చిరంజీవి హీరోగా తెరకెక్కుతోన్న 'సైరా నరసింహారెడ్డి' కోసం సర్వం సిద్ధమైంది. ఈ సినిమాలో యాక్షన్ పార్ట్ అత్యంత కీలకం. అందుకోసం విదేశాల నుండి సుమారు 250 మంది ఆర్టిస్టులను తీసుకొచ్చారట. స్వాతంత్రోద్యమ కాలం నాటి స్టోరీ ఇది. బ్రిటీష్ వారితో తెలుగు స్వాతంత్ర సమరయోధులు తలపడే నాటి సన్నివేశాల్ని రియలిస్టిక్గా చూపించేందుకు విదేశీ ఆర్టిస్టులను ఎంచుకున్నారు. తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమా ఇది. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ప్రతీ విషయంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది చిత్ర యూనిట్. రామ్ చరణ్ ఈ చిత్రానికి నిర్మాత. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్తో యూనివర్సల్ చిత్రంగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు.
యుద్ధ సన్నివేశాలను తెరకెక్కించేందుకు ప్రత్యేకంగా సెట్స్ ఏర్పాటు చేశారు. చరిత్ర మూలాల్లోంచి పుట్టుకొచ్చిన కథ ఇది. అందుకే ఈ సినిమా కోసం వేసిన సెట్స్ని సెట్స్లా కాకుండా సహజత్వాన్ని తలపించేలా ఉండనున్నాయి. ఎంతో గ్రౌండ్ వర్క్ చేసింది ఇందుకోసం చిత్ర యూనిట్. వారం రోజుల పాటు ట్రైల్ షూట్ చేశాక, చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందట. మరుగున పడిపోయిన చరిత్రని ప్రపంచానికి తెలియచెప్పేందుకు ఈ సినిమా ఉపయోగపడనుంది. సినిమాలోని ప్రతీ సన్నివేశాన్ని రియలిస్టిక్గా నేచురాలిటీకి చాలా దగ్గరగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ కష్టపడుతోంది. చిరంజీవి 151వ చిత్రంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిరంజీవి గెటప్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అలాగే యాక్షన్ ఘట్టాల కోసం చిరంజీవి తన శరీరాన్ని తగిన విధంగా మలచుకుంటున్నారు. కసరత్తులు చేస్తున్నారు. బాలీవుడ్ నుండి బిగ్బీ అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నయనతార హీరోయిన్గా నటిస్తోంది.
|