రామ్చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా ఈ జనరేషన్ స్టార్ హీరోలందరి సరసన మెరిసి, స్టార్ హీరోయిన్ ఛైర్ని అధిరోహించిన మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు సీనియర్ హీరో వెంకటేష్ సరసన నటించేందుకు సిద్ధమవుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకీ ఓ మల్టీస్టారర్లో నటించనున్నారు. ఈ సినిమాలో వెంకీతో కలిసి నటించే మరో హీరో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఈ సినిమాకి 'ఎఫ్ 2' అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. 'ఫన్ అండ్ ఫ్రస్టేషన్' అనేది ఉప శీర్షిక. కాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోల పక్కన ఇద్దరు భామలకు చోటుంది. అందులో వెంకీ సరసన హీరోయిన్గా మిల్కీబ్యూటీ తమన్నాని ఎంచుకున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మరో హీరోయిన్ పేరు ఇంకా పరిశీలనలో ఉంది. ఆ ప్లేస్లో మెహరీన్ పేరు తాజాగా వినిపిస్తోంది. కాగా వెంకీతో తమన్నా తొలిసారి జత కడుతోన్న చిత్రమిది.
ఆ మాటకొస్తే, సీనియర్ హీరోలకు జోడీగా ఇంతవరకూ తమన్నా నటించింది లేదు. తొలిసారిగా వెంకీతోనే జత కడుతోంది. నాగార్జున హీరోగా వచ్చిన 'ఊపిరి' సినిమాలో తమన్నా నటించింది కానీ, ఆ సినిమాలో యంగ్ హీరో కార్తీకి జోడీగా నటించింది తమన్నా. ఆ క్రమంలో వెంకీ, తమన్నా జోడీ టాలీవుడ్లో స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. అంతేకాదు, వెంకటేష్ అంటే తనకెంతో ఇష్టమనీ, ఆయనతో జత కట్టే అవకాశం రావడం తనెంతో అదృష్టంగా భావిస్తున్నానంటోంది తమన్నా. మరో పక్క బాలీవుడ్ 'క్వీన్' తెలుగు రీమేక్లో తమన్నా లీడ్ రోల్ పోషిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
|