క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి'. ఈ సినిమాలో గౌతమీ పుత్ర శాతకర్ణికి భార్యగా నటించే పాత్రకు కూడా చాలా ప్రాముఖ్యం ఉండబోతోంది. మరి అలాంటి పాత్రకు రక్తి కట్టించగల సత్తా ఉన్న హీరోయిన్ అయ్యి ఉండాలి. అప్పుడే ఆ పాత్రకు న్యాయం జరుగుతుంది. అందుకే ఈ పాత్రల కోసం ముఖ్యంగా అనుష్క, నయనతార, త్రిషవంటి హీరోయిన్స్ని పరిశీలించడం జరిగింది. 'అరుంధతి', రుద్రమదేవి' పాత్రలతో ఆట్టుకున్న అనుష్కకే ఆ అవకాశం ఎక్కువ ఉన్నదని అందరూ ఆశించారు. ఆ తరువాత 'శ్రీరామ రాజ్యం' సినిమాలో సీత పాత్రకు జీవం పోసిన నయనతారకు అవకాశం దక్కుతుందని అనుకున్నారు.
కానీ ఈ ముద్దుగుమ్మలు ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉండడంతో వీరికెవరికీ ఈ ఛాన్స్ దక్కలేదు. ఇక ప్రస్తుతం ఇటువంటి పెద్ద పాత్రలకు నిండైన చీరకట్టులో న్యాయం చేయగల ముద్దుగుమ్మ శ్రియనే అని చివరకు ఆమె పేరు ఖరారు చేశారు. ప్రస్తుతం పెద్ద హీరోల పక్కన డిగ్నిఫైడ్ క్యారెక్టర్స్లో శ్రియ కరెక్ట్గా సెట్ అయిపోతోంది. ఆ సినిమాలు కూడా విజయం వైపుకు దూసుకెళ్తున్నాయి. చారిత్రక కథాంశంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్ పాపులర్ నటి హేమామాలిని కూడా నటిస్తోంది. లిమిటెడ్ బడ్జెట్తోనే అద్భుతాలు సృష్టించే క్రిష్, బాలయ్య 100వ చిత్రానికి, అదీ భారీ బడ్జెట్ చిత్రానికి ఎలాంటి సాంకేతిక హంగులు అద్దనున్నాడోగానీ, తెలుగు సినీ పరిశ్రమలోనే ఇదో మైలు రాయిగా నిలుస్తుందని అంతా అనుకుంటున్నారు.
|