Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

జిల్లెళ్ళమూడి అమ్మ - టీవీయస్. శాస్త్రి

jillellamoodi amma

జిల్లెళ్ళమూడి "అమ్మ"గా పేరొందిన ఈవిడ అసలు పేరు అనసూయ. ఈమె, గుంటూరు జిల్లాలోని బాపట్లకు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నజిల్లెళ్ళమూడి అనే కుగ్రామంలో 28 మార్చి, 1923 న సీతాపతి, రంగమ్మ అనే పుణ్య  దంపతులకు జన్మించారు. తండ్రి సీతాపతి గారు గ్రామాధికారి. నాలుగు సంవత్సరాల వయసునుండే ఆమె శారీరక, మానసిక స్థితి చాలా విభిన్నంగా ఉండేది. తరచుగా, trance లోకి వెళ్ళేవారు. ఒక సారి, ఏకంగా అలా పదకొండు రోజులు trance లో ఉండిపోయారు. నెమ్మదిగా స్పృహలోకి వచ్చేవారు. ఆ నాటి వైద్యులకు ఆమె స్థితి చాలా వింతగా తోచింది. వివాహం చేస్తే మార్పు రావచ్చునేమోనని భావించారు.

ఆమెకు 05 -05 -1936న, పదమూడవ ఏటనే వివాహం చేసారు. కానీ, వివాహానంతరం కూడా, ఆమె ఎప్పుడూ ఏదో లోకంలో ఉన్నట్లుగా ఉండేవారు. ఆవిడ భర్త పేరు శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావుగారు. ఆయనను 'జిల్లెళ్ల మూడి కరణంగారు' అని పిలిచేవారు. అప్పటికే ఆమెలో దివ్యశక్తిని గ్రహించిన కొందరు భక్తులు ఆమెను."మీకు అంత ఆధ్యాత్మిక తృష్ణ, భక్తి ఉండగా, పెళ్లి చేసుకోవటం లోని అంతరార్ధం మాకు అర్ధం కావటం లేదు." అని అడిగారు. అందుకు, అమ్మ"ఆధ్యాత్మిక జీవితానికి వివాహం అడ్డు కాదు - అని చెప్పటానికే, నేను వివాహం చేసుకుంటున్నాను." అని చెప్పారట. తన భార్య వింత పోకడలకు కొంతకాలానికి అలవాటు పడి, ఆవిడలో ఒక దివ్యమూర్తిని చూసి, ఆవిడ భక్తుడిగా మారాడు శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావుగారు. కానీ, "అమ్మ" మాత్రం, తన భర్త పాద పూజ చెయ్యటం కొనసాగించారట. భక్తులు, ఆవిడ భర్తను "నాన్నగారు" అని పిలుచుకునేవారట. అయన, 1981లో మరణించారు 'ప్రపంచమంతా ఒక్కటే, ఒక్కడే దేవుడు' - అనేదే ఈమె వేదాంత బోధ.

ఈవిడ 1960-70 లలొ చాలా ప్రసిద్ధురాలు. ఈవిడ, జిల్లెళ్ళమూడిలోని ప్రజలకు మత విషయముల మీద సందేశాలు ఇస్తుండేవారు. భక్తులు ఆవిడను "అమ్మ" అని భక్తిగా పిలుచుకునేవారు. అమ్మకు చాలా విషయాలు తెలుసు. ఒక సందర్భంలో- 'సిద్ధుడికి', 'జ్ఞానికి' గల తేడాను చక్కగా వివరించారు. సిద్ధుడు ప్రజలను తన వద్దకు ఆకర్షించుకుంటాడు వివిధ శక్తుల వల్ల, జ్ఞానికి ఆ అవసరం లేదు. ప్రజలే వారంతట వారే ఆకర్షితులవుతారు. విచిత్రమైన విషయమేమంటే, ఆవిడకు గుడి కట్టడం 1953లో మొదలయ్యి 1985 లో పూర్తి అయింది. ఆ గుడి పేరు "అనసూర్యేశ్వరాలయం". ఆ కట్టిన గుడిలో, ప్రతి సంవత్సరం మే నెల 5వ తేదీన ఆవిడ తన పెళ్ళిరోజును  జరుపుకునేవారు. గర్భగుడిలో, భక్తులు ఆవిడను పూజించేవారు. అమ్మ 12-06-1985 న భౌతిక దేహాన్ని విడిచారు. ఆ తరువాత, ఆవిడ భౌతిక కాయాన్ని, ఆవిడ కోరిక మేరకు, ఆ గుడిలోనే ఖననం చేశారు. 1987లో ఆవిడను ఖననం చేసిన ప్రదేశంలో ఆమె పాలరాయి విగ్రహాన్ని నెలకొల్పారు.

వీరికి, ఒక కుమార్తె, పేరు హైమ. ఆ అమ్మాయి, 1944లో జన్మించి, 1968లో మరణించినది. మొదటినుండి, ఆ అమ్మాయి రకరకాల అనారోగ్యాలతో బాధపడుతుండేది. "అమ్మ" తన కుమార్తె త్వరలోనే ఈ ప్రపంచాన్నివదలి వెళ్ళిపోతుందని తెలుసుకున్నారు. మరణించిన తన కుమార్తెను, ఖననం చేయించి అక్కడ ఒక గుడి కట్టించారు. ఆ గుడి "హైమాలయం" గా పేరొందినది. దానిలో కూడా నిత్యమూ పూజలు, పునస్కారాలు జరుగు తుంటాయి.

Mr. Richard Schiffman in his book "Mother of All" writes "We need not feel that Mother’s feeding of her children is restricted to nourishment for the physical frame alone. It might be said that the food which Amma distributes so lovingly is a maternal symbol of the subtler, spiritual nourishment, the grace, which she invariably showers on one and all who approached her... When a visitor asked her why she does not give any formal spiritual initiation, she answered: the food I give you is your Upadesha".


చలం లాంటి విభిన్న తత్త్వంగల వ్యక్తిని కూడా అమ్మ ఆకర్షించింది. ఈ క్రింది చిత్రంలో, చలం గారు తల్లి దగ్గర ఉన్న పసిబాలుడువలె ఎంత  ప్రశాంతంగా ఉన్నారో గమనించవచ్చు.
(అమ్మతో మహర్షి చలం)



అమ్మ బోధలు
ప్రతిరోజూ మనకు అనుభవంలోకి వచ్చే విషయం ఏమంటే, కొన్ని పనులు అనుకుని చేస్తాము, మరికొన్ని పనులు అనుకోకుండా చేస్తాము. ఇలా జరిపించే దానికి "శక్తి" అని పేరు పెడదాము...... దేవుడున్నాడా అని అనుమానం పట్టుకున్నప్పుడు, నీ మీద నువ్వు నమ్మకం పెంచుకో, నీ మీద నీకు నమ్మకం లేనపుడు, దేవుని మీద నమ్మకం పెంచుకో. మీరు గమనించే ఉంటారు, మీరెంత ఆత్మ విశ్వాసంతో పనిచేసినా, కొన్ని సార్లు ఆ పని మీరనుకున్నట్లుగా కాదు. అటువంటప్పుడు, మీ గురించి మీకు అనుమానం కలిగి, అసహాయులయి, సహాయం కొరకు, మీరు దేవుని వైపు మళ్ళుతారు. మీరు పూర్తి విశ్వాసంతో మీ పనిని, మిమ్మల్ని దేవుని వద్ద ఉంచుతారు. కాని, వేచి చూసినా, ఏమీ కాదు. అప్పుడు మళ్ళీ ఆ పనులను మీ చేతుల్లోకి తీసుకంటారు. ఈ మొత్తం చక్ర భ్రమణాన్ని, సవ్యంగా ఎందుకు అర్థం చేసుకోరు? మీలో ఉన్న అంతరాత్మ మరియు భగవంతుడు ఒకే సూత్రానికి సంబంధించిన రెండు ధ్రువాలని !

(అత్తగారైన కనకమ్మ గారిసేవలో అమ్మ)

అమ్మ నోట బంగారు మాట - ఒక సారి నేను జిల్లెళ్ళమూడి వెళ్ళినపుడు, ప్రఖ్యాత రచయిత శ్రీ కొండముది శ్రీ రామచంద్రమూర్తి గారు కూడా అక్కడే ఉన్నారు. అక్కడ నుండి వెలువడే ఒక ఆధ్యాత్మిక పత్రికకు గౌరవ సంపాదకులుగా ఉండేవారు.వారితో కాసేపు ముచ్చటించాను. ఆ సమయంలో ఒక 60 ఏండ్ల స్త్రీ ఒకామె అమ్మ వద్దకు వచ్చి, "అమ్మా! నాకు ఏదైనా మంత్రోపదేశం చెయ్యండి, రోజూ దానిని శ్రద్ధగా చదువుకుంటాను." అని ప్రార్ధించింది. అందుకు,అమ్మ, "నాకే మంత్రమూ రాదు తల్లి, ఇంక నీకేమి బోధిస్తాను." అని అన్నారు. అదీ గాక అమ్మ ఆమెను కుశల ప్రశ్నలు వేసే సందర్భంలో, "తల్లీ! నీకు కోడళ్ళు, అల్లుళ్ళు వచ్చారా?" అని అడిగింది. అందుకు ఆమె, "వచ్చారు,అమ్మా!" అని చెప్పింది. వెంటనే జిల్లెళ్ళమూడి అమ్మ ఆమెతో ఇలా అన్నది, "కూతుళ్ళనూ, కోడళ్ళనూ ఒకే రకంగా చూసుకో! అదేవిధంగా కొడుకులనూ, అల్లుళ్ళనూ ఒకే రకంగా చూసుకో! ఈ వయసులో చేయవలసిన సాధన ఇదే. అద్వైతం అంటే కూడా ఇదే!" అని ఉపదేశించింది. ఆమాటలు నేటికీ నా చెవిలో ప్రతిధ్వనిస్తుంటాయి.

ప్రముఖనటి సావిత్రి బతికున్న రోజులవి. ఆ రోజుల్లో, ఒకసారి జిల్లెళ్ళమూడి అమ్మ మద్రాసుకు వెళ్లారు. అక్కడ ఒక భక్తురాలి గృహంలో అమ్మ విడిదిచేసి ఉన్నప్పుడు సినిమా నటి సావిత్రి అమ్మ దర్శనానికి వచ్చింది. దర్శనం తర్వాత వెళుతూ, జిల్లెళ్ళమూడి అమ్మను తన గృహానికి కూడా రమ్మని వేడుకొంది. అమ్మ మౌనంగా విన్నది. సావిత్రి ఏమనుకుందో ఏమో, "అలా రావడానికి మీరేం తీసుకుంటారమ్మా?" అని వెంటనే అడిగింది. అమ్మ చిరునవ్వుతో, తాను ఇచ్చే అమ్మనే గాని తీసుకునే అమ్మను కానని, జవాబు చెప్పింది. దైవత్వం,మాతృత్వమంటే అలా ఉంటాయి. సావిత్రికి అప్పటివరకూ తారసపడిన గురువులందరూ తీసుకున్నవారే కావటం వల్ల, సావిత్రి అలా అడిగి ఉండవచ్చు.
 

అమ్మ దివ్యస్మృతికి సభక్తిక సమర్పణ!

మరిన్ని శీర్షికలు
weekly horoscope March 28- April 03