Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

ఉత్తరాఖండ్ తీర్థయాత్రలు - కర్రా నాగలక్ష్మి

uttarakhand

జాగేశ్వర మహదేవ్ మందిరం

బాల జాగేశ్వర మందిరాన్ని చూసుకొని జాగేశ్వర్ బయలుదేరేం . మూడు కిలోమీటర్ల ప్రయాణానంతరం జాగేశ్వర్ చేరేం . అప్పట్లో కుమావు వికాస మండల వారి గెస్ట్ హౌసుమాత్రమే వుండేది . వూరు మొదలులోనే గెస్ట్ హౌసు వుండడం తో ముందుగా రూము తీసుకొని ఫ్రెష్ అయి మందిరం వైపు వెళ్లేం . వూరంతా కలిపి పది గడపల కంటే లేవు . గెస్ట్ హౌస్ కి పక్కగా మ్యూజియం వుంది అందులో చాలా పురాతనమైన రాతి విగ్రహాలు వున్నాయి . అక్కడ ఓ యూరోపియన్ జంట కలిసేరు , అక్కడ వున్న ఛాముండి విగ్రహం చూపించి యెవరు యేమిటి అని అడిగేరు , వచ్చీరాని యింగ్లీషులో పార్వతీ దేవి అవతారం అని చెప్తే కాళి , దుర్గా ల గురించి తెలుసు కాని ఛాముండి గురించి తెలియదు అంటే  ఛండ , ముండ అనే రాక్షసులను చంపడం మొదలయిన కథ వారికి వినిపించేను . కాని కుతూహలానికి జోహారు అనకుండా వుండలేకపోయేను . అయిదుకి మ్యూజియం మూసెస్తారు . 

ఈ గ్రామం యిక్కడి మందిరం పేరు మీదనే గుర్తింప బడుతోంది . ఆల్మోడా నగరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరాన సుమారు 1870 మీటర్ల యెత్తులో దేవదారు వృక్షాల నడుమ  , నందిని , సురభి అనే సెలయేరులు సంగమించిన పుణ్యప్రదేశం యిది . 

ఆర్కియోలజికల్ సర్వే వారి చే సంరక్షింప పడుతున్న మందిర సముదాయం . సుమారు 124 చిన్న పెద్ద మందిరాలు వున్నాయి . ఇవి సుమారు తొమ్మిది నుంచి పదకొండవ శతాబ్దాల మధ్యలో నిర్మించినట్లు అంచనా . దండేశ్వరమందిరం , ఛండి మందిరం , జాగేశ్వర మందిరం , కుబేర మందిరం , పుష్టి దేవి మందిరం , మృత్యుంజయ మహదేవ మందిరం , నందాదేవి , నవ దుర్గ , నవ గ్రహ , సూర్య మొదలైన మందిరాలు వున్నాయి . వాటిలో అతిపురాతనమైనది మృత్యుంజ మందిరం , దండేశ్వర మందిరం అతిపెద్దది . ప్రాంగణమంతా రాతి పలకలు పరిచి వుంటాయి . చాలా చల్లగా వుంటుంది సూర్యాస్తమయం అవగానే శయన హారతి యిచ్చి మందిరం మూసెస్తారు . 

ఈ మందిరాలు పాండవులచే నిర్మింపబడ్డవి .

అన్ని ఉత్తరభారతదేశ మందిరాలలో వున్నట్లు యిక్కడకూడా శివలింగాన్ని తాకి పూజలు చేసుకోవచ్చు .

స్థలపురాణం చెప్పుకొనే ముందర మందిరం గురించి కొన్ని విషయాలు చెప్పుకుందాం .

జాగేశ్వర మందిరం శంకరాచార్యులవారిచే గుర్తింపబడ్డ జ్యోతిర్లింగాలలో ఒకటైన నాగేశం . ఇక్కడ పూజారులు కూడా శంకరాచార్యులచే నియమింపబడ్డ దక్షిణాదికి చెందిన పండితులే . అయితే కాలక్రమేణా యిక్కడి స్త్రీలను వివాహమాడి వారి భాషను కూడా మరచిపోయేరు , కాని మనం అడిగితే వారి పూర్వీకులు యే ప్రాంతానికి చెందిన వారో చెప్పి సరదా పడతారు . జనవరి ఫిబ్రవరిలలో హిమపాతం జరుగుతుంది . మిగతా కాలం అతిచల్లగా వుంటుంది . 

పాండవులు మృత్యుంజయుని రూపంలో శివుని ప్రార్ధించుకొని మహాభారత యుధ్దంలో మరణం లేకుండా వరం పొందేరుట .  

జాగేశ్వరమహదేవ్ మందిరం కాస్త వెనుకవైపు వుంటుంది . ముందుగా యెడమవైపు వచ్చేది మృత్యంజయ మందిరం , యిక్కడ చేసుకునే పూజ ధాన్యం ఆయిష్షు పెంచుతుందని నమ్మకం . ఈ మధ్యకాలంలో చాలామంది తెలుగువారు యిక్కడ మృత్యుంజయ హోమాలు చేయించుకోడం చూసేం . కాలసర్పదోషం వున్నవారు యిక్కడ హోమం చేసుకుంటే దోషనివారణ జరుగుతుందని చెప్పేరు .

తరవాత దండేశ్వర మహదేవ్ మందిరం చివరగా కుడివైపున నాగేశం మందిరాలు వున్నాయి . నాగేశం మందిరం పైన పెద్ద రాతితో చెక్కిన పాము విగ్రహం వుంటుంది . బయట ద్వారపాలకులుగా నంది , స్కంది కాపలా కాస్తూ వున్నారు . లోపల మంటపం లో , మహంతు కూర్చొనే గద్ది వుంది  . అక్కడ అఖండదీపం , శివలింగం వుంటాయి . శివలింగానికి వెనుకవైపు గోడకు అమ్మవారి విగ్రహం వుంటాయి . పక్కగా మంచం పరుపు వుంటాయి . ఇక్కడ శివలింగం రెండు ముఖాలు వున్నట్లుగా వుంటుంది . దీనిని అర్ధనారీశ్వర లింగం అంటారు , పెద్ద భాగం శివుడని , చిన్న భాగం పార్వతి అని అంటారు .అలాగే లింగం చేత్తో కదిపితే కదులుతూ వుంటుంది . ఇక్కడ శివుడు యెప్పుడూ జాగ్రదావస్థలో వుంటాడట , సాధారణంగా మందిరాలలో దేవుడు హారతి సమయాలలో మాత్రమే వుంటాడని , యిక్కడ మాత్రం యెప్పుడూ వుంటాడని అంటారు . అందుకే యీ శివుడిని జాగేశ్వరుడు అని పిలుస్తారు . 

రాత్రి శయన హారతి కి ముందు పక్కన వున్న పడకను చక్కగా అమర్చి పూజారులు తలుపులు మూసెస్తారు , మరునాడు తలుపులు తెరిచేసరికి పడక పైన వేసిన శివుడు శయనించేడు అనడానికి నిదర్శనం గా దుప్పటి చెదరి వుంటుందట యిది పూజారులు చెప్పిన విషయం 

ప్రతి సంవత్సరం శివరాత్రి కి , శ్రావణ మాసం లోనూ యాత్ర జరుగుతుంది . అప్పుడు వేల సంఖ్యలో భక్తులు వస్తారు . మిగతా సమయాలలో చాలా నిర్మానుష్యంగా వుంటుంది . 

మందిర ప్రాంగణం లో పుష్టిదేవి మందిరం చూడదగ్గది .

స్థలపురాణం ప్రకారం విష్ణుమూర్తిచే స్థాపించబడ్డ జ్యోతిర్లింగమైన నాగేశం ని వెతుకుతూ శంకరాచార్యులవారు వచ్చి యీ ప్రదేశాన్ని గుర్తించి నాగనాథ్ లింగాన్ని ప్రతిష్టించి పూజలు చేసి తనకూడా వచ్చిన శిష్యులను పూజారులుగా నియమించేరు . కాలాంతరంలో చంద్ర వంశానికి చెందిన కతూరియా రాజులు మరమ్మత్తులు చేయించేరు . మరో కథనం ప్రకారం శివుడు యీ ప్రదేశానికి వచ్చి తపస్సమాధిలో వుండగా రాక్షసులు ధ్యాన భంగం చేస్తూవుంటారు . శివుడు మూడు నేత్రాలుకలిగిన  ' శామ్ ' అనే గణాన్ని రాక్షస సంహారమునకు పంపుతాడు , శామ్ రాక్షస సంహారం గావించి అవతారం చాలిస్తాడు . ఈ ప్రదేశం జాగేశ్వర మహదేవ మందిరానికి 2 కిలోమీటర్ల దూరంలో వున్న ' కోటి లింగాలు ' అనే ప్రదేశం లో జరిగినట్లు చెప్తారు . ఇది జటగంగ శామ్ గంగల పవిత్ర సంగమ ప్రాంతం కావడం మరో విశేషం . శంకరాచార్యులవారు యిక్కడ  నాగేశం మందిరాన్ని నిర్మించ దలచేరట , మందిరం సగం నిర్మించిన తర్వాత కూలిపోయిందట , యిప్పటికీ అక్కడ పడి వున్న శిథిలాలను చూడొచ్చు . స్థానికుల నమ్మకం ప్రకారం కోటిలింగాలలో శివుడు యిప్పటికీ తపస్సమాధిలో వున్నట్లు  కలియుగంలో  తన 28 వ అవతారంగా ' లకులిష ' అనే పేరుతో మానవులను కలిప్రభావమునుండి రక్షించడానికి వస్తాడని , ఆ అవతారంలో శివుడు తన జడలలో కర్రతో చేసిన సుత్తి ఆకారాన్ని బంధించి తిరుగుతూ వస్తాడని కోటిలింగాల ప్రాంతంలో అతనికి మందిర నిర్మాణం చెయ్యమని శివుడు కోరినట్లుగా చెప్తారు , సోమనాధ్ ప్రాంతంలో వున్న గుజరాతీలలో కూడా యీ కథ గురించి నమ్మకం వుంది , ఆనమ్మకంతోనే కొంతమంది గుజరాతీలు 3 , 4 తరాలకు పూర్వం యిక్కడకు వలస వచ్చేరు .

స్థానికల మరో కథనం ప్రకారం ' లకులిష ' అవతారం ఉద్భవించిందని బాలునిగా వున్నప్పుడు బాల జాగేశ్వర లోని మందిర సముదాయంలో సంచరించే వాడని మధ్య వయసువరకు జాగేశ్వర్ లోనూ ముసలి వయసులో వృద్ద జాగేశ్వర్ లో గడిపి అవతారం చాలించేడని , అతని శిష్యులను ' లకులిషులు ' అంటారని చెప్తారు . వీరు విభూతి ధారులై జడలతో మనకి యీ ప్రాంతాలలో కనిపిస్తారు .

వృద్ద జాగేశ్వర్ చిన్న గుట్టమీద వున్న చిన్న మందిరం , లోపల శివలింగం మందిరం పక్కనే పూజారి యిల్లు , రోజూ నైవేద్యం పెట్టి ఆ సమయంలో మందిరంలో భక్తులకు ప్రసాదం యిస్తూ వుంటారు . ఇక్కడ నాకు నచ్చిన విషయం యేమిటంటే దక్షిణ కోసం పూజారులు పీడించకపోవడం , యీ మందిరాలు యే ట్రస్టు ఆధ్వైర్యం లోనూ లేవు , భుక్తి కి యెలా అనే ప్రశ్నకు సమాధానం శివుడుని నమ్ముకున్నవారికి భుక్తి శివుడే యిస్తాడు అని . 

సాయంత్రం ఒక దర్శనం , పొద్దున్న మరో దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణమయేం . 

రాత్రి కుమావు గెస్ట్ హౌసు మేనేజరు తో మాట్లాడు తున్నప్పుడు పాతాళ భువనేశ్వర్ గురించి తెలిసింది . అతను చెప్పిన వివరాలు రాసుకొని మరో మారు వచ్చినపుడు పాతాళభువనేశ్వర్ ని దర్శించుకుందామని నిర్ణయించుకున్నాం

 మళ్లావారం పాతాళ భువనేశ్వర్ గురించి చదువుదాం . అంతవరకు శలవు .

మరిన్ని శీర్షికలు
sarasadarahasam