'సాహో' సినిమా కోసం చాలా వరకు బాలీవుడ్ నుంచే నటీనటుల్ని తీసుకొస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నాడు. హీరోయిన్ని బాలీవుడ్ నుంచే తీసుకొచ్చారు. శ్రద్ధా కపూర్ తొలిసారి తెలుగులో నటిస్తున్న సినిమా ఇది. జాకీష్రాఫ్ బాలీవుడ్ నటుడే అయినా, తెలుగు ప్రేక్షకులకీ సుపరిచితుడే. తాజాగా బాలీవుడ్ నటి మందిరాబేడీని ఈ సినిమా కోసం ఎంచుకున్నారట. ఆమె లేడీ విలన్గా నటించబోతోందని సమాచారమ్. ఆమె క్యారెక్టర్ని చాలా రిచ్గా పవర్ఫుల్గా డిజైన్ చేశారట. మరికొందరు విలన్ పాత్రధారుల్నీ బాలీవుడ్ నుంచే ఎంపిక చేశారు. ఇప్పటిదాకా వినిపిస్తున్న వార్తల ప్రకారం ప్రధాన తారాగణంలో 80 శాతానికి పైగా బాలీవుడ్ నటీనటుల్ని తీసుకున్నారని తెలియవస్తోంది. అయితే మొత్తానికి చెప్పొచ్చేదేంటంటే, నటనకు హద్దులు చెరిగిపోయాయి.
బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేదు. ఎక్కడైనా నటించేందుకు నటీ నటులు ఆశక్తి చూపిస్తున్నారు. దాంతో సినీ పరిశ్రమకి హద్దులు చెరిగిపోయాయి. ఇదంతా 'బాహుబలి' తెచ్చి పెట్టిన క్రెడిట్టే. 'బాహుబలి'తో తెలుగు సినిమా, హిందీ సినిమా అనే బౌండరీస్ చెరిగిపోయి, ఇండియన్ సినిమా అనే స్థాయికి మన తెలుగు సినిమా ఎదిగింది. 'సాహో' ఆ మ్యాజిక్ని రిపీట్ చేయబోతోందనుకోవచ్చు. హైలీ టెక్నికల్ టీమ్తో, చాలా రిచ్గా భారీ బడ్జెట్తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. 'బాహుబలి' కోసం కత్తులు పట్టి యుద్ధాలు చేసిన ప్రబాస్, ఈ సినిమా కోసం రొమాంటిక్ హీరోగా అదిరిపోయే యాక్షన్ చేయనున్నాడన్న మాట. ఇది ప్రబాస్ షో టైమ్!
|