తెలుగు తెరపై స్కై డైవింగ్ చేసిన హీరోలు కొందరున్నారు. అయితే ఆ సినిమాల్లో స్కై డైవింగ్ సన్నివేశాల నిడివి తక్కువే. కానీ 'గౌతమ్ నందా' సినిమాలో స్కై డైవింగ్ సీన్ నిడివి చాలా ఎక్కువట. దీనికోసం హీరో గోపీచంద్ చాలా కష్టపడ్డాడని దర్శకుడు సంపత్ నంది అంటున్నాడు. ఇంత నిడివితో, ఇంత తెగువతో, ఇంత అత్యద్భుతంగా 'గౌతమ్ నందా' సినిమా కోసం స్కై డైవింగ్ సీన్ ఎందుకు చేయాల్సి వచ్చిందో సినిమా చూస్తేనే అర్థమవుతుందట. సినిమాలో ఈ సన్నివేశానికి ఎంతో ప్రాధాన్యత ఉందని దర్శకుడు సంపత్ నంది చెప్పాడు. 'ఏమైంది ఈవేళ' సినిమాతో తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమైన ఈ యువ దర్శకుడు రామ్చరణ్తో 'రచ్చ' సినిమా చేసి కమర్షియల్గా చాలా పెద్ద విజయాన్ని అందుకున్నాడు. అలాగే రవితేజతో 'బెంగాల్ టైగర్' సినిమాని రూపొందించి హ్యాట్రిక్ హిట్స్ పూర్తి చేశాడు.
'గౌతమ్ నందా' సినిమా చాలా స్టైలిష్గా ఉండే మాస్ ఎంటర్టైనర్ అనీ, క్లాస్ ఆడియన్స్ని కూడా ఆకట్టుకునేలా సినిమా రూపొందించామని సంపత్ నంది చెప్పాడు. గోపీచంద్ బాడీ లాంగ్వేజ్ చాలా చాలా కొత్తగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారట. గోపీచంద్ సరసన కేథరీన్ ట్రెసా, హన్సికా మోత్వానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకో వైపున గోపీచంద్ నటించిన 'ఆక్సిజన్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
|