గోదావరి నేపథ్యంలో సినిమాలు తెరకెక్కించడంలో వంశీ స్పెషలిస్ట్. గోదావరి యాస, గోదావరి సంస్కృతీ ఆయన సినిమాల్లో కన్పించినంత గొప్పగా, వేరే సినిమాల్లో కనిపించవనడం అతిశయోక్తి కాదు. వంశీ ఈ మధ్యకాలంలో సినిమాలు తీయడం కాస్త తగ్గించినా, ఆయన సినిమా వస్తోందంటే సినీ వర్గాల్లో ప్రత్యేకమైన క్రేజ్ వుంటుంది.
అలా వంశీ కొత్త సినిమా ‘తాను మొన్నే వెళ్ళిపోయింది’ పేరుతో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రతి సినిమా పోస్టర్ డిజైనింగ్లో ప్రత్యేకతను చాటే వంశీ, ఈ సినిమా కోసమూ అనేక ప్రత్యేకతలను మోసుకొస్తున్నారు. మొత్తం 116 రకాలైన పోస్టర్ డిజైన్స్ని తయారు చేయించారట వంశీ. టార్గెట్ 150 పెట్టుకున్నా, ఇప్పటిదాకా 116 డిజైన్స్ని తయారు చేయించి వాటిని విడుదల చేయబోతున్నారు.
సాధారణంగా పదో, పాతికో, యాభయ్యో డిజైన్స్ చేయించి వదిలేస్తుంటారు ఒక్కోసారి. పాతిక దాటితే చాలా కష్టమే అవుతుంది. అలాంటిది 116 డిజైన్స్ తయారు చేయించడమంటే ఎంత కష్టంతో కూడుకున్న పని చెప్పండి? కష్టమైనా ఇష్టంతో చేయించారట వంశీ వాటిని. పోస్టర్లతో సరికొత్త రికార్డు సృష్టించబోతున్న వంశీ, సినిమాతో ఇంకెన్ని ప్రత్యేకతలు మోసుకొస్తారో చూడాలిక.
|