ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'జై లవకుశ' సినిమా విడుదలయ్యాక టాలీవుడ్లో రివ్యూల రచ్చ మొదలైంది. ఈ సినిమాకి మిశ్రమ టాక్ రావడానికి కారణం 'కొంతమంది' రాసిన రివ్యూలే అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ వ్యాఖ్యలు చేయడంతో ఈ రగడ మొదలైంది. కొత్త సినిమాని ఎన్టీఆర్ పేషెంట్తో పోల్చాడు. ఆడియన్స్ డాక్టర్లు అనీ, దారిన పోయే దానయ్యలు కొంతమంది సినీ విశ్లేషకులు అనీ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా పేషెంట్ ప్రాణం లాంటిది. ఆ ప్రాణం ఉంటుందో ఊడిపోతుందో అనేది డాక్టర్లైన ఆడియన్స్ తేల్చాలి. కానీ కొందరు సినీ విశ్లేషకులు రాసే రివ్యూల కారణంగా సక్సెస్ రేటు పడిపతోందనీ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
నిజమే ఎన్టీఆర్ సినిమా విషయంలోనే కాదు, ఇలా గతంలోనూ చాలా సినిమాల విషయంలో రివ్యూ వివాదాలు పుట్టుకొచ్చాయి. తాజాగా 'జై లవకుశ' విషయంలోనూ అదే జరిగింది. కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీస్తున్నారు. వాటి భవిష్యత్తును రాసే అర్హత ఆ కొంతమందికి ఎవరిచ్చారనే విమర్శలు కొత్తేమీ కాదు. అయితే రివ్యూలకు సంబంధించి ఎన్టీయార్ వ్యాఖ్యలను సూపర్ స్టార్ మహేష్ లైట్గా తీసుకున్నారు. ఎవరికి ఎలా నచ్చితే అలా రివ్యూ రాస్తారు. బాగుంటే బాగుందని రాస్తారు, లేదంటే బాగాలేదని రాస్తారు. మా సినిమా అయితే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా మంచి రివ్యూలే వస్తాయని ఆశిస్తున్నామని 'స్పైడర్' సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమంలో మహేష్ స్పందించారు. అయితే ఇక్కడ ఎన్టీఆర్ ఆవేదననీ తప్పు పట్టలేము. మహేష్ లైట్ తీస్కోవడాన్ని తప్పు పట్టేలేం. సున్నితమైన సంక్లిష్టమైన సమస్య ఇది. సినిమా చూసే వారిలో చాలామంది తమ ఆలోచనల్ని రివ్యూ రూపంలో బయటపెట్టడానికి సోషల్ మీడియా కూడా అద్భుతమైన వేదికగా మారింది. కాబట్టి కొంతమంది విశ్లేషకుల గురించే మాట్లాడితే అది అసంపూర్ణమైన వ్యాఖ్య అవుతుంది.
|