Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
pounch patas

ఈ సంచికలో >> శీర్షికలు >>

పంచ ప్రయాగలు - కర్రా నాగలక్ష్మి

పంచ ప్రయాగలు 

కలియుగంలో మానవులు పాపవిముక్తి కొరకు దర్శంచ దగ్గ స్థలాలు యేమిటి అని శుక మహర్షిని శౌనికాది మునులు అడుగగా అతను పంచపురములు , పంచ ధారలు , పంచ కేదారాలు , పంచ బదరీలు , పంచ శిలలు , పంచ ప్రయాగలు అని శలవిచ్చేడుట . 

ఆది కాలం నుంచి సంగమ ప్రదేశాలలో చేసే శ్రార్ధకర్మలు , దానధర్మాలు వేలరెట్ల ఫలితాలనిస్తుందని హిందువుల నమ్మకం .

ఇవాళ మనం పంచ ప్రయాగల గురించి తెలుసుకుందాం .


భగీరథుడు తన పూర్వజులకు ఉత్తమ గతుల ప్రాప్తి కొరకు గంగను భూమి పైకి తెచ్చేందుకు ఘోరమైన తపస్సు చేస్తాడు . అతని తపస్సుకు మెచ్చిన గంగ భూమి మీదకు రావడానికి సమ్మతించి తన ధాటికి శివుడు మాత్రమే తట్టుకోగలడు కాబట్టి శివుని ప్రసన్నుని చేసుకొమ్మని సలహా యిస్తుంది . భగీరథుడు శివుని ప్రసన్నుని చేసుకొని గంగను దివి నుండి భువికి రమ్మని అర్ధిస్తాడు . అప్పుడు గంగ దివినుండి శివుని శిరస్సు పైకి దూకగా శివుడు గంగను తనఝటాఝూటంలో బంధంచి ఒక్క పాయ  మాత్రమే భూమి పైకి విడిచి పెడతాడు . ఆ వేగానికి కూడా భూ దేవి తట్టుకోలేదని తలచిన గంగ ఆ పాయను ఆరు సెలయేళ్లుగా మార్చి భూమి మీదకు వచ్చిందట . సగరపుతృలకు పుణ్యగతులు కల్పించడానికి వారి భస్మాలను తనలో కలుపు కొనేందుకు యిలా ఆరుపాయలగా గంగ అవతరించెనని మరో కథ . ఈ సంగమాలలో యిచ్చే తర్పణాల వలన మరణించినవారికి పుణ్యగతులు కలుగుతాయని హిందువుల నమ్మకం .తిరిగి ఆ ఆరు నదులు కలసి గంగ గా మారి భగీరథుని కోర్కె తీర్చి మనదేశంలో యెన్నో వేల యెకరాల గుండా ప్రవహించి భక్తుల పాపాలను కడిగి , భక్తుల పూజలందుకుంటోంది . ప్రయాగ అంటే నది వేరొక నదితో సంగమించిన ప్రదేశం అని అర్ధం . ఉత్తరాఖంఢ్ లోని గంగోత్రి అనే హిమనీనదము నుండి పుట్టిన భగీరథి ( భగీరథుని కొరకై పుట్టింది కాబట్టి భగీరథి అయింది ) అదే రాష్ట్రంలో వున్న దేవ ప్రయాగ దగ్గర అలకనందతో సంగమించి గంగ గా పిలువ బడుతుంది . భగీరథి గంగ గా మారే క్రమంలో యే యే నదులతో సంగమించినది , యేయే ప్రదేశాలలో సంగమించినది , ఆయా ప్రదేశాలలో చూడదగ్గ వాటి గురించి తెలుసు కుందాం . బదరీ నాధ్ నుంచి కిందకి వచ్చేటప్పుడు దారిలో వచ్చే ప్రయాగల క్రమం లోనే తెలుసుకుందాం .

1) విష్ణుప్రయాగ , 2) నందప్రయాగ , 3) కర్ణప్రయాగ , 4) రుద్రప్రయాగ , 5) దేవప్రయా

1) విష్ణు ప్రయాగ ---

హిమాలయాలలో వున్న త్రిమూర్తులకు ప్రతీకగా భూమి పై యేర్పడ్డ త్రిభుజాకార హిమనీనదమైన " సతోపంత్ " లో పుట్టిన ' అలకనంద ' నది వురుకులు పరుగులతో బదరీనాథుని పాదాలను తాకి దిగువకు ప్రవహిస్తూ  చిన్న చిన్న సెలయేళ్లని తనలో కలుపుతుంటూ ప్రవహిస్తూ జోషిమఠ్ దాటి పన్నెండు కిలోమీటర్లు ప్రవహించి విష్ణుప్రయాగ దగ్గర ధౌళి గంగతో కలసి అలకనందగా దిగువకు ప్రవహిస్తుంది  ధౌళి గంగ ' నితిపాస్ ' లో పుట్టి తెల్లని రంగులో పడమట వైపునుండి వురుకులు పరుగులతో వచ్చి విష్ణుప్రయాగ దగ్గర అలకనందతో సంగమించి తన ఉనికిని పోగొట్టు కుంటుంది . అలకనంద నీరు నీలం రంగులోను , ధౌళిగంగ తెల్లటి రంగులోను వచ్చి కలిసే దృశ్యం అద్భతంగా వుంటుంది . యెనిమిది సంవత్సరాల కిందట యిక్కడ రెండు యిళ్లు కూడావుండేవి కావు . సంగమం దగ్గర 1889 లో అహల్యాబాయి హోల్కర్ చే కట్టబడ్డ యెనిమిది భుజాలు కలిగిన కట్టడం వుంది . 2013 లో వచ్చిన వరదలు ఈ కట్టడానికి యే విధమైన క్షతిని కలుగజెయ్యలేదు . అక్కడనుంచి మెట్లదారి గుండా దిగి సంగమం చేరుకున్న భక్తులు తమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటారు .ఈ ప్రదేశంలో నారదుడు చేసిన ఘోర తపస్సునకు మెచ్చి విష్ణుమూర్తి దర్శన మిచ్చిన ప్రదేశం కాబట్టి ఈ ప్రాంతాన్ని విష్ణుప్రయాగ గా పిలువబడుతోంది . ఈ ప్రదేశంలో అనగా సుమారు 25 కిలోమీటర్ల అలకనంద విష్ణుగంగ గా పిలువబడుతోంది .ప్రస్తుతం యిక్కడ 400ంవ్ శక్తి గల హైడ్రో ఎలట్రికల్ పవర్ ప్లాంటు ఒక ప్రైవేటు సంస్థ ద్వారా నడుపబడడంతో యిక్కడ పదుల సంఖ్యలోగల యిళ్లతో కాలనీ వెలిసింది . 

2 ) నందప్రయాగ ----

విష్ణు ప్రయాగ నుంచి సుమారు 60 లేక 70 కిలోమీటర్లు ప్రయాణించిన తరవాత నంద ప్రయాగ చేరుతాం . పూర్వం యిది యదువంశ రాజ్యముఖ్య పట్టణంగా వుండేదిట . ఈ ప్రాంతంలో నందుడు విష్ణుమూర్తి గురించి యాగం నిర్వహించి అతనిని తన పుతృనిగా పొందే వరం పొందిన ప్రదేశం . నందుడు యాగం నిర్వహించిన ప్రదేశంలో చిన్న కోవెల నిర్మించి అందులో బాల క్రిష్ణునికి పూజలు నిర్వహిస్తున్నారు . రిషికేశ్ బదరీనాధ్ రోడ్డుపైనే వుంటుంది యీకోవెల . నందమందిరం అని స్థానికులు పిలుస్తారు .అలకనంద , నందాదేవి అభయారణ్యంలోని  ' నంద గుంట ' నుండి పుట్టిన నందాకిని నదితో కలిసే ప్రదేశం యిది . యిక్కడ నందాకిని తనవునికిని పోగొట్టు కుని అలకనందగా దిగివకు ప్రవహిస్తోంది .ఈ నదులు  వేరువేరు రంగుల నీళ్లతో ప్రవహించి రెండు నదులూ కలిసి కిందకి ప్రవహించడం ఒక అద్భుతం . ఇక్కడ కణ్వ మహర్షి ఆశ్రమం వుండేదట . ఇక్కడే శకుంతల దుష్యంతుల వివాహం జరిగిన ప్రదేశం గా కూడా చెప్తారు .

3 ) కర్ణ ప్రయాగ ---
నందప్రయాగ నుంచి సుమారు యెనభై కిలో మీటర్లు ప్రయాణించిన తరువాత ఈ ప్రదేశంచేరుకుంటాం . భాగేశ్వర్ దగ్గర పిండారి హిమనీనదములో పుట్టిన పిండారి గంగ అలకనందతో సంగమించిన ప్రదేశమే కర్ణప్రయాగ . పిండారి గంగ పై నిర్మించిన వంతెన వస్తుంది .., కుడి వైపున నదీ సంగమం చూడొచ్చు . వంతెనకి అటుపక్కన దుర్గాదేవి మందిరం చిన్న గుట్టమీద వుంది . అదే కర్ణుని సమాధి స్థలం కూడా .వంతెన కు యిటుపక్క టాక్సీస్టాండు వుంటుంది దానికి యెదురుగా వున్న కొండపై కర్ణుడు తపస్సు చేసుకున్నప్రదేశం వస్తుంది .   కర్ణుడు సూర్యుని కొరకై తపస్సు చేసి కవచకుండలాలు యిక్కడ పొందేడుట .మహాభారత యుద్ధం లో కవచకుండలాలను ఇంద్రునకు దానంగా యిచ్చి , రథ చక్రం విరిగి కిందపడిపోయిన కర్ణుని పైకి కృష్ణుని సలహా మేరకు అర్జునుడు  " అంజాలిక " అస్త్రాన్ని ప్రయోగిస్తాడు . కాని " అంజాలిక "  కర్ణుని దగ్గరకు చేరనీయకుండా అతను చేసుకున్న పుణ్యం ఫలితంగా యముడు అతనికి కాపలాగా వుంటాడు . విషయం గ్రహించిన కృష్ణుడు వృధ్ద బ్రాహ్మణ వేషధారియై కర్ణుని పుణ్యం దానంగా అడుగుతాడు . వృధ్దబ్రాహ్మణుని సాక్షాత్తు కృష్ణునిగా గుర్తించిన కర్ణుడు తన శరీరానికి ఉత్తరక్రియలు అలకనంద పిండారిగంగల సంగమ ప్రదేశం లో జరిపించవలసినదిగా కోరి , తన పుణ్యాన్ని దానం యిచ్చెస్తాడు . కర్ణునకు శ్రీకృష్ణుడు విశ్వరూప దర్శనం యిస్తాడు . పుణ్యం లేకపోవడంతో యముని రక్షణ వలయం మాయమౌతుంది . అంజాలిక అస్త్రం కర్ణుని ప్రాణాలను తీసుకుంటుంది . మహాభారత యుధ్దానంతరము కర్ణునకు యిచ్చిన మాట ప్రకారము కృష్ణుడు కర్ణుని శరీరమునకు కర్మకాండలు యీ ప్రదేశంలో చేస్తాడు . ఈ రెండు చోట్ల చిన్న కోవెలలు వున్నాయి . ఎవరో బాబాలు అక్కడ నివసిస్తున్నారు .వివేకానందుడు అతని గురువారం తురియానందజీ , అఖరానందజీ లతో యీ ప్రదేశం లో పద్ధెనిమిది రోజులు  తపస్సు చేసుకున్నాడట . పిండారి గంగ వంతెన దాటేక రోడ్డు రెండుగా చీలుతుంది . యెడమ వైపున వున్న దారి ' రాణీఖేత్ ' వెళ్లేదారి , ఆ దారిలో సుమారు పదిహేడు కిలో మీటర్లు వెడితే రోడ్డుకి దగ్గరగా ' ఆది బదరి ' ఆలయసముదాయాన్ని చూడొచ్చు .


రుద్రప్రయాగ --

కర్ణప్రయాగ నుంచి సుమారు ముప్పైరెండు కిలో మీటర్ల ప్రయాణానంతరం రుద్రప్రయాగ చేరుకుంటాం . ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లా ముఖ్యకేంద్రమైన రుద్రప్రయాగ కేదార్ నాధ్ వెళ్లే యాత్రీకులకు , బదరీనాధ్ వెళ్లే యాత్రీకులకు ముఖ్యకూడలి . ఇక్కడ భోజన , వసతి సౌకర్యాలు వున్నాయి . సంవత్సరంలో ఆరునెలలు భక్తులతో రద్దీ గా వుంటుంది .కేదారనాధ్ దగ్గర వున్న " చోరాబారి " అనే హిమనీనదములో పుట్టిన మందాకిని అలకనందతో రుద్రప్రయాగ దగ్గర సంగమించింది .ఎత్తైన మెట్లు దిగి కిందకి వెళితే సంగమ ప్రదేశం చేరుకోవచ్చు . సంగమానికి వెళ్లేదారిలో నారదశిల వుంటుంది . ఇక్కడ నారదుడు శివుని కొరకై తపస్సు చేసి శివుని వద్ద సంగీతం నేర్చుకుంటాడు . ఈ ప్రదేశంలో శివుడు రుద్రనాధుడుగా పూజింప బడుతున్నాడు . రుద్రనాధుని కి కోవెలకు యెదురుగా చిన్న గుట్టమీద చాముండా దేవి కోవెలను చూడొచ్చు . పక్కగా వున్న కాలిబాటన వెళితే చిన్న గుహ అందులో కోటి లింగేశ్వరుని దర్శించుకోవచ్చు .

దేవప్రయాగ ---

రుద్రప్రయాగ నుంచి సుమారు నలబ్బై కిలో మీటర్ల పయాణం తరువాత మనం దేవప్రయాగ చేరుకుంటాం .పూర్వం దేవశర్మ అనే ముని యీ ప్రదేశమ లో తపస్సు చేసుకున్నందువలన యీ వూరికి దేవప్రయాగ అని పేరు వచ్చిందని ఒక కథ , దేవప్రయాగ అంటే దేవతలు కలిసే చోటు అని అర్ధం కాబట్టి ఈ ప్రదేశం సర్వదేవతలు నివాసస్థలం అని కొందరి కథనం .ఎవరు యేవిధంగా నిర్వచించినా యిక్కడి ప్రకృతి మనలని మంత్ర ముగ్ధులను చేస్తుంది అనడంలో అతిశయోక్తి యేమీ లేదు . చుట్టూరా యెత్తైన కొండలు , ఒకవైపున అలకనంద వురుకులు పరుగులతో  వచ్చి , గోముఖ్ దగ్గర గంగోత్రి హిమనీనదములో పుట్టిన భగీరథి ( మొదటి పేరాలో భగీరథి కథ వివరించేను) తో కలిసి ' గంగ ' గా అవతరించి దిగువకు ప్రవహించడం ఒక అద్భుతాన్ని తలపింపకమానదు . రెండునదుల సంగమ ప్రదేశంలో 'తొండేశ్వర మహదేవ్ ' మందిరం వుంది . ఈ సంగమాన్ని అత్తాకోడళ్ల సంగమం అనికూడా అంటారు . అలకనంద మహాలక్ష్మి స్వరూపమని , భగీరథి స్వయంగా శివుని పత్ని అని , యింట్లో అత్తాకోడళ్ల తగవులు యెక్కువగా వున్నవాళ్లు యిక్కడ పూజలు చేసుకుంటే వారి సంబంధం లో మంచిమార్పులు చోటుచేసుకుంటాయని యిక్కడి వారి నమ్మకం . ఫొటోలో వున్న విధంగా అరుగులు కట్టి 2013 కి పూర్వం వుండేది .  2013 లో వచ్చిన వరదలలో అన్నీ కొట్టుకు పోయేయి . ప్రస్తుతం యిలాంటివి లేవు . ఇక్కడి ప్రభుత్వం యిలాంటివి తిరిగి నిర్మించ యాత్రీకులకు సంగమాన్ని దర్శించుకొని పూజలు నిర్వహించే సదుపాయం కలిగిస్తుందని ఆశిద్దాం .

దేవప్రయాగలో వున్న రఘునాధ్ మందిరం వైష్ణవుల పవిత్రమైన 108 దివ్యదేశాలలో 106 దివ్యదేశం గా లెక్కిస్తారు . రావణాబ్రహ్మ ను సంహరించిన పాప పరిహార్ధమై రాముడు తపస్సు చేసుకున్న ప్రదేశం . 

పుండాల్ గ్రామంలో వున్న మాతా భువనేశ్వరి మందిరం , ధ్యానేశ్వర్ మహదేవ్ , దండనాగరాజు ,చంద్రబదనీ దేవి మందిరాలు చూడతగ్గవి .1946 పండిట్ చక్రధరజోషీ చేసి నిర్మించబడ్డ నక్షత్రశాల , సూర్యఘంట , ధృవఘంట దశరధాంచల్ కొండపై వున్నాయి . దేశ విదేశాలనుంచి సేకరించిన గ్రహగతులకు సంబంధించిన అనేక గ్రంథాలు యిక్కడ నిక్షిప్తం చెయ్యబడ్డాయి . ఇక్కడ యాత్రీకులకు వుండడానికి గదులు భోజనసదుపాయాలు వున్నాయి .ఇక్కడి పండాలు ( ఆదిశంకరుల వారిచే యీ ప్రాంతాలలో పూజాది కార్యక్రమాలకై నియమింప బడ్డవారు ) యేడాదిలో ఆరునెలలు బదరీనాథ్ లో పూజాది కార్యక్రమాల నిర్వాహణ , పూజా ద్రవ్యాల విక్రయం చూసుకొని శీతాకాలంలో కోవెల మూసివేసినపుడు ఆరునెలలూ దేవప్రయాగలో వుంటారట . బదరీనాధ్ వెళ్లే భక్తులు వీటిని దర్శించుకోండి , కలియుగంలో దర్శన మాత్రాన పూర్ణ ఫలితం కలుగుతుందని భగవంతుడు శలవిచ్చేడు . పుణ్యం సంగతి దేవుడు చూసుకుంటాడుగాని కన్నులకు మనసుకు అహ్లాదకరంగా వుంటుందని మాత్రం చెప్పగలను . 

మరిన్ని శీర్షికలు
sahiteevanam