విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను తెరపై ఆవిష్కరించేందుకు ముహూర్తం షురూ అయ్యింది. నాచారంలోని రామకృష్ణ హార్టీకల్చరల్ సినీ స్టూడియోలో ఏప్రిల్ 29న 'ఎన్టీఆర్' సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. బాలయ్య ముందుగా చెప్పినట్లుగానే ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు, బాలయ్య కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. బాలయ్య దుర్యోధనుడి గెటప్లో తలపై భారీ కిరీటం, మెలి తిరగిన మీస కట్టుతో వేదిక పైకి విచ్చేసి అందర్నీ ఎట్రాక్ట్ చేశారు. అలనాటి మేటి నటులు లెజెండ్ నందమూరి తారక రామారావు పాత్రలో ఆయన కుమారుడు బాలయ్య నటించనున్నారు.
రామారావు చిన్ననాటి క్యారెక్టర్ని ఓ యంగ్ హీరో పోషించనున్నాడు. అది హీరో శర్వానంద్ అని తెలుస్తోంది. తేజ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని బాలయ్య సొంత నిర్మాణంలో నిర్మించనున్నారు. తొలిసారిగా ఈ సినిమా కోసం బాలయ్య నిర్మాతగా మారారు. ఎన్టీఆర్కి తెలుగులోనే కాకుండా, దేశ వ్యాప్తంగా ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ తదితర భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ దసరాకి సినిమాని విడుదల చేసే యోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారమ్.
|