దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి సినిమాలంటే పెద్దగా అవగాహనా, ఆశక్తి ఉండేది కాదు. కానీ ఆయనను ఇష్టపడే ప్రముఖులు అందరూ సినీ రంగంలో ఉన్నారు. కొందరు ఆయన్ని విపరీతంగా అభిమానించి ఉండొచ్చు. కొందరు మామూలుగా అభిమానించి ఉండొచ్చు. కానీ ఎవరూ ఆయన్ని వ్యతిరేకించింది లేదు. ముఖ్యమంత్రిగా తన పదవీకాలంలో సినీ పరిశ్రమకు ఎంతగా సహకరించాలో అంతగా సహకరించారు. ఆయన జీవిత చరిత్ర పూర్తిగా కాదు కానీ, కొంత భాగం 'యాత్ర' పేరుతో తెరకెక్కబోతోంది. ప్రతిపక్ష నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ చివరి నుండి ఈ చివరిదాకా పాద యాత్ర చేపట్టారు రాజశేఖర్ రెడ్డి.
పాదయాత్ర నేపథ్యంలోనే 'యాత్ర' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ఈ యాత్ర టైటిల్ కూడా పాదం గుర్తును తలపించేలా డిజైన్ చేశారు. త్వరలో విడుదల కానుంది ఈ సినిమా. ఇప్పుడీ సినిమా సినీ పరిశ్రమలో అందరూ ఆశక్తిగా ఎదురు చూసేలా చేస్తోంది. 'ఆనందోబ్రహ్మ' డైరెక్టర్ మహి.వి.రాఘవ ఈ చిత్రాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది ఈ చిత్రం.
|