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
దానికి మధుబాబు అభ్యంతరం చెప్పలేదు సరికదా, రాయల్టీ కింద కొంతమొత్తం చెల్లించాలనే నిబంధనలూ పెట్టలేదు. సింపుల్గా సన్నివేశాల్ని పుస్తకాల్లోంచీ, సినిమాల్లోంచీ లేపేసేవారు చాలామంది వుంటారు. కానీ, త్రివిక్రమ్ అలా చేయలేదు. తమ సన్నివేశాల్ని కాపీ కొట్టారంటూ కోట్లు డిమాండ్ చేస్తారు కొందరు. మధుబాబూ అలా చేయలేదు.
త్రివిక్రమ్ హుందాతనం, మధుబాబు ఔదార్యం.. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయాలు.
|