ఎప్పుడూ కాంట్రవర్సీలతో సావాసం చేసే కంగనా రనౌత్ తాజాగా ఇంకో కాంట్రవర్సీలో ఇరుక్కుంది. ఆమె నటిస్తున్న 'జడ్జిమెంటల్ హై క్యా' సినిమాకి సంబంధించి తొలి నుండీ వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. నిన్న కాక మొన్న టైటిల్ వివాదం ఓ కొలిక్కి వచ్చిందనుకుంటే, తాజాగా వచ్చిన వివాదంతో కంగనా పుణ్యమా అని నిర్మాతల కొంప మునిగేలా ఉంది. ఇంతకీ అసలు విషయమేంటంటే, 'జడ్జిమెంటల్ హై క్యా' సినిమా ప్రమోషన్స్ పేరు చెప్పి ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అందులో కావాలని కంగనా 'మణికర్ణిక' గొడవ తీసుకొచ్చి జర్నలిస్టులపై మాటల దాడికి దిగింది. ఈ మాటల దాడి కాస్తా, జర్నలిస్టుల ఆగ్రహానికి కారణమైంది.
సినిమాని బ్యాన్ చేస్తామన్నంతవరకూ వచ్చింది. దాంతో నిర్మాత ఏక్తాకపూర్ కల్పించుకుని, సదరు జర్నలిస్టులకు సారీ చెప్పాల్సి వచ్చింది. అక్కడితో ఆగలేదు. ఇష్యూ సీరియస్నెస్ని బట్టి కంగనాతో కూడా సారీ చెప్పించే దిశగా ఆమె ప్రయత్నాలు సాగుతున్నాయట. కంగనా సంగతి అందరికీ తెలిసిందే. కానీ, అక్కడ ఏక్తాకపూర్ కూడా తక్కువేం కాదు. బాలీవుడ్లో రెబల్ ప్రొడ్యూసర్ ఆమె. కంగనా పప్పులు ఆమె వద్ద ఉడికేలా లేవ్. ఈ ఇష్యూపై కంగనాకి ఫుల్గా క్లాస్ పీకిందట ఏక్తాకపూర్. అందరి దగ్గరా వేషాలేసినట్లు నా దగ్గర వేస్తే కుదరదని ఏక్తా, కంగనాకి సీరియస్ వార్నింగ్ ఇచ్చిందట. దాంతో కంగనాకి గూబ గుయ్య్మన్నట్లే అయ్యింది. కానీ, ఇంతలోనే, మరో కాంట్రవర్సీ స్టేట్మెంట్ ఇచ్చి మరోసారి తనదైన శైలిలో ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేసింది కంగనా. నా సినిమా బ్యాన్ చేస్తారా.? వద్దు, వద్దు.. దయచేసి నన్నే బ్యాన్ చేయండి..' అంటూ విన్నవించింది. ఇదేం కొత్త ట్విస్టో అర్ధం కావడం లేదిప్పుడు.
|