క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చారిత్రాత్మక చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి'. బాలకృష్ణ వందో చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలయ్య బాబు 'గౌతమీ పుత్ర శాతకర్ణి పాత్రలో చాలా పవర్ ఫుల్గా నటించనున్నారు. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు చరిత్రను కళ్లకు కట్టేలా చూపించే అదృష్టం తనకు కల్గినిందుకు చాలా సంతోషంగా ఉన్నానని బాలకృష్ణ తెలిపారు. ఈ సినిమాకి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ప్రముఖ గేయ రచయిత సిరాశ్రీచే రచించబడిన పాట ప్రస్తుతం ఎఫ్ఎమ్ రేడియోలో తెగ హల్ చల్ చేస్తోంది.
బహుశా తెలుగు సినీ రంగంలో ఇదో కొత్త ప్రయోగం కావొచ్చు. 'గౌతమీ పుత్ర శాతకర్ణీ...' అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో, యూ ట్యూబ్లో ఈ పాట సంచలనాలు సృష్టిస్తోంది. ఇదిలా ఉండగా చారిత్రక కథ నేపథ్యంలో ఈ సినిమాకి సూటయ్యే లొకేషన్స్ వేటలో బిజీగా ఉంది క్రిష్ బృందం. ఈ సినిమాలో శాతకర్ణి తల్లి పాత్రకు ప్రాధాన్యత ఉన్నందున ఆ పాత్రకు తగ్గ నటిని ఎంచుకోవడంలో కొంత జాప్యం అవుతోంది. ఆ పాత్రకు బాలీవుడ్ నటి హేమా మాలిని, సీనియర్ నటి శోభన పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు తదితర విషయాలను త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా తెలపనుంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
|