యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లతో మెగా మల్టీస్టారర్ తెరకెక్కనుందన్న వార్త గత కొంత కాలంగా హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాని తెరకెక్కించేది ది గ్రేట్ రాజమౌళి అనే ప్రచారం సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ విషయంపై ఈ ముగ్గురులో ఏ ఒక్కరూ అఫీషియల్గా ధృవీకరించలేదు. కానీ ఈ ప్రచారం నిజమేనంటూ ఆ నోటా, ఈ నోటా మెగా సన్నిహితుల ద్వారానే సమాచారం అందింది. అయితే త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోందనీ తాజాగా అందుతోన్న సమాచారమ్. ఇప్పటికే స్క్రిప్టు పనులు ఓ కొలిక్కి వచ్చాయట. టాలీవుడ్తో పాటు, బాలీవుడ్లో కూడా పలు సక్సెస్ఫుల్ చిత్రాలకు కథలందించిన ప్రముఖ రచయిత, విజయేంద్రప్రసాద్ ఈ చిత్రానికి కథను సిద్ధం చేశారు. ఈ స్టోరీ లైన్ని ఆల్రెడీ రాజమౌళి చరణ్కీ, ఎన్టీఆర్కీ విడి విడిగా వినిపించడం జరిగిందట.
అయితే ఇద్దరికీ కలిపి ఈ స్టోరీని వినిపించేందుకు తగిన టైం కోసం వేచి చూస్తున్నాడట. ఇప్పటికే వీరిద్దరితోనూ ఈ ప్రాజెక్ట్ విషయమై చర్చలు జరుగుతున్నాయట. చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి ఈ విషయమై మాట్లాడుకుంటున్నారట కూడా. ప్రస్తుతం చరణ్ 'రంగస్థలం' సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, బోయపాటి సినిమా కోసం సంసిద్ధమవుతున్నాడు. మరో పక్క ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు. ఈ ఇద్దరూ ఈ రెండు సినిమాలు పూర్తి చేశాకే ఈ మెగా మల్టీ స్టారర్ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అలా కాదనీ మరో పక్క టాక్ వినిపిస్తోంది. చరణ్, ఎన్టీఆర్ ఏకకాలంలో రెండు చిత్రాల్లో నటించేలా తమ తమ డేట్స్ని అడ్జస్ట్ చేసుకునే యోచనలో ఉన్నారనే గాసిప్ వినిపిస్తోంది. ఒకవేళ ఈ గాసిప్ నిజమైతే, అతి త్వరలోనే ఈ మెగా మల్టీస్టారర్ పట్టాలెక్కే అవకాశాలున్నాయి. అదే జరిగితే ఇటు మెగా అభిమానులకు, అటు ఎన్టీఆర్ అభిమానులకు అంతకన్నా కావాల్సిందేముంటుంది.
|